
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
చిట్యాల: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ అన్నారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. బడిబాటలో భాగంగా నైన్పాక ఉన్నత పాఠశాలలో నూతన విద్యా సంవత్సర ప్రారంభ వేడుకలు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఊర్మిళ అధ్యక్షతన పండుగ వాతావరణం ఉట్టిపడేలా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ రాజేందర్ హాజరై విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, స్కూల్ యూనిఫామ్స్ అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు కావాలసిన అన్ని వసతులు కల్పించామన్నారు. సుశిక్షితులైన ఉపాధ్యాయులతో సమగ్రమైన విజ్ఞానం అందించబడుతుందని తెలిపారు. గ్రామస్తులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ద్వారా విద్యాబోధన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం పదవ తరగతిలో మండలంలో అత్యధిక మార్కులు సాధించిన నైన్పాక విద్యార్థిని రమ్యను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కొడెపాక రఘుపతి, సీఎంఓ రమేష్, సెక్టోరియల్ ఆఫీసర్ రాజగోపాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఊర్మిళ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాముకుంట్ల తిరుపతయ్య, ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాలల చైర్మన్లు, తల్లిదండ్రులు, విద్యావంతులు పాల్గొన్నారు.
చిట్యాలలో...
మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఎంఈఓ కొడెపాక రఘుపతి విద్యార్థులకు పాఠ్యప్తుకాలు, నోట్ బుక్కులు, దుస్తులు పంపిణీ చేశారు. అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు బొకేలు ఇచ్చి ఆహ్వానించారు.
డీఈఓ రాజేందర్