సౌదీఅరేబియాలో కోదాడ వాసి మృతి | - | Sakshi
Sakshi News home page

సౌదీఅరేబియాలో కోదాడ వాసి మృతి

May 16 2025 1:48 AM | Updated on May 16 2025 1:48 AM

సౌదీఅ

సౌదీఅరేబియాలో కోదాడ వాసి మృతి

కోదాడరూరల్‌: సౌదీఅరేబియాలో కోదాడ పట్టణానికి చెందిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణంలోని కౌసర్‌నగర్‌కు చెందిన షేక్‌ తాజుద్దీన్‌(49) ఉపాధి కోసం పదేళ్ల కిందట సౌదీఅరేబియాకు వెళ్లాడు. అక్కడ దమామ్‌ పట్టణంలో నివాసముంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు ఇండియాకు వచ్చి వెళ్తుండేవాడు. నెల రోజుల క్రితం సౌదీఅరేబియాలో తనకు పరిచయం ఉన్న కపిల్‌ పేరు మీద తాజుద్దీన్‌ లైసెన్స్‌ తీసుకొని కూరగాయల వ్యాపారం మొదలుపెట్టాడు. కొన్నిరోజుల తర్వాత షాపు లైసెన్స్‌ తన పేరు మీద ఉంది కావును షాపును తనకు అప్పగించి వెళ్లిపోవాలని కపిల్‌ తాజుద్దీన్‌ను బెదిరించసాగాడు. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీన తాజుద్దీన్‌ అనుమానాస్పదస్థితిలో కాలిపోయి చావుబతుకుల మధ్య ఉంటే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తాజుద్దీన్‌ మృతిచెందినట్లు అతడి స్నేహితులు ఫోన్‌ చేసి తాజుద్దీన్‌ కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. తాజుద్దీన్‌ మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు, నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

మార్చి 3న అక్కడకు వెళ్లి..

జనవరి 6న తాజుద్దీన్‌, అతడి భార్య షాజహాన్‌ కలిసి ఇండియాకు వచ్చారు. మార్చి 3న తిరిగి సౌదీఅరేబియాకు వెళ్లి రూ.10లక్షల అప్పులు తీసుకొచ్చి కూరగాయల షాపు పెట్టినట్లు తాజుద్దీన్‌ భార్య తెలిపారు. షాపు పెట్టిన తర్వాత కపిల్‌ షాపు తనకు అప్పగించాలని బెదిరించినట్లు ఆమె పేర్కొన్నారు.

వ్యక్తి మృతికి కారణమైన నిందితుడికి జైలుశిక్ష

చివ్వెంల(సూర్యాపేట): వ్యక్తి మృతికి కారణమైన నిందితుడికి ఐదేళ్లు జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయ మూర్తి పి. లక్ష్మీశారద గురువారం తీర్పు వెలువరించారు. ఆత్మకూర్‌ (ఎస్‌) మండలం దాచారం గ్రామానికి చెందిన బొమ్మగాని శ్రీనివాస్‌కు అదే మండలం తుమ్మల పెన్‌పహాడ్‌ గ్రామ శివారులో 14 గుంటల భూమి ఉంది. అందులో 2 గుంటల భూమిని 2005లో తుమ్మల పెన్‌పహాడ్‌ గ్రామానికే చెందిన సల్లగుండ్ల బజార్‌కు విక్రయించాడు. దాని పక్కనే మరో 3 గుంటల భూమిని 2020లో బోట్యా తండాకు చెందిన గుగులోతు బుజ్జ మ్మకు విక్రయించాడు. 2020 జూన్‌ 16న బుజ్జ మ్మకు విక్రయించిన భూమిని కొలిచేందుకు గ్రామానికి చెందిన కొంతమంది పెద్దమనుషులను తీసుకుని వెళ్లాడు. భూమిని కొలుస్తుండగా.. పక్కనే భూమి ఉన్న సల్లగుండ్ల బజార్‌, అతడి భార్య యల్లమ్మ, కుమారుడు పవన్‌, అల్లుడు ఎర్ర సుమన్‌ అక్కడకు వచ్చి వారిని అడ్డుకున్నారు. తమకు విక్రయించిన భూమికి వాస్తు కోసం ఇంకా కొంత భూమి ఇవ్వాలని బొమ్మగాని శ్రీనివాస్‌తో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో నల్లగుండ్ల బజార్‌ బొమ్మగాని శ్రీనివాస్‌ గుండైపె బలంగా గుద్దడంతో శ్రీనివాస్‌ స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని అక్కడే ఉన్న పెద్దమనుషులు సూర్యాపేటలోని ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతిచెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ విఠల్‌రెడ్డి సల్లగండ్ల బజార్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పలువురు సాక్షులను విచారించిన న్యాయమూర్తి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కొంపల్లి లింగయ్య వాదనలతో ఏకీభవిస్తూ నిందితుడు సల్లగుండ్ల బజార్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు లైజన్‌ ఆఫీసర్‌ గంపల శ్రీకాంత్‌, కోర్టు కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు సహకరించారు.

గుండెపోటుతో సీపీఎం నేత చిట్యాల బుచ్చిరెడ్డి మృతి

చౌటుప్పల్‌ రూరల్‌: చౌటుప్పల్‌ మండలం పంతంగి గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్‌ నాయకుడు చిట్యాల బుచ్చిరెడ్డి గుండెపోటుతో గురువారం మృతిచెందారు. రామన్నపేట తాలుకాలో సీపీఎం నిర్మాణం కోసం ఆయన ఎంతో కృషిచేశారు. గీత కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేశారు. నక్సలైట్ల హిట్‌ లిస్ట్‌లో ఉన్నా కూడా ధైర్యంతో చౌటుప్పల్‌ ప్రాంతంలో పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. బుచ్చిరెడ్డి అంత్యక్రియలు శుక్రవారం పంతంగి గ్రామంలో నిర్వహించనున్నట్లు సీపీఎం గ్రామశాఖ కార్యదర్శి రత్నం శ్రీకాంత్‌ తెలిపారు. బుచ్చిరెడ్డి మృతదేహానికి పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బూర్గు కృష్ణారెడ్డితో పాటు సీపీఎం నల్లగొండ జిల్లా కమిటీ సభ్యులు పుచ్చకాయల నర్సిరెడ్డి, ఎండీ సలీం, భువనగిరి జిల్లా కమిటీ సభ్యుడు ఎండీ పాషా తదితరులు నివాళులర్పించారు.

సౌదీఅరేబియాలో కోదాడ వాసి మృతి
1
1/1

సౌదీఅరేబియాలో కోదాడ వాసి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement