
బ్రాహ్మణులను అవమానిస్తే సహించం
బళ్లారిటౌన్: అల్పసంఖ్యాకులైన బ్రాహ్మణులను అవమానిస్తే సహించేలేదని, తాము కూడా పరశురాములుగా తయారు కావాల్సి ఉంటుందని బళ్లారి బ్రహ్మణ సమాఖ్య అధ్యక్షుడు ప్రకాష్ రావ్, కార్యదర్శి బీకే.మూర్తులు హెచ్చరించారు. సంగనకల్లు రోడ్డులోని శంకరమఠంలో ఆదివారం విలేకరుల సమావేశంలో సమాఖ్య గౌరవ అధ్యక్షుడు బీకే.సుంధర్, జిల్లా ప్రతినిధి శ్రీనాథ్ తదితరులతో కలిసి మాట్లాడారు. సీఈటీ పరీక్షలు రాసేందుకు వెళ్లిన బ్రాహ్మణ సమాజ విద్యార్థులకు జంధ్యం తీయించి పరీక్షలు రాయించారని, తీయని వారికి పరీక్షలకు అనుమతి కల్పించలేదన్నారు. ఇది హేయమైన చర్య అని అన్నారు. దేశంలో ఇలాంటి ఘటన మొదటగా చూస్తున్నామన్నారు. దీని వెనుక ఎవరున్నారో తేల్చాలన్నారు. బాధిత విద్యార్థులకు మరోమారు పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణ విద్యార్థులను అవమానించిన వారిని సస్పెండ్ చేస్తే సరిపోదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో పోరాటం చేస్తామని అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలంటే ఇలాంటి అమానుష ఘటనలు పునరావృతం కారాదన్నారు. ఇదిలా ఉండగా కులగణనలో తమ సముదాయం కేవలం 15 లక్షల జనాభా ఉన్నట్లు తెలపడం విచారకరన్నారు. దీన్ని తాము అంగీకరించేది లేదన్నారు. ఒక్కో జిల్లాలో లక్షకుపైగా బ్రాహ్మణ జనాభా ఉందన్నారు. బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన చిత్ర నిర్మాత అనురాగ కసప్పై చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్థికంగా వెనుకబడిన తమ సముదాయానికి ఉద్యోగ, విద్య రంగంలో సరైన సదుపాయాలు లభించలేదన్నారు. మే 1,2న ఆదిశంకరాచార్య జయంతిని వైభవంగా జరపాలని తీర్మానించినట్లు తెలిపారు. మే 1న శోభయాత్ర, మే 2న జయంతి పూజ, ప్రవచన కార్యక్రమాలు లాంటివి ఉంటాయని తెలిపారు.