
తాళం వేసిన రెండిళ్లల్లో చోరీ
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని తాళాలు వేసిన రెండు ఇళ్లల్లో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. గ్రామానికి చెందిన వంకాయపల్లి సాయిలు భార్య ఇంటికి తాళం వేసి ఇతర గ్రామాలకు వెళ్లారు. గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాన్ని పగులగొట్టి ఇంట్లో ఉన్న తులం బంగారం పడిగెలు, అరతులం కమ్మలు, అరతులం గుండ్లు, 40తులాల వెండి కాళ్లకడియాలు, పట్ట గొలుసులు, రూ.8వేల నగదును దొంగలించారు. అదే గ్రామానికి చెందిన జోగు పరుశరాములు ఇంటి తాళం పగులగొట్టి 7తులాల వెండి పట్టగొలుసులు, బంగారు నగలు, రూ.39వేల నగదును దొంగలించారు. బాధితుల సమాచారం మేరకు ఎస్ఐ రాజయ్య ఘటనస్థలాలను పరిశీలించి, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
లారీ నుంచి రోడ్డుపై
పడ్డ ధాన్యం బస్తాలు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): వడ్ల సంచుల లోడ్తో ఉన్న లారీ బుధవారం లింగంపేట్ నుంచి కామారెడ్డి వైపు వెళుతుండగా సంచులు రోడ్డుపై పడ్డాయి. అక్కడ ఎవరు లేక పోవడంతో ప్రమాదం తప్పింది. 20 సంచుల వరకు రోడ్డుపై జారిపడ్డాయి. స్థానికులు గమనించి, డ్రైవర్కు తెలపడంతో అతడు లారీని ఆపి, సంచులను మళ్లీ ఎక్కించుకొని బయలుదేరాడు. సంచులు పడే సమయంలో ఇతర వాహనదారులు ఉంటే ప్రమాదం జరిగిఉండేదని, ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.

తాళం వేసిన రెండిళ్లల్లో చోరీ