
కృత్రిమ మేధస్సుపై అవగాహన ఉండాలి
కొత్తపల్లి(కరీంనగర్): నేటి విద్యా విధానంలో కృత్రిమ మేధస్సుకు ప్రత్యేక స్థానం ఉందని, ఉపాధ్యాయులు కృత్రిమ మేధస్సుపై అవగాహన కలిగి ఉండాలని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డా.వి.నరేందర్రెడ్డి అన్నారు. తరగతి గదిలో కృత్రిమ మేధస్సు వాడకంపై ఆదివారం కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ–టెక్నో పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సును సీబీఎస్ఈ నిపుణులు బి.రవికిరణ్, చారు దింగ్రాతో కలిసి ప్రారంభించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అత్యుత్తమ స్థానంలో ఉండడానికి పైచేయి సాధించాలంటే కృత్రిమ మేధస్సు అవసరమన్నారు. అగ్ర దేశాలైన స్వీడన్, స్విట్జర్లాండ్, అమెరికా, బ్రిటన్లో కృత్రిమ మేధస్సుపై విశ్లేషణ జరగడంతో పాటు వినియోగిస్తున్నట్లు చెప్పారు. అలాగే అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో కృత్రిమ మేధస్సు అమలుపరిచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు నాణ్యతమైన విద్య అందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. అవగాహన సదస్సులో భాగంగా ఉపాధ్యాయులు ప్రదర్శించిన పలు చిత్రమాలికలు ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.