
రద్దు చేసుకున్నా.. రావాయే!
● స్లాట్ రద్దయినా.. డబ్బుల కోసం ఏళ్లుగా పడిగాపులు ● ధరణి పోయి భూభారతి వచ్చినా అంతేనా? ● జిల్లాలో వేయి మందికి పైగా నిరీక్షణ
వీణవంకకు చెందిన రాజిరెడ్డి 2022 మే నెలలో అదే ప్రాంతానికి చెందిన లక్ష్మి వద్ద 2.15 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసేందుకు స్లాట్ బుక్ చేశాడు. స్లాట్కు రూ.1.02 లక్షలు చెల్లించగా లక్ష్మి కుటుంబసభ్యులు నిరాకరించడంతో రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. అగ్రిమెంట్ ప్రకారం ఇచ్చిన డబ్బులను లక్ష్మి తిరిగి ఇవ్వగా ప్రభుత్వానికి చెల్లించిన స్లాట్ డబ్బులు ఏళ్లు గడిచినా రావడం లేదు. మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం శూన్యం. ఇది ఒక రాజిరెడ్డి పరిస్థితనుకుంటే పొరపాటే. జిల్లావ్యాప్తంగా స్లాట్ రద్దయిన వారందరిదీ ఇదే దుస్థితి.
కరీంనగర్ అర్బన్: జిల్లాలో వ్యవసాయ భూము ల రిజిస్ట్రేషన్ స్లాట్ రద్దు చేసుకున్న యజమానులు డబ్బుల కోసం అయిదేళ్లుగా పడిగాపులు కాస్తున్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ఏకకాలంలో పూర్తిచేయాలన్న సంకల్పంతో గత ప్రభుత్వం ధరణి పోర్టల్ రూపొందించగా తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.
ఏకకాలంలో రికార్డుల మార్పు
భూములు రిజిస్ట్రేషన్ చేయించుకునే రైతులు తొ లుత స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. బుకింగ్కు ఆయా ప్రాంతాల్లో భూముల మార్కె ట్ విలువను అనుసరించి స్లాట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించి బుకింగ్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ తేదీని నిర్ణయించి స్లాట్ బుక్ చేసుకున్న వ్యక్తికి సమాచారం అందుతుంది. ఆ రోజు తహసీల్ కార్యాలయానికి వెళ్తే అన్ని పత్రాలను పరిశీలించి నిబంధనలు అనుసరించి తహసీల్దార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడతారు.
అయిదేళ్లుగా పడిగాపులు
భూముల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నాక భూమి కొనవద్దనుకునో.. ఆ భూమిపై ఏదైనా వివాదం ఉందనో.. అప్పుడు కాక మరో సమయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనో నిర్ణయించుకొని స్లాట్ రద్దు చేసుకున్న యజమానులకు వారు చెల్లించిన డబ్బును తిరిగి ప్రభుత్వం చెల్లించాలి. జిల్లాలో వేయి మందికి పైగా స్లాట్ రద్దు చేసుకొని తమకు రావాల్సిన డబ్బుల కోసం తహసీల్, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో స్లాట్ రద్దు చేసుకున్నవారికి దాదాపు రూ.2.50 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.
ధరణి పోయి భూ భారతి వచ్చినా..
రాష్ట్రంలో ఆర్వోఆర్–2020తో పాటు ధరణి పోర్టల్ కూడా రద్దయింది. ఆ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్వోఆర్–2025(భూ భారతి చట్టం) అమల్లోకి తెచ్చింది. అయినప్పటికీ రద్దు చేసుకున్న లావాదేవీలకు సంబంధించి సొమ్ము మా త్రం పాత పద్ధతిలోనే నిలిచిపోతోంది. తిరుగు చెల్లింపులు రావడం లేదు. స్లాట్ ఫీజు ప్రభుత్వ ఖజానాలో జమవుతుందని, తిరిగి డబ్బు అక్కడి నుంచి స్లాట్ రద్దు చేసుకున్నవారికి చేరుతుందని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి.
మొదట్లో ప్రయత్నాలు జరిగినా...
2020 నవంబర్కు ముందు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారానే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగేవి. లావాదేవీలు రద్దు చేసుకుంటే చెల్లించిన సొమ్మును ఖజానా విభాగం ద్వారా తిరిగి చెల్లించేవారు. ఆ తర్వాత వాటిని ధరణికి, తాజాగా భూ భారతి పోర్టల్కు బదలాయించినా.. రద్దయిన లావాదేవీల సొమ్ము తిరిగి చెల్లిండం లేదు. భూ భారతి చట్టం అమల్లోకి వచ్చాక తిరుగు చెల్లింపులు చేసేందుకు మొదట్లో ప్రయత్నాలు జరిగినా దీనిపై దృష్టి సారించే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం జరిగిందన్న వాదనలు ఉన్నాయి.
జిల్లాలో తహసీల్దార్ కార్యాలయాలు:
15 (కరీంనగర్ అర్బన్ మినహా)
రద్దు చేసుకున్న స్లాట్లు: 1,034
రావాల్సిన నగదు: సుమారు రూ.2.50కోట్లు

రద్దు చేసుకున్నా.. రావాయే!