‘వంతారా కన్జర్వేటరీ’పై రిలయన్స్ ఆసక్తి
రూ.3 వేల కోట్లతో ‘ఫుడ్లింక్’3 అత్యాధునిక హోటళ్లు
గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ఒప్పందాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వినోదం, పర్యాటక రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు దేశ, విదేశాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సదస్సులోనే పలు కీలక ఒప్పందాలు కూడా కుదరనున్నాయి. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుని సంతకాలు చేయనున్నారు.
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కూడా తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకు వస్తోంది. ‘వంతారా ప్రాజెక్టు’ కింద జంతు రక్షణ, పునరావాస కేంద్రం, వైల్డ్లైఫ్ కన్జర్వేటరీ, నైట్ సఫారీ ఏర్పాటుకు రిలయన్స్ ఆసక్తి చూపుతోంది. ఈ భారీ ప్రాజెక్టు రాష్ట్ర పర్యాటక రంగానికి కొత్త రూపురేఖలు ఇస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ సదస్సులోనే ‘ఫుడ్లింక్ ఎఫ్ అండ్ బీ హోల్డింగ్స్’సంస్థ రూ.3 వేల కోట్ల పెట్టుబడితో భారత్ ఫ్యూచర్ సిటీలో మూడు అత్యాధునిక హోటళ్ల నిర్మాణానికి సంబంధించిన ఒప్పందం కుదు ర్చుకోనుంది. ఈ మూడు కీలక ఒప్పందాలపై గ్లోబల్ సమ్మిట్లోనే అధికారికంగా సంతకాలు చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ పెట్టుబడులతో తెలంగాణ వినోదం, పర్యాటక రంగాల్లో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పడతాయంటున్నారు.


