డీఎస్పీ బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

డీఎస్పీ బాధ్యతల స్వీకరణ

Jun 13 2025 3:20 PM | Updated on Jun 13 2025 3:25 PM

కాటారం: కాటారం డీఎస్పీగా సూర్యనారాయణ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన రామ్మెహన్‌రెడ్డి సాధారణ బదిలీలో భాగంగా ఇటీవల బదిలీ కాగా హైదరాబాద్‌ ఎస్‌ఐబీలో పనిచేస్తున్న సూర్యనారాయణ కాటారం బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీని సబ్‌ డివిజన్‌ పరిధిలోని సీఐ, ఎస్సైలు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఉపాధి లక్ష్యాలు పూర్తిచేయాలి

రేగొండ: ఉపాధి హామీ పథకం లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని డీఆర్‌డీఓ బాలకృష్ణ అన్నారు. ఉపాధి హామీ పనులపై గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులు పూర్తి చేయడంలో అధికారులు పోటీతత్వంతో పనిచేయాలని తెలిపారు. లక్ష్యం ప్రకారం మండలంలో ప్లాంటేషన్‌ చేపట్టాలని, అందులో సుమారు 100 ఎకరాలలో పండ్ల మొక్కలను నాటాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి లేబర్‌ టర్న్‌ఔట్‌ పెంచాలని, కూలీలకు వంద శాతం చెల్లింపులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ మంజుల, ఎంపీఓ రాంప్రసాద్‌, టీఏలు రాజు, రమేష్‌ పాల్గొన్నారు.

మెడికల్‌ బోర్డును పునరుద్ధరించాలి

భూపాలపల్లి అర్బన్‌: మూడు నెలలుగా నిలిచిపోయిన సింగరేణి మెడికల్‌ బోర్డును పునరుద్ధరించాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య కోరారు. ఏరియాలోని యూనియన్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు నెలల కాలం నుంచి సింగరేణిలో మెడికల్‌ బోర్డు పెట్టకపోవడంతో సింగరేణి కార్మికులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. గతంలో మెడికల్‌ బోర్డులో జరిగిన కుంభకోణం దోపిడీ విషయంలో విచారణ పేరుతో మెడికల్‌ బోర్డు నిర్వహించకపోవడం సరైనది కాదన్నారు. దీనిపై గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాలు మాట్లాడకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఈ సమావేశంలో నాయకులు దాసరి జనార్దన్‌, కాసర్ల ప్రసాదరెడ్డి, నామాల శ్రీనివాస్‌, రాళ్లబండి బాపు, జయశంకర్‌, ఎండి సాజిత్‌ పాల్గొన్నారు.

కొనసాగుతున్న క్రికెట్‌ క్రీడాపోటీలు

భూపాలపల్లి అర్బన్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న అంతర్‌ జిల్లాల క్రికెట్‌ పోటీలు కొనసాగుతున్నాయి. స్థానిక అంబేడ్కర్‌ స్టేడియంలో గురువారం నిర్వహించిన ఐదవ లీగ్‌ మ్యాచ్‌ను సీఐ నరేష్‌కుమార్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హెచ్‌సీయూ ఆధ్వర్యంలో క్రికెట్‌ పోటీలు నిర్వహించి క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడం సంతోషకరమైన విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌, అధ్యక్షుడు కర్ణాకర్‌, కోచ్‌లు పాల్గొన్నారు.

శిలాఫలకం కూల్చారు..

టేకుమట్ల: మండలంలోని ఆరెపల్లి శివారులో రైతుల భూములకు వెళ్లే దారి మరమ్మతు కోసం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బుధవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చేశారు. గురువారం కాంగ్రెస్‌ నాయకులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డీఎస్పీ బాధ్యతల స్వీకరణ1
1/1

డీఎస్పీ బాధ్యతల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement