
ఉపాధి కల్పించడమే లక్ష్యం
రేగొండ: పేద, దళిత కుటుంబాలకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా భూమి కొనుగోలు పథకం కొనసాగుతోందని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అన్నారు. కొత్తపల్లిగోరి మండలంలోని జగ్గయ్యపేట, చెన్నాపూర్ శివారులోని భూములను గురువారం భూమి కొనుగోలు పథకంలో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో భూసేకరణ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందన్నారు. ఎంపిక ప్రక్రియలో సమీక్ష, ధృవపత్రాల పరిశీలన, గ్రామస్థాయి సమావేశాల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పథకం దళితుల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మిరాజయ్య, సర్వేయర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.