
జంట నగరాల్లో తాగునీటికి కటకట
హుబ్లీ: తాగునీటి సమస్య కేవలం గ్రామాల్లోనే కాకుండా హుబ్లీ ధార్వాడ జంట నగరాల ప్రజలను కూడా ఇబ్బంది పెడుతోంది. జనవరులు సంవృద్ధిగా ఉన్నా తాగునీటికి కటకట ఏర్పడింది. పాలికె పరిధిలో 20కు పైగా వార్డులలో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. మొత్తం 82 వార్డులకు గాను 12 జోన్ కార్యాలయాలు పని చేస్తున్నాయి. సుమారు 8,9 లక్షల మంది కలిగిన జంట నగరాల పాలికెకు మలప్రభ, నీరాసాగర చెరువునీరే మూలధారం. మలప్రభ నుంచి 220 ఎంఎల్డీ, నీరసాగర చెరువు నుంచి 20 ఎంఎల్డీ కలిపి రోజూ 240 ఎంఎల్డీ నీటిని సరఫరా చేసేవారు. అయితే ఇటీవల సరఫరాలో కొన్ని సాంకేతిక సమస్యలు ఏర్పడి నీటి సమస్య ఏర్పడుతోంది. నీటి సరఫరా బాధ్యతలు చేపట్టిన ఎల్ఎన్టీ సంస్థ 12 వార్డులలో మాత్రమే నీటి వసతి కల్పిస్తోంది. మరికొన్ని వార్డులలో 8, 10 రోజులకు ఓ మారు నీటిని సరఫరా చేస్తున్నారు. జాక్వెల్, పైపులైన్లలో సమస్యలు ఏర్పడి 15, 20 రోజులకు ఒక్క సారి నీటి సరఫరా అయ్యే దుస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు. 5,6,7,8,14,39,40 నుంచి 43 వరకు, అలాగే 46వ వార్డులలో ప్రయోగాత్మకంగా నిరంతర నీటి సరఫరా ప్రాంతాలుగా ప్రకటించారు. ఈ వార్డులకు కూడా పలు సమస్యల కారణంగా కొన్ని సార్లు 2,3 రోజులకు ఒకసారి నీరు సరఫరా అవుతోంది. వార్డులలో 23 అదనపు నీటి సేకరణ ట్యాంక్ల నిర్మాణం పనులు చేపట్టామని, అవి పూర్తయితే నీటి ఎద్దడి ఉండదని కేయూ ఐడీఎఫ్సీపీఆర్ఓ ప్రతిభ తెలిపారు. పాలికె కమిషనర్ రుద్రేష్ ఘాలి మాట్లాడుతూ కొన్ని వార్డులలో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదన్నారు. నీటి నిలువ కొరతతో ఈ సమస్య ఏర్పడుతోందన్నారు. త్వరలోనే ఆ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
హుబ్లీ–ధార్వాడలో మిన్నంటుతున్న దాహం కేకలు
నిరంతర నీటి సరఫరాలో అంతరాయం
కొన్ని వార్డుల్లో పదిరోజులకోమారు నీటి సరఫరా
త్వరలో సమస్యను పరిష్కరిస్తామంటున్న అధికారులు