
నేత్రపర్వంగా తిరునక్షత్రం
మండ్య: జిల్లాలోని మేలుకోటెలో సమానత్వ హరికారులు అయిన రామానుజాచార్యుల 1008వ తిరునక్షత్ర మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. 10 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో మొదటిరోజు గురువారం రామానుజాచార్యుల విగ్రహానికి విశేష అలంకారం, సర్వభూపాల వాహనోత్సవం కనులవిందుగా జరిగింది. శుక్రవారం హంస వాహనోత్సవం సాగుతుంది. రోజూ ఉదయం 5:30 నుంచి 8 గంటల వరకు వివిధ వాహన సేవలు ఆలయ ప్రాంగణంలో జరుగుతాయి.
రూ.17 వేల కోట్ల స్కాంపై లేఖ
బనశంకరి: అమృత్ యోజన పథకం అమలు పేరుతో రూ.17 వేల కోట్ల నిధులను ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యే దుర్వినియోగానికి పాల్పడ్డారని, దీనిపై ప్రధానమంత్రి, కేంద్ర గృహ నిర్మాణ నగరాభివృద్ధి శాఖమంత్రికి 7,281 పేజీలతో ఆధారాల సమేతంగా ఫిర్యాదు చేసినట్లు బీజేపీ నేత ఎన్ఆర్.రమేశ్ చెప్పారు. ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కేంద్రం రాష్ట్ర నగరాభివృద్ధి శాఖ కార్యదర్శికి లేఖ రాసిందని తెలిపారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడం సంబంధించి వారంలోగా నివేదిక అందించాలని ఆదేశించిందని చెప్పారు.
బీజేపీ ఐటీ సెల్పై కేసు
శివాజీనగర: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మీద బీజేపీ నేతలు చేసిన పోస్టింగ్ గురించి బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినపుడల్లా ఉగ్రవాదుల దాడి జరుగుతోంది అని కర్ణాటక బీజేపీ ఐటీ సెల్ పోస్ట్ చేసినట్లు ఆరోపించారు. ఇది రాహుల్గాంధీ మీద తప్పుడు ప్రచారం చేసేలా ఉందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక బీజేపీ ఐటీ సెల్ మీద ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదైంది.
బస్సులో కండక్టర్ వెకిలి చేష్టలు
యశవంతపుర: మంగళూరు నగరంలోని ముడిపు–స్టేట్బ్యాంక్ మార్గంలో యువతిని లైంగికంగా వేధించిన కేఎస్ ఆర్టీసీ కండక్టర్ను మంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బాగలకోటకు చెందిన కండక్టర్ ప్రదీప్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 22న ముడిపు నుంచి స్టేట్ బ్యాంక్కు వెళుతున్న బస్సులో యువతి ఎక్కి నిద్రమత్తులోకి జారిపోయింది. ఆ సమయంలో యువతిని కండక్టర్ అసభ్యంగా తాకుతూ ఉండగా ఓ ప్రయాణికుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్టు చేశాడు. దీనిని గమనించిన నెటిజన్లు కండక్టర్ మీద మండిపడ్డారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రదీప్ను సస్పెండ్ చేయగా, పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
బైక్ను ట్రాక్టర్ ఢీ,
తండ్రీ పిల్లలకు గాయాలు
చింతామణి: బైక్ను ట్రాక్టర్ ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చింతామణి పట్టణంలోని తాలూకాఫీసు పక్కన గురువారం ఈ ప్రమాదం జరిగింది. శాంతినగరకు చెందిన సుబ్రమణి, కుమారుడు ధనుష్కుమార్, కూతురు శ్రావణి బైక్లో వెళుతుండగా ట్రాక్టర్ వేగంగా వచ్చి ఢీకొనింది. తండ్రి సుబ్రమణికి తీవ్రగాయాలు కావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి కోలారు ఆస్పత్రికి తరలించారు. చిన్నారులకు ఓ మోస్తరుగా గాయాలు తగిలాయి. పట్టణంలో లారీలు, ట్రాక్టర్లు ఇష్టానుసారం సంచరిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని, పోలీసులు నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు.
మారెమ్మదేవికి నువ్వుల అలంకారం
బొమ్మనహళ్లి: బొమ్మనహళ్ళి నియోజకవర్గం పరంగిపాళ్యలో వెలసిన గ్రామదేవత మారెమ్మదేవి అమ్మవారికి గురువారం నల్ల నువ్వులతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అమ్మవారికి మహా మంగళహారతి ఇచ్చి భక్తులకు దర్శనం కల్పించారు.

నేత్రపర్వంగా తిరునక్షత్రం

నేత్రపర్వంగా తిరునక్షత్రం