
రంగస్థలానికి పుట్టినిల్లు బళ్లారి
బళ్లారిటౌన్: రంగస్థల కళకు పుట్టినిల్లు బళ్లారి జిల్లా అని కలబుర్గి రంగాయణ డైరెక్టర్ డాక్టర్ సుజాత జంగమశెట్టి పేర్కొన్నారు. సోమవారం సాంస్కృతిక సముచ్ఛయ భవనంలో ఏర్పాటు చేసిన సమాలోచన కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. కలబుర్గి రంగాయణ కళ్యాణ కర్ణాటకలో 7 జిల్లాల పరిధిని కలిగి ఉందన్నారు. ఈ జిల్లాల్లో పూర్వం నుంచి వస్తున్న రంగస్థల కళలను కాపాడుకోవాలన్నారు. జిల్లాలో జోళదరాశి దొడ్డనగౌడ, బళ్లారి రాఘవ, బెళగల్ ఈరణ్ణ, సుభద్రమ్మ మన్సూర్ లాంటి అనేక మహా కళాకారులు కళా రంగానికి చేసిన సేవలు అపారం అని కొనియాడారు. పాఠశాల, కళాశాలల్లోను నాటక రంగంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు పాఠశాల దశ నుంచి కళలపై ఆసక్తి పెంపొందించాలన్నారు. ఈ ప్రాంతంలో బయలాట, దొడ్డాట, తోలుబొమ్మలాట కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇందులో లింగత్వ అల్పసంఖ్యాతులు కూడా ఆసక్తి చూపాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మరాఠి, తెలుగు భాషల రంగస్థల కళాకారులతో జత కలిసి నాటక శిబిరాలను చేపడుతున్నట్లు తెలిపారు. కన్నడ సాంస్కృతిక శాఖ ఏడీ నాగరాజ్, ఇతర కళాకారులు పాల్గొన్నారు.