
చెట్ల నరికివేతపై విచారణ
మైసూరు: మైసూరు నగరంలోని జిల్లా ఎస్పీ ఆఫీసు ఎదురుగా ఉన్న హైదర్ అలీ రోడ్డు వెడల్పు చేయడానికి రాత్రికి రాత్రే అధికారులు 40కి పైన పెద్ద పెద్ద చెట్లను నరికివేశారు. చెట్లు నరికేందుకు పాలికే అనుమతి ఇచ్చింది. దీనిపై అటవీ అధికారులు మండిపడ్డారు. ప్రజలు పెద్దసంఖ్యలో ఆందోళనలు కూడా చేయడం మొదలైంది. దీంతో అటవీ మంత్రి ఈశ్వర్ ఖండ్రె చెట్ల వ్యవహారం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు నరికివేశారో కారణాలతో నివేదిన ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అలాగే అటవీ అధికారులు విచారణ చేయాలని మంత్రి సూచించారు.
మెట్రోలో గుట్కా రగడ
యశవంతపుర: బెంగళూరు నమ్మ మెట్రో రైల్లో ఓ ప్రయాణికుడు గుట్కా వేసుకోవడం, ఇతర ప్రయాణికులు అభ్యంతరం చెప్పడంతో గొడవ జరిగింది. ఈ వీడియోను బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. గుట్కా సేవకునిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని బీఎంఆర్సీఎల్ను డిమాండ్ చేశారు. గుట్కా వేస్తున్న ప్రయాణికున్ని తోటి ప్రయాణికులు గట్టిగా ప్రశ్నించారు. మొదట ట్రైన్ నుంచి దిగిపోవాలని సూచించారు. మెట్రోలో ఇలాంటి పని చేయవద్దని చెప్పారు. మెట్రో నాదే, నేను గుట్కా వేస్తే మీకేమి ఇబ్బంది అని అతడు ఎదురు ప్రశ్నించాడు. దీంతో అక్కడ కొంతసేపు రభస చోటుచేసుకుంది.
విహారంలో విషాదం..
తండ్రీ కొడుకు జలసమాధి
శివమొగ్గ: సంతోషంగా సాగిన విహారయాత్ర విషాదంగా ముగిసింది. భద్రా జలాశయం నీటిలో మునిగి తండ్రీ కుమారుడు మరణించారు. ఈ దుర్ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. భద్రావతి నగరంలో ఉన్న భూతనగుడిలో ప్లై వుడ్ షాపు యజమాని మహ్మద్ జాబీర్ (55), కుమారుడు జావేద్ (15) మృతులు. సెలవు కావడంతో కుటుంబంతో కలిసి విహారానికి భద్రా జలాశయానికి వచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసి సేదదీరారు. సాయంత్రం సమయంలో జావేద్ డ్యాం గట్టున నీటిలో ఆడుకుంటూ మునిగిపోయాడు. తండ్రి జాబీర్ అతన్ని కాపాడేందుకు నీటిలోకి దిగాడు, కానీ నీటిలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు కళ్లముందే ఘోరంతో ఆర్తనాదాలు చేయసాగారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చి జలాశయంలో గాలింపు జరపగా ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. భద్రావతి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.
సునీల్శెట్టి టెంపుల్రన్
యశవంతపుర: బాలీవుడ్ నటుడు సునీల్శెట్టి కుటుంబసమేతంగా ఉడుపి జిల్లా కాపు తాలూకా హొస మారి గుడిని దర్శించుకున్నారు. దేవస్థానంలో నూతన నిర్మాణం, శిల్పాలను చూసి అబ్బురపడ్డారు. పూజలు చేసి ప్రసాదాన్ని స్వీకరించారు. దక్షిణ కన్నడ జిల్లా బప్పనాడులో జరుగుతున్న ఉత్సవాలను చూడడానికి ఆయన తల్లితో కలిసి వచ్చారు. ముల్కికి చెందిన సునీల్శెట్టి హిందీ హీరోగా ఎదిగారు.
కరెంటు తీగ పడి,
కార్మికుడు మృతి
తుమకూరు: కార్మికున్ని కరెంటు తీగ బలిగొంది. బైకు పైన వెళ్తుండగా గాలులకు కరెంటు వైరు తెగి వారి మీద పడింది. ఒకరు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం రాత్రి కొరటిగెరె తాలూకాలోని చీళగానహళ్ళి గ్రామంలో జరిగింది. యోగీష్ (42), సీ.ఎస్.నరసింహరాజు పెయింటింగ్ పనులు చేసి జీవిస్తున్నారు. పని చూసుకుని ఇళ్లకు బయల్దేరారు. భారీగా ఈదురు గాలులు రావడంతో కరెంటు స్తంభం నుంచి వైరు తెగి సరిగ్గా వారి మీదే పడింది. షాక్ కొట్టి యోగీష్ చనిపోగా నరసింహరాజకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు. కొరటిగెర పోలీసులు కేసు నమోదు చేశారు.

చెట్ల నరికివేతపై విచారణ

చెట్ల నరికివేతపై విచారణ

చెట్ల నరికివేతపై విచారణ