
ధరలు భగభగ!
కొనలేని స్థితిలో
సామాన్యులు
● వర్షాభావంతో పెరిగిన ధరలు
● మింగుడు పట్టని పప్పన్నం
● మరింత పెరిగే అవకాశం
కాళేశ్వరం: జూన్ మాసంలో వర్షాల జాడలేక ఎండలు మండిపోతుండడంతో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. సామాన్యులు పౌష్టికాహారం తినలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఎండల ప్రభావంతో కూరగాయల ధరలను వ్యాపారులు తగ్గించడం లేదు. గతంలో పోల్చితే ఈఏడాది కూడా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. వేసవిలో అక్కడక్కడా అకాల వర్షాలతో కూడా కూరగాయల పంటకు దిగుబడిని తగ్గింది. వాతావరణంలో వచ్చే మార్పులతో కూడా ఎండలకు కూరగాయల దిగుబడి లేక ధరలు పెరగడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. పట్టణాలతో పోల్చితే గ్రామాల్లో మరింత అధిక ధరలు ఉన్నాయి. సామాన్యుడు కనీసం తాజా కూరగాయలు కొనుగోలు చేయడం లేదు. గతంలో రూ.200–300 వరకు డబ్బులు పెడితే సంచినిండా కూరగాయలు ఇంటిల్లిపాదికి వారం పాటు సరిపోయేది. ప్రస్తుతం రూ.400–500 పెట్టి కొనుగోలు చేసినా సరిపడా కూరగాయలు లభించడం లేదని పలువురు వాపోతున్నారు. ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. పప్పుతో ముద్దదిగని పరిస్థితులు నెలకొన్నట్లు సామాన్యులు తెలుపుతున్నారు. ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలు అదుపు చేయాలని సామాన్యులు కోరుతున్నారు.
ఎండల ప్రభావం ఇలాగే ఉంటే..
ఎండల ప్రభావంతో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. ఎండల ప్రభావం ఇలానే ఉంటే ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. టమాట ధర ఇప్పటికే పెరిగింది. మరింత పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లో ధరలు అకాశన్నంటుతున్నాయి. దీంతో కూరగాయలకు గిరాకీ కూడా తగ్గుతుంది.
– మక్సూద్,
కూరగాయల వ్యాపారి, కాళేశ్వరం
కూరగాయలు కొనలేం..
ఎండలు మండిపోతుండడంతో కూరగాయల ధరలు పెంచారు. సామాన్యులం కూరగాయలు కొనలేం. మరింత పెరుగుతాయని వ్యాపారులు చెపుతున్నారు. వారానికి రూ.500పెడితే కూడా సరిపడా కూరగాయలు వస్తలేవు. ఽటమాట ధర పెరుగుతుంది. ధరలను నియంత్రించాలి.
– స్వప్న, టేకుమట్ల
ధరలు (కిలోకు..)
టమాట రూ.40–50
పచ్చి మిర్చి రూ.60
వంకాయ రూ.50
బెండకాయ రూ.40
కొత్తిమీర రూ.120
కాకరకాయ రూ.70
బీరకాయ రూ.100
సోరకాయ రూ.20(ఒక్కటి)
అలసంద రూ.50
కాలీఫ్లవర్ రూ.80
క్యాబేజీ రూ.40
మునుగకాయ రూ. 80
దోసకాయ రూ.40
చిక్కుడుకాయరూ.90
అడవి కాకరకాయ రూ.350

ధరలు భగభగ!

ధరలు భగభగ!