
రేషన్.. నో స్టాక్
కరీంనగర్రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడునెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు ఒకేసారి పంపిణీ చేయడం డీలర్లకు కత్తిమీద సాములా మారింది. సన్నబియ్యం కావడంతో లబ్ధిదారులు పెద్దసంఖ్యలో దుకాణాలకు తరలివస్తున్నారు. డీలర్లు దుకాణం తెరువకముందే బారులు తీరుతున్నారు. ఒక్కో లబ్ధిదారుడు మూడు నెలల బియ్యం పొందాలంటే ఆరు పర్యాయాలు ఈపాస్ మిషన్లో వేలిముద్ర వేయాల్సి రావడంతో బియ్యం పంపిణీలో జాప్యం ఏర్పడుతోంది. ఈనెల 1 నుంచి డీలర్లు బియ్యం పంపిణీ చేపట్టగా శని, ఆదివారాల్లో పలు రేషన్దుకాణాల్లో స్టాక్ లేకపోవడంతో మూసివేశారు.
సగం కోటానే కేటాయింపు
జూన్, జూలై, ఆగస్టుకు సంబంధించి ఒకేసారి రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం అస్తవ్యస్థంగా మారింది. జిల్లాలో 566 రేషన్ దుకాణాల పరిధిలో మొత్తం 2,90,402 కార్డులుండగా మూడునెలలకు 16,748.667 మెట్రిక్ టన్నుల బియ్యం మంజూరైంది. మండలస్థాయి గోదాముల్లో బియ్యం స్టాక్ లేకపోవడంతో మొదటి విడతలో డీలర్లకు సగం కోటా నే పంపిణీ చేశారు. సన్నబియ్యం కావడంతో పలువురు లబ్ధిదారులు బియ్యం తీసుకునేందుకు ఆసక్తి చూపుతుండడంతో ఐదారు రోజుల్లోనే స్టాక్ ఖాళీ అయింది. బియ్యం లేకపోవడంతో కరీంనగర్ సిటీతో పాటు మండలంలోని దుర్శేడ్, బొమ్మకల్, గోపాల్పూర్, మొగ్ధుంపూర్, తీగలగుట్టపల్లి తదితర గ్రామాల్లోని రేషన్ దుకాణాలను డీలర్లు మూసివేశారు. శనివారం బక్రీద్ పండుగ కావడంతో మండల స్టాక్ పాయింట్ నుంచి డీలర్లకు బియ్యం కేటాయించలేదు. ఆదివారం కొంతమంది డీలర్లకు బియ్యం కేటాయించగా మిగితావారిని సోమవారం రమ్మని అధికారులు సూచించారు. మూడు నెలల బియ్యం కోటాను త్వరగా కేటాయిస్తే పంపిణీకి వీలవుతుందని డీలర్లు పేర్కొంటున్నారు.
బియ్యం కేటాయింపులో జాప్యం గ్రామీణ ప్రాంతాల్లో దుకాణాలను మూసివేసిన డీలర్లు ఆందోళనలో లబ్ధిదారులు
సప్తగిరికాలనీ(కరీంనగర్): ప్రస్తుతం ఏ రేషన్ షాప్ చూసినా బియ్యం కోసం వచ్చినవారితో కిక్కిరిస్తున్నాయి. మూడు నెలల రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం ఒకేసారి ఇస్తామని చెప్పేసరికే బియ్యం తీసుకునేందుకు క్యూ కడుతున్నారు. కరీంనగర్లోని మంకమ్మతోట రేషన్ దుకాణం వద్ద క్యూలో నిల్చోనేందుకు ఓపిక లేని కొందరు ఇలా సంచులు లైన్లో పెట్టి బియ్యం కోసం ఎదురుచూశారు. వారి వరుస వచ్చాక బియ్యం తీసుకుని వెళ్లారు.

రేషన్.. నో స్టాక్