
పిల్లలు పనిలో కాదు.. బడిలో ఉండాలి
భూపాలపల్లి అర్బన్: చిన్నపిల్లలు ఉండాల్సింది బడిలో కానీ పనిలో కాదని సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజు అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి జడ్జి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నపిల్లలను పనిలో పెట్టుకుంటే ఉపేక్షించేది లేదన్నారు. చిన్న పిల్లలు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పారు. ఐక్యరాజ్యసమితి తీసుకున్న నిర్ణయంతో యావత్తు ప్రపంచం బాల కార్మిక నిర్మూలన కోసం కదులుతుందని తెలిపారు. బాలకార్మిక నిర్మూలన కోసం ప్రతీ ఒక్కరూ కలిసికట్టుగా నడవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్కుమార్నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మిప్రసన్న, న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొన్నారు.