
చెన్నకేశవునికి సూర్యాభిషేకం ●
● 4 ఏళ్ల తరువాత సాకారం
దొడ్డబళ్లాపురం: నాలుగు సంవత్సరాల తరువాత అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. హాసన్ జిల్లా బేలూరులోని సుప్రసిద్ధ చెన్నకేశవస్వామి దేవాలయంలో స్వామి విగ్రహాన్ని సూర్య కిరణాలు తాకాయి. గత నాలుగేళ్లుగా వర్షాలు, వాతావరణంలో మార్పుల వల్ల సూర్య కిరణాలు స్వామి విగ్రహాన్ని స్పర్శించలేదు. ప్రతి ఏడాది ఏప్రిల్ 21 లేదా 22 తేదీల్లో ఈ అద్భుతం జరుగుతుంది. ఈసారి మంగళవారంనాడు ఉదయం 6:10 గంటలకు దేవాలయం గోపురాన్ని తాకిన సూర్య కిరణాలు 6:15కి విగ్రహాన్ని స్పృశించాయి. ఈ దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించిపోయారు.
షేర్ల పేరుతో రూ.3 లక్షలు టోపీ
మైసూరు: అతి స్వల్ప సమయంలో డబ్బు సంపాదించాలని ఆశపడి లక్షలాది రూపాయలను కోల్పోయి వంచనకు గురవుతూనే ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి రూ.3 లక్షలను కోల్పోయిన ఘటన నగరంలో జరిగింది. నగరంలోని కేఎన్పుర నివాసికి టెలిగ్రాం ద్వారా షేర్ మార్కెట్ గురించి సందేశం వచ్చింది. దీంతో అతను వంచకులు చెప్పిన గ్రూప్లో చేరారు. తర్వాత దుండగులు మీరు మా ద్వారా షేర్ మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఆర్జించవచ్చని ఆశ పుట్టించారు. వంచకుల మాటలను నమ్మిన ఆ వ్యక్తి దశల వారీగా రూ.3.05 లక్షలను వారు చెప్పిన ఖాతాలకు జమ చేసి చివరకు మోసపోయారు. ఈ ఘటనపై సైబర్క్రైం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కుమార్తె స్నేహితురాలిపై దారుణం ●
● కామాంధుడు అరెస్టు
దొడ్డబళ్లాపురం: కుమార్తె స్నేహితురాలిపై ఓ కామాంధుడు అత్యాచారం జరిపిన సంఘటన కొడగు జిల్లా మడికెరి తాలూకాలో చోటుచేసుకుంది. మధు (45) అనే వ్యక్తి సోమవారం సాయంత్రం తన కుమార్తె చేత ఫోన్ చేయించిన ఆమె స్నేహితురాలిని ఇంటికి రప్పించాడు. ముందు ఇద్దరికీ చాక్లెట్లు, ఇచ్చి మరిన్ని చాక్లెట్లు తీసుకురావాలని తన కుమార్తెను దుకాణానికి పంపించాడు. ఆ సమయంలో బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఇంతలో బాలిక తల్లి ఫోన్ చేసి కుమార్తెను పంపించాలని అడిగింది, ఆమె ఆడుకుంటోందని, కొంతసేపటికి వస్తుందని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చి బాలిక తల్లితండ్రులు మధు ఇంటికి వచ్చి చూడగా ఘోరం బయటపడింది. వారు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కామాంధున్ని అరెస్టు చేశారు.
దర్శన్కు పవిత్ర ఏమవుతారు? ●
● సుప్రీం జడ్జి ప్రశ్న
దొడ్డబళ్లాపురం: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో ప్రముఖ నటుడు దర్శన్కు హైకోర్టు కోర్టు సాధారణ బెయిలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బెయిలును రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర పోలీసులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారంనాడు విచారణ సాగింది. ఈ సందర్భంగా జడ్జి.. దర్శన్కు నిందితురాలు పవిత్రగౌడ ఏమవుతారని దర్శన్ వకీలు మను సింఘ్విని ప్రశ్నించారు. మిస్ట్రెస్ అవుతుందని లాయర్ తెలిపారు. మరి దర్శన్కు వివాహం జరిగిందా అని ప్రశ్నించగా, అవునని లాయర్ సమాధానమిచ్చారు. దర్శన్కు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని సింఘ్వి వాదించగా, అన్ని ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వ తరఫు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా తెలిపారు. మిస్ట్రెస్ అంటే ఇంగ్లీష్లో వివాహిత పురుషునితో సుదీర్ఘ కాలంగా లైంగిక సంబంధం ఉన్న మహిళ అని అర్థం. ఈ వాదనలు అందరి దృష్టినీ ఆకర్షించాయి.
సీసీబీకి ఓంప్రకాష్ హత్య కేసు
బనశంకరి: విశ్రాంత డీజీపీ ఓంప్రకాష్ హత్యకేసు దర్యాప్తును సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ) పోలీసులకు అప్పగించామని, దర్యాప్తులో హత్యకు గల కారణాలు వెలుగులోకి వస్తాయని హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. మంగళవారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే సీసీబీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. ఓంప్రకాష్ భార్యని అరెస్ట్చేసి విచారిస్తున్నారని తెలిపారు.

చెన్నకేశవునికి సూర్యాభిషేకం ●