
ద్రాక్ష సాగు.. లాభాలు బాగు
సాక్షి,బళ్లారి: ఈసారి మామిడి తోటలు ఉన్న రైతులకు నష్టాలు వస్తుండటంతో పాటు కర్బూజా, పుచ్చకాయ, అరటి తదితర పండ్ల తోటలు సాగు చేసిన రైతులు కూడా పెట్టుబడులతో సరిపెట్టుకునే పరిస్థితి నెలకొంది. అయితే ద్రాక్ష తోటలు సాగు చేసిన రైతులకు మార్కెట్లో ఽద్రాక్ష ధరలు పెరగడంతో పాటు నిలకడగా ఒకే రకమైన ధర కొనసాగుతుండడంతో గత మూడేళ్లతో పోలిస్తే, ఈ ఏడాది ద్రాక్ష సాగు చేసిన రైతులు లాభాలు గడిస్తున్నారు. ద్రాక్ష తోటల సాగుకు పెట్టిన పేరుగా నిలిచిన ఒక్క విజయపురలో దాదాపు ఒక లక్ష ఎకరాల్లో ద్రాక్ష సాగు చేసి రైతులు అక్కడ నుంచి దేశ, విదేశాలకు తాజా ద్రాక్షతో పాటు, ఎండు ద్రాక్షను తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు. అలాగే ఉత్తర కర్ణాటక పరిధిలోని బెళగావిలో దాదాపు 35 వేల ఎకరాలు, బాగల్కోటె జిల్లాలో దాదాపు 40 వేల ఎకరాల్లో ద్రాక్షను సాగు చేస్తుండగా, బళ్లారి, గదగ్, విజయనగర, కొప్పళ తదితర జిల్లాల్లో అక్కడక్కడ ద్రాక్ష సాగు చేశారు. వివిధ జిల్లాల్లో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో ద్రాక్ష సాగు చేసిన రైతులు ఈసారి అధిక లాభాలు గడించి ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఎండ వేడిమికి అల్లాడుతున్న ప్రజలకు రుచికరమైన, ఎంతో తియ్యనైన ద్రాక్షను పండించి మేలు చేస్తున్నారు.
తాజా ద్రాక్షతో ఎండుద్రాక్ష తయారీ
విజయపుర జిల్లాలో విస్తారంగా సాగు చేసిన ద్రాక్ష రైతులు తాజా పచ్చిద్రాక్షతో ఎండు ద్రాక్షను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. ప్రస్తుతం తాజా పచ్చి ద్రాక్ష ధర బహిరంగ మార్కెట్లో కిలో రూ.60ల నుంచి రూ.100ల వరకు పలుకుతుందంటే రైతుల వద్ద ద్రాక్ష పొలాల్లో రూ.40 నుంచి రూ.50లకు కొనుగోలు చేస్తుండటంతో రైతులు మంచి లాభాలు గడించేందుకు వీలవుతోందని చెప్పవచ్చు. మూడేళ్ల నుంచి ద్రాక్ష రైతులు పెట్టుబడులతోనే సరిపెట్టుకుని ఆర్థికంగా నష్టపోయిన తరుణంలో ఈసారి అనూహ్య పరిణామాలతో ద్రాక్ష పంట సాగు చేసిన రైతులకు మార్కెట్లో మంచి ధర పలుకుతుండటంతో రైతులతో పాటు వారి వద్ద పని చేసే వ్యవసాయ కూలీలకు కూడా చేతినిండా పని దొరుకుతూ ఆనందంగా ఉంటున్నారు. ఒక్క రైతులే కాదు వ్యవసాయ కూలీలు, మార్కెట్లో వ్యాపారులు, చిరు వ్యాపారులు కూడా ద్రాక్ష అమ్మకాల వల్ల లబ్ధి పొందుతున్నారు. తాజా పచ్చి ద్రాక్షతో పాటు ఎండు ద్రాక్ష తయారు చేస్తూ ఈ ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎండు ద్రాక్ష తయారు చేయడంలో కూడా విజయపుర జిల్లాకే అగ్రస్థానం దక్కింది.
ఎండుద్రాక్షతో లాభాలు మెండు
ఇక్కడ దాదాపు లక్ష ఎకరాల్లో ద్రాక్ష సాగు చేస్తుండగా, అందులో దాదాపు 80 శాతం ద్రాక్షను ఎండు ద్రాక్షగా మారుస్తున్నారు. తాజా పచ్చి ద్రాక్ష వల్ల ఒక కేజీకి రైతులకు రూ.50లు ధర లభిస్తుండగా, ఎండు ద్రాక్ష వల్ల మరింత లాభాలు అందుతున్నాయి. ఎండు ద్రాక్ష తయారీకి యంత్రాలు, అది కూడా ఒక రకమైన పరిశ్రమగా మార్చుకుని రైతులు రెండు విధాలుగా లాభాలు గడిస్తున్నారు. దాదాపు నాలుగు కేజీల తాజా పచ్చి ద్రాక్షను ప్రాసెసింగ్ చేసి, ఎండబెట్టి రుచికరమైన ఎండు ద్రాక్షిని తయారు చేస్తున్నారు. విజయపుర జిల్లాతో పాటు కర్ణాటకలో బెళగావి, బాగల్కోటె జిల్లాల్లో ఎండుద్రాక్షిని తయారీ చేస్తున్నారు. ఇక్కడ ఎండు ద్రాక్షతో పాటు వైన్ తయారీకి ఉపయోగించే రుచికరమైన ద్రాక్షను పండిస్తుండటంతో వైన్ తయారు చేసే కంపెనీలు ద్రాక్ష రైతులతో కొనుగోలు చేస్తున్నారు. వైన్ తయారీకి తాజా నల్లద్రాక్షకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈసారి అన్ని రకాల వైరెటీ ద్రాక్షలకు మంచి ధరే పలుకుతుందని, దీంతో వైన్ తయారీ చేసేందుకు ఉపయోగించే ద్రాక్షకు కూడా మరింత గిరాకీ లభిస్తోందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది పెట్టుబడులు పోను ఒక ఎకరాకు దాదాపు రూ.2లక్షలకు పైగా ఆదాయం లభిస్తోందన్నారు.
అధిక లాభాలు గడిస్తున్న
విజయపుర రైతులు
మూడేళ్ల తర్వాత
మంచి లాభాలపై ఆనందం
రూ.8 కోట్ల వరకు లావాదేవీలు
జరిపిన వైనం

ద్రాక్ష సాగు.. లాభాలు బాగు