
అరటి సాగు వైపు అన్నదాతల చూపు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో అరటి సాగుకు రైతులు ఆసక్తి చూపుతుండగా, ఆ మేరకు ఉద్యానశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అరటి సాగు చేసే రైతులకు భారీగా సబ్సిడీలు ఇచ్చి, వరి, మొక్కజొన్న, పసుపు సాగు చేసే రైతుల దృష్టి మరల్చాలని ప్రయత్నాలు ప్రారంభించారు. అంతేకాకుండా అరటి ఉత్పత్తులకు ఉత్తర భారతదేశంలో మంచి డిమాండ్ ఉండటంతో అక్కడి వ్యాపారులు కొనుగోలు చేసేలా ఒప్పందాలు చేసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ రెండురోజుల క్రితం ఉత్తర భారత వ్యాపారులు, అరటి రైతులు, ఉద్యానశాఖ అధికారులతో సమావేశమై, పంట స్థితిగతులు, మార్కెటింగ్పై సమీక్షించారు.
అనుకూలమైన వాతావరణం
జిల్లాలో ఏడాది పొడవునా అరటికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీనికి తోడు ఎర్రటి, నల్ల రేగడి నేలలు సాగుకు అనుకూలం. వ్యవసాయ బావులు ఎక్కువగా ఉండటంతో నీటికి ఢోకా ఉండదు. జిల్లాలోని జగిత్యాల రూరల్, కోరుట్ల, మెట్పల్లి, కథలాపూర్, మేడిపల్లి, మల్యాల, పెగడపల్లి, గొల్లపల్లి, ధర్మపురి మండలాలు అరటికి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని ఉద్యానశాఖ అధికారులు నివేదికలు తయారుచేసి, రాష్ట్ర ఉన్నతాధికారులకు అందించారు.
స్థానికంగా కొనకపోవడంతో..
గతంలో జిల్లాలో 1,000 ఎకరాలకు పైగా అరటి సాగు చేసేవారు. అయితే, ఎకరాకు 25–30 మె.ట వరకు దిగుబడులు వచ్చినా లోకల్ వ్యాపారులు కొనేందుకు ససేమిరా అన్నారు. జిల్లాలో అరటి కాయలు ఉన్నా, ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లా తాడిపత్రి, మహారాష్ట్రలోని నాగ్పూర్, నాందేడ్ నుంచి కాయలు తెప్పించారు. దీంతో రైతులు పంటను తీసేశారు. ప్రస్తుతం కేవలం 10 మంది రైతులు 21 ఎకరాల్లో మాత్రమే అరటిని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వరి సాగును వీలైనంత తగ్గించి, ఉద్యానపంటల వైపు రైతులను మళ్లించాలని చూస్తున్నారు. అరటి ఏడాది పంట కాబట్టి వేరుశనగ, పెసర వంటి పంటలు సాగు చేయవచ్చని, దీంతో మరింత ఆదాయం పెరుగుతుందని సూచిస్తున్నారు.
ఉత్తరాది వ్యాపారులు కొనుగోలు చేసేలా..
మన జిల్లాలో పండించిన అరటికాయ నాణ్యతగా ఉండి మెరుస్తూ ఉంటుంది. కాయ సైజు పెద్దగా ఉంటుంది. ఈ కాయను ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల ప్రజలు ఇష్ట పడుతుంటారు. అక్కడి వ్యాపారులు ఇక్కడి అరటికాయను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే రోజుకు 5–10 టన్నుల కాయను తరలించాల్సి ఉంటుంది. కాయ సైజును బట్టి కిలోకు రూ.8–15 వరకు పెట్టేందుకు కూడా సిద్ధమైనారు. జిల్లాలో దాదాపు 10 వేల ఎకరాల్లో అరటి సాగు చేసేలా రైతులతో సమావేశాలు నిర్వహించాలని చూస్తున్నారు.
అరటి సాగుకు మళ్లీ పురుడు
అరటికి డిమాండ్ ఉండడంతో జిల్లాలో మళ్లీ సాగును ప్రోత్సహించాలని, అంతర్గాం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు మాకునూరి జితేందర్రావు రాష్ట్ర ఉద్యానశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఉద్యానశాఖ అధికారులు జిల్లాలో అరటి స్థితిగతులపై నివేదిక తయారు చేసారు. తాజాగా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఉత్తర భారతదేశ వ్యాపారులు, ఆదర్శ రైతులు సమావేశమై అరటి సాగు, మార్కెటింగ్పై చర్చించారు. సాగుకు ముందుకు వచ్చే రైతులకు రాష్ట్ర ఉద్యానశాఖ మిషన్ ద్వారా మొక్కలు, డ్రిప్, అంతరపంటల సాగుకు భారీగా సబ్సిడీలు ఇవ్వాలని ప్రతిపాదించారు. కాగా, నాలుగైదు రోజుల్లో అరటి సాగు చేసే రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఉద్యానశాఖ భావిస్తుంది.
పంట విస్తీర్ణం పెంచేందుకు అధికారుల ప్రణాళికలు
సబ్సిడీలు ఇచ్చేలా రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదికలు
మంచి ఆదాయం
అరటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గతంలో నాలుగైదు ఎకరాల్లో సాగు చేశా. దిగుబడులు బాగానే వచ్చాయి కానీ వ్యాపారులు సరైన ధరకు కొనక ఆసక్తి తగ్గిపోయింది. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల వారు కొంటామనడంతో చాలా మంది రైతులు అరటి సాగుకు మొగ్గు చూపుతున్నారు.
– జితేందర్రావు, అభ్యుదయ రైతు, అంతర్గాం
అనుకూల వాతావరణం
అరటికి అనువైన వాతావరణం, ఎర్ర, నల్ల రేగడి నేలలు అనుకూలంగా ఉండటంతో మంచి దిగుబడులు వస్తాయి. ఇతర రాష్ట్రాల వ్యాపారులతో సంప్రదింపులు చేసి జిల్లాలో సాగు చేసిన అరటిని కొనుగోలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. సాగు చేసేవారికి సబ్సిడీలు ఇవ్వాలని సూచిస్తున్నాం.
– శ్యాంప్రసాద్, జిల్లా ఉద్యానశాఖాధికారి, జగిత్యాల

అరటి సాగు వైపు అన్నదాతల చూపు

అరటి సాగు వైపు అన్నదాతల చూపు