
ఆదర్శప్రాయుడు బుద్దె రాజేశ్వర్
బోధన్ : తుదిశ్వాస వరకు ప్రజలకు సేవలందించిన దివంగత బుద్దె రాజేశ్వర్ ఆదర్శప్రాయుడని, ఆయన జీవితం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బోధన్ మాజీ ఎంపీపీ బుద్దె సావిత్రి భర్త సీనియర్ నేత బుద్దె రాజేశ్వర్ సాలూర గ్రామాభివృద్ధికి, ప్రజా సేవలకు జ్ఞాపకార్థంగా గ్రామస్తులు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాజేశ్వర్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి, కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాజేశ్వర్తో తనకు ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ పోచారం శ్రీనివాస్ రెడ్డి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. సర్పంచ్, ఎంపీటీసీ, సొసైటీ చైర్మన్ పదవుల్లో సుదీర్ఘకాలంపాటు బాధ్యతలు నిర్వర్తించిన రాజేశ్వర్ తన వద్దకు ప్రజా సమస్యల పరిష్కారం కోసమే వచ్చేవారని, ఏనాడూ వ్యక్తిగత పనులు కోరలేదన్నారు. రైతుల చిరకాల వాంఛ అయిన మంజీర నదిపై ఎత్తిపోతల పథకాన్ని పట్టుబట్టి సాధించాడని, ఆ ఎత్తిపోతల పథకానికి బుద్దె రాజేశ్వర్ పేరు పెట్టాలని సమష్టి ఆమోదంతో తీర్మానించాలని గ్రామస్తులను కోరారు. స్థలదాత ఇల్తెపు బొర్ర గంగారాం, విగ్రహదాత మిద్దెల రాజును ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో రాజేశ్వర్ సతీమణి బుద్దె సావిత్రి, బోధన్, కోటగిరి ఏఎంసీ చైర్మన్లు చీల శంకర్, హన్మంతు, ఏసీపీ శ్రీనివాస్, టీపీసీసీ డెలిగెట్ బీ గంగాశంకర్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు సింగాడే పాండు, బీఆర్ఎస్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు గోగినేని నరేంద్రబాబు, మందర్నా రవి, పీఆర్టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు ఇల్తెపు శంకర్, కోటగిరి మాజీ జడ్పీటీసీ హెగ్డొలి శంకర్, నాయకులు అల్లె రమేశ్, గణపతి రెడ్డి, బిల్ల రాంమోహన్, డాక్టర్ కౌలయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

ఆదర్శప్రాయుడు బుద్దె రాజేశ్వర్