
సర్కార్ కాలేజీలో ఇంటర్.. బీటెక్ ఫ్రీ
సిరిసిల్లకల్చరల్: హైదరాబాద్లో పేరున్న పెద్ద ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగేళ్ల బీటెక్ కోర్సు చదవాలంటే ఏటా రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలు ఫీజు చెల్లించాలి. ఎప్సెట్ కౌన్సెలింగ్ ద్వారా సీటు సాధిస్తే మాత్రం రూ.35వేలు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రభుత్వం మంజూరు చేస్తుంది. మిగిలిన ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు అన్నీ విద్యార్థి భరించాల్సి ఉంటుంది. ర్యాంకు రాక, మేనేజ్మెంట్లో సీటు కొనుక్కోవాలంటే ఎంచుకునే బ్రాంచ్ ఆధారంగా రూ.10లక్షల నుంచి రూ.20 లక్షలవుతుంది. హాస్టల్, స్టేషనరీ ఇతర ఖర్చులు అదనం. గతంలో ఎంసెట్ పరీక్షలో పది వేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య ఉచితంగా లభించేది. పదివేలకు మించి ర్యాంకు వచ్చిన విద్యార్థులు పెద్ద కాలేజీల్లో చదవాలంటే లక్షలు వెచ్చించాల్సిందే.
సర్కార్ కాలేజీలో ఇంటర్ చదివితే మాత్రం..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకున్న విద్యార్థులకు ఎప్సెట్లో ర్యాంకు ఆధారంగా పెద్ద కళాశాలల్లో సీటు వస్తే లక్షల్లో ఉన్న ట్యూషన్ ఫీజు కూడా భరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్సెట్లో పదివేలకు పైగా ర్యాంకు వచ్చినా సరే పూర్తి ట్యూషన్ ఫీజును సర్కారే చెల్లిస్తుందన్నమాట. మూడేళ్లుగా ఈ విధానాన్ని అనుసరిస్తూ నిరుపేద విద్యార్థులకు సాంకేతిక విద్యను చేరువ చేస్తోంది. మారిన ఈ నిబంధన వల్ల కార్మిక క్షేత్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ అడ్మిషన్లు పెరగడానికి కారణమవుతోంది. పదివేల పైన ర్యాంకు వచ్చిన బీసీ విద్యార్థులకు ఏటా రూ.35వేలు రీయింబర్స్మెంట్ ఇస్తోంది. ఉన్న ఫీజులోంచి ఈ రూ.35వేలు మినహాయించుకుని మిగిలిన ఫీజు విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుంది. మారిన నిబంధన ప్రకారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు మొత్తం ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుంది.
ర్యాంకుతో పనిలేదు.. పూర్తి ఫీజు ప్రభుత్వమే భరిస్తుంది
ఎప్సెట్లో పదివేల ర్యాంకు దాటినా సరే.. ఇంజినీరింగ్ విద్య ఫ్రీ
సర్కార్ కాలేజీల్లో పెరుగుతున్న ప్రవేశాలు