గోదావరి జిల్లాలో కనిపించే పచ్చదనంపై తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. నరుడి దిష్టికి రాయి కూడా పగిలిపోతుందని అంటారంటూ ఆయన చేసిన కామెంట్లపై తెలంగాణ నాయకులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే పవన్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి, జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు.
పవన్ కల్యాణ్కు సిగ్గుంటే తెలంగాణను వదిలేసి ఆంధ్రాలో ఉండాలని ఒక వీడియోతో బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ నుండి పరిగెత్తించి తరిమి కొడతామని హెచ్చరించారు. గతంలో సినిమాలు ఆడడానికి తెలంగాణ అంటే ఇష్టం అని, ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వగానే మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే ఇక్కడి యువత పరిగెత్తించి తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వార్నింగ్ ఇచ్చారు.
పవన్ కల్యాణ్కు తెలంగాణపై అక్కసు ఉంటే... హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవాలని కోరారు. తెలంగాణ విషయంలో తన వైఖరి మార్చుకోకపోతే ఆయన సినిమాలు కూడా తెలంగాణలో ఆడవని హెచ్చరించారు. సినిమాల షూటింగ్లు చేసుకోవడానికి, సినిమాలు నడిపించిపోవడానికి, వాళ్లు అభివృద్ధి చెందడానికి మాత్రమే తెలంగాణ అవసరం ఉంటుందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతమంటే ఎంత వివక్షనో ఇప్పడు బయటపడిందని పవన్ కల్యాణ్పై భగ్గుమన్నారు.


