
పౌర కార్మికుల సేవలు పర్మినెంట్
శివాజీనగర: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పౌర కార్మికుల సేవలను పర్మినెంట్ చేసినట్లు బెంగళూరు నగరాభివృద్ధి శాఖ మంత్రి, డీసీఎం డీ.కే.శివకుమార్ అన్నారు. మేడేను పురస్కరించుకొని బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో గురువారం రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో కలిసి పౌర కార్మికులకు సేవా క్రమబద్దీకరణ నియామక పత్రాలు పంపిణీ చేశారు. డీకే శివకుమార్ మాట్లాడుతూ మొత్తం 12,692 మంది పౌర కార్మికులకు పర్మనెంట్ నియామక పత్రాల పంపిణీ చేసినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పారిశుధ్య కార్మికులను పర్మనెంట్ చేయటం ద్వారా వారి బతుకుల్లో మార్పు తెచ్చి, సమాజంలో సమానత్వం తీసుకొచ్చే పని చేసిందన్నారు. సమాజం భద్రంగా ఉండేందుకు నాలుగు ఆధార స్థంభాలు ఉండాలి. అవి వ్యవసాయ, కార్మిక, సైనిక, ఉపాధ్యాయ స్తంభాలు. కార్మికులు ఈ సమాజపు ఆధారస్తంభం. తమ ప్రభుత్వం పౌర కార్మికులను దేవుడి బిడ్డలు, పరిశుభ్ర రాయబారులుగా భావిస్తోందన్నారు. మీరు సమాజపు ఆరోగ్యాన్ని కాపాడుతున్న వైద్యులు అని అన్నారు.
మీ వల్లే బెంగళూరుకు అంతర్జాతీయ ఖ్యాతి
మీరు బెంగళూరు నగరాన్ని సుందరంగా ఉంచి సేవలు చేసినందుకు ఈ నగరానికి ప్రపంచ స్థాయిలో పేరు వచ్చింది. ప్రపంచానికే పెద్ద సేవలు చేసే కార్మికుల రోజు ఇది అని డీసీఎం ప్రశంసించారు. పౌర కార్మికులు తమ పిల్లలను విద్యావంతులుగా, పెద్ద ఉద్యోగాన్ని అలంకరించేటట్లు చేయాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. నేడు మీ జీవితాల్లో మార్పు అవుతున్న చాలా పవిత్రమైన దినం అని అన్నారు.
మల్లికార్జున ఖర్గె సేవలు చారిత్రాత్మకం
మల్లికార్జున ఖర్గే కార్మిక మంత్రిగా చేసిన పనులు దేశ చరిత్ర పుటల్లోకి చేరాయని. దేశ వ్యాప్తంగా ఈఎస్ఐ ఆసుపత్రి, మెడికల్ కాలేజీలను ఆరంభించారని, అందువల్ల వారి ద్వారానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని తీర్మానించినట్లు డీకే శివకుమార్ అన్నారు. పారిశుధ్య కార్మికుల అభివృద్ధి కోసం పాలికె బడ్జెట్లో రూ.600 కోట్లు కేటాయించామన్నారు. ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా మిమ్మల్ని పర్మినెంట్ చేశామన్నారు. సింధుత్వ విషయంలో వివాదానికి గురైన కారణంగా కొందరికి పర్మినెంట్ కాలేదు. ఈ విషయంపై ప్రత్యేకంగాా బూత్ ఆరంభించి, మీ ఆధారాలను పరిశీలించి మీ అందరికీ న్యాయం చేస్తామని వాగ్దానం చేశారు.
దశల వారీగా ఐపీడీ సాలప్ప నివేదిక అమలు
ఐపీడీ సాలప్ప సమర్పించిన నివేదికను దశలవారీగా అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మీ పిల్లల భవిష్యత్ కోసం అనేక కార్యక్రమాలు రూపొందించి రూ.700 కోట్లు కేటాయించామన్నారు. రిటైర్డ్ అయినపుడు రూ.10 లక్షల సొమ్మును డిపాజిట్ చేసి రూ.6 వేల పింఛన్ లభించేటట్లు పథకం రూపొందించామన్నారు. 2017లో సిద్దరామయ్య ప్రభుత్వం నేరుగా 10 వేల మంది పారిశుధ్య కార్మికుల నియామకం చేపట్టిందని గుర్తు చేశారు. 2024–25వ సంవత్సర బడ్జెట్లో ఆరోగ్య బీమా ప్రకటించామని ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, మంత్రులు రామలింగారెడ్డి, కృష్ణభైరేగౌడ, రహీం ఖాన్, కే.హెచ్.మునియప్ప, హెచ్.సీ.మహాదేవప్ప, భైరతి సురేశ్, ఎమ్మెల్యేలు రిజ్వాన్ హర్షద్, ఎస్.టీ.సోమశేఖర్, ఆనేకల్ శివణ్ణ, ఎం.సీ.శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఎస్.రవి, యూ.బీ.వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
12,692 మందికి శాశ్వత సేవా నియామక పత్రాల పంపిణీ
సీఎం సమక్షంలో అందజేసిన డిప్యూటీ సీఎం శివకుమార్

పౌర కార్మికుల సేవలు పర్మినెంట్