
జీపీలకు భవనాలేవి..?
మహబూబాబాద్: జిల్లాలోని సగానికి పైగా గ్రామపంచాయతీ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. కేవలం 175 జీపీలకు శాశ్వత భవనాలు ఉండగా 307 కార్యాలయాలకు పక్కా భవనాలు లేక ప్రభుత్వ పాఠశాల భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర భవనాల్లో కొనసాగుతోన్నాయి. మరికొన్ని మాత్రం అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఆయా భవనాల్లో కనీస సౌకార్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది ఆవేవన వ్యక్తం చేస్తున్నారు.
482 గ్రామపంచాయతీలు
జిల్లాలో 18 మండలాలు.. 482 గ్రామపంచాయతీలు ఉండగా 6,35,872 మంది జనాభా, 5,61,960 ఓటర్లు ఉన్నారు. 1,69,556 గృహాలు ఉన్నాయి. కాగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 24 మంది సీనియర్ పంచాయతీ కార్యదర్శులు 401 అవుట్ సోర్సింగ్ 12 మొత్తం 437 మంది పని చేస్తున్నారు. 45 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 1,805 మంది గ్రామపంచాయతీ కార్మికులు పని చేస్తున్నారు.
సొంత భవనాలు లేనివి 307 కార్యాలయాలు
482 జీపీలకు గాను 175 గ్రామపంచాయతీల కార్యాలయాలకు సొంత భవనాలు ఉన్నాయి. 307 జీపీల కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. దీంతో చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలో తక్కువ సంఖ్యలో అంగన్వాడీ కేంద్రాల్లో భవనాల్లో నిర్వహిస్తున్నారు. కొన్ని మాత్రమే అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాటి అద్దె ఆయా జీపీల నిధుల నుంచే చెల్లించాలి. ప్రత్యేక బడ్జెట్ ఏమీ ఉండదని అధికారులు పేర్కొన్నారు.
నిర్మాణ దశలో 255 భవనాలు
ఆర్జీఎస్కే కింద జిల్లాకు 10 జీపీ కార్యాలయాల భవనాలు, ఎస్టీ కాంపోనెంట్ నిధులతో 103 కార్యాలయాల భవనాలు, ఎన్ఆర్ఈజీఎస్లో 152 కార్యాలయాల భవనాలు మంజూరయ్యాయి. కాగా, కేవలం 10 మాత్రమే పూర్తి కాగా 255 భవనాలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. వాటి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని మధ్యలోనే నిలిపివేశారు. సంబంధిత అధికారులు దృష్టి సారిస్తేనే పనులు పూర్తి అవుతాయి. 175 జీపీలకు సొంత భవనాలు ఉండగా 10 పూర్తిగా కాగా మిగిలిన 255 పూర్తి అయితే మరో 42 జీపీలకు భవనాలు నిర్మించాల్సి ఉంటుంది.
పెండింగ్లోనే వేతనాలు..
1,805 మంది జీపీ కార్మికులు ఉండగా వారి వేతనాలు మూడు నెలలుగా పెండింగ్లో ఉన్నాయి. వారికి నెలకు రూ.9,500 జీతం ఉండగా ప్రతి నెలా రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు విడుదల చేయించాలని ఇటీవల కార్మికులు అధికారులకు వినతి పత్రం అందచేశారు.
అద్దె సమస్య లేదు
175 కార్యాలయాలు సొంత భవనాల్లో ఉండగా మిగిలినవి చాలా వరకు అద్దె లేకుండా ఉన్న భవనాల్లో నిర్వహిస్తున్నాం. కొన్ని మాత్రమే అద్దె భవనాల్లో ఉన్నాయి. జీపీ నుంచే చెల్లిస్తున్నారు. ఆ సమస్య ఏమీ లేదు. నూతన భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేశాం. అవి పూర్తయితే చాలా వరకు సమస్య తీరుతుంది.
– హరిప్రసాద్, డీపీఓ
జిల్లాలో 482 గ్రామపంచాయతీలు
175 జీపీలకు మాత్రమే సొంత భవనాలు
నిర్మాణ దశలో 265..