ఆలయ గోపాలుడు : నమ్మితే.. పెళ్లి.. సంతానం! | Krishna Janmashtami 2025 check these imp temples | Sakshi
Sakshi News home page

Krishna Janmashtami ఆలయ గోపాలుడు నమ్మితే.. పెళ్లి.. సంతానం!

Aug 14 2025 10:26 AM | Updated on Aug 14 2025 11:48 AM

Krishna Janmashtami 2025 check these imp temples

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం సాక్షాత్తూ ఆ దేవదేవుడు శ్రీకృష్ణుడిగా ఈ భూమిపై ఉద్భవించిన పర్వదినం కృష్ణాష్టమి. ఈ శనివారం కృష్ణాష్టమి. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఉన్న కొన్ని వేణుగోపాల స్వామి ఆలయాల 
గురించి సంక్షిప్తంగా... 

ముందుగా హైదరాబాద్‌ పరిసరాలలోని ఆలయాల గురించి... 

శ్యాం మందిరం – కాచిగూడ, హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని కాచిగూడ స్టేషన్‌కి సమీపంలో గల శ్రీ కృష్ణమందిరానికే శ్యాం మందిర్‌ అని పేరు. ఈ మందిరం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ దేవాలయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. నిత్యం స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

గోవర్ధనగిరి – కేపీహెచ్‌బీ కాలనీ, హైదరాబాద్‌
హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ కాలనీలో మలేసియాన్‌ టౌన్‌షిప్‌కి వ్యతిరేక దిశలో కొలువైన వేణుగో΄ాల స్వామి దేవాలయం ఒక గుట్ట పైన వెలసినది. గుట్టపైన స్వామి వారి విగ్రహం దొరకగా అక్కడే గుడి కట్టించారు. ఈ ప్రదేశాన్ని గోవర్ధనగిరి అని పిలుస్తారు.. ప్రతి నిత్యం స్వామి వారికి విశేషమైన పూజ కార్యక్రమాలు జరుగుతాయి.  పండుగలప్పుడు, కృష్ణాష్టమికి చాలా విశేషంగా ఉత్సవాలు జరుపుతారు. ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. గుట్ట పైన వెలసి ఉండడం వలన ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది.

శ్రీ కృష్ణ దేవాలయం – బహుదూర్‌ పురా
150 సంవత్సరాల పూర్వం ఈ దేవాలయాన్ని నిర్మించారు. నెహ్రు జంతు ప్రదర్శన శాలకు దగ్గరలో ఉన్న ఈ దేవాలయాన్ని కిషన్‌ బాగ్‌ దేవాలయం అని కూడా అంటారు. నిజాం దగ్గర వకీల్‌గా పని చేసిన రాజా రాం బహుదూర్‌ ఈ ఆలయాన్ని నిర్మించారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు ఇక్కడ ఘనంగా పూజ కార్యక్రమాలు, రథ యాత్ర నిర్వహిస్తారు. ఇక ఈ ఆలయంలో వెలసిన వేణుగోపాల స్వామిని సంతాన వేణుగోపాల స్వామి అని కూడా పిలుస్తారు. చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి  సంతానం కోసం స్వామిని సేవించుకుంటారు. 

రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం – ఏదులాబాద్‌
సికింద్రాబాద్‌కి సుమారు 30 కి.మీ. దూరంలో ఘటకేసర్‌ మండల కేంద్రానికి 5 కి.మీ. దూరంలో ఏదులాబాద్‌ గ్రామంలో వెలసిన క్షేత్రం రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం. శతాబ్దాల చరిత్ర గల ఈ దేవాలయం ఎంతో శక్తిమంతమైన ప్రాచీన క్షేత్రం. అందమైన రాజ గోపురం, ఆ గోపురం పైన రక రకాల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. అద్భుతమైన కట్టడాలు, చక్కని శిల్పకళా సంపదతో ఎంతో రమణీయంగా ఉంటుంది. శ్రీ వైష్ణవ సంప్రదాయం  ప్రాకారం ఇక్కడ పూజాకార్యక్రమాలు జరుగుతాయి.

శ్రీ రుక్మిణి సత్యభామ సహిత వేణుగోపాల స్వామి దేవాలయం – రామడుగు
కరీంనగర్‌ జిల్లా రామడుగు మండల కేంద్రంలో సుమారు 1200 వందల సంవత్సరాల పూర్వమే శ్రీ రుక్మిణి సత్యభామ సహిత వేణుగోపాల స్వామి దేవాలయం కొలువై ఉంది. ఈ ఆలయంలో వేణుగోపాల స్వామి 8 మంది భార్యలు మనకు దర్శనమిస్తారు. ఈ స్వామికి కూడా కల్యాణ వేణుగోపాలుడనీ, సంతాన వేణుగోపాలుడనీ పేరు. 

సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం, చీనూర్‌ గ్రామం, కామారెడ్డి జిల్లా
ఈ దేవాలయంలో వెలసిన వేణుగోపాలస్వామి సంతాన వేణు గోపాల స్వామిగా ప్రసిద్ధిగాంచాడు. ఎవరైతే ఈ క్షేత్రంలో స్వామి వారిని మనసా వాచా నమ్మి పూజిస్తారో వాళ్ళకి ఆ స్వామివారు మంచి సంతానాన్ని ప్రసాదిస్తారని ప్రతీతి. ఈ ఆలయంలో వెలసిన మరో సుందర విగ్రహం శ్రీ సుదర్శన పెరుమాళ్‌ వారిది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ స్వామికి అభిషేకం, హోమం వంటి దివ్యమైన పూజలు జరిపిస్తే ఎటువంటి ఆరోగ్య సమస్య అయిన తొలగి పోతుందనీ, శత్రునాశనం జరుగుతందనీ నమ్మకం!

జగన్నాథ స్వామి దేవాలయం– చెన్నూర్‌
చెన్నూర్‌లో పూజలందుకుంటున్న అతి పురాతన జగన్నాథ స్వామి దేవాలయం ఇది. ఇక్కడ ప్రవహించే గోదావరిని ఉత్తరవాహిని అని పిలుస్తారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశం. ఇది. గోదావరి నది పుట్టిన చోట నుంచి సముద్రంలో కలిసే వరకు ఎక్కడ లేని ప్రత్యేకత ఈ ్ర΄ాంతంలో ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో... మొవ్వ వేణుగోపాల స్వామి ఆలయం
కృష్ణాజిల్లా కూచిపూడి అనగానే తెలుగువారికి ప్రత్యేకమైన నృత్యం గుర్తుకువస్తుంది. ఆ కూచిపూడికి సమీపంలో ఉన్న మొవ్వ పేరు వినగానే వేణుగోపాలుడు మదిలో నిలుస్తాడు. మొవ్వలో ఉన్న వేణుగోపాలుని ఆలయం ఈనాటిది కాదు! ఆ స్వామి మహాత్మ్యమూ సామాన్యమైనది కాదు! వేణుగోపాల స్వామి విగ్రహం చాలా ప్రత్యేకమైనదని చెబుతారు. స్వామి వెనుక వున్న మకరతోరణంపై దశావతారాలు ఉన్నాయి. స్వామి పక్కన రుక్మిణీ సత్యభామలు దర్శనమిస్తారు. చేతిలో వేణువుకు గాలి వూదే రంధ్రాలు కూడా స్పష్టంగా కనబడతాయి. ఈ విగ్రహం ఇసుక నుంచి ఉద్భవించింది కావడంతో కాలక్రమంలో కొంచెం దెబ్బతిన్నది. ఆ కారణంగా 2000 సంవత్సరంలో స్వామివారి విగ్రహాన్ని పోలిన మరో విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్ఠించారు. అయినా ఇప్పటికీపాత విగ్రహాన్ని మనం ఆలయం వెనుక ఉన్న గదిలో చూడవచ్చు.

ఆలయ ప్రాంణంలో ఆంజనేయస్వామివారి ఉపాలయం కూడా ఉంది. మువ్వ పేరు వినగానే వేణుగోపాలస్వామి ఆలయమే కాదు, ఆ స్వామి మహత్తుతో అద్భుతమైన పదాలు రాసిన క్షేత్రయ్య కూడా గుర్తుకు వస్తాడు. మొవ్వ వేణుగోపాలుడిని దర్శిస్తే ఎవరి జీవితమైనా తరించిపోతుందని చెప్పేందుకు క్షేత్రయ్య జీవితమే ఒక ఉదాహరణ. విజయవాడ నుంచి మొవ్వ కేవలం 50 కిలోమీటర్లే!

హంసల దీవి శ్రీ వేణుగోపాల స్వామి 
వేయి సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం కృష్ణా జిల్లాలోని హంసలదీవిలో ఉంది. అద్భుతమైన శిల్పకళ, చక్కటి కట్టడాలతో నిర్మించిన ఈ ఆలయం సముద్రపు అటుపోటులను తట్టుకునేలా  ప్రాకారాన్ని నిర్మించారు. తూర్పు ముఖాన అద్భుతమైన రాజగోపురం ఉంటుంది. ఈ ఆలయంలో వేణుగోపాలస్వామి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేతుడై పూజలు అందుకుంటూ వున్నాడు. ఇక్కడి దేవాలయ కుడ్యాలపై చెక్కిన రామాయణ ఘట్టాలు తూర్పు చాళుక్యుల శిల్పకళా వైభవానికి అద్దం పడుతుంటాయి. ఆలయం చుట్టూ ఎన్నో అందమైన శిల్పాలు కొలువుదీరి ఉన్నాయి. ఈశాన్యంలో పురాతన కళ్యాణమండపం కన్పిస్తుంది. ఈ ఆలయంలోని శ్రీ వేణుగోపాలస్వామి పిలిస్తే పలుకుతాడని భక్తుల విశ్వాసం. ప్రపంచంలో ఎక్కడా కనిపించని విధంగా ఈ విగ్రహం నీలమేఘఛాయ లో ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు.

మార్గం: కృష్ణాజిల్లా కోడూరు నుంచి 15 కి.మీ దూరం లోనూ, మోపిదేవి నుండి 28 కి.మీ దూరం లోనూ బంగాళాఖాతం అంచున ఈ పుణ్యక్షేత్రం ఉంది.

కుంతీ మాధవస్వామి ఆలయం, పిఠాపురం
ఇంద్రుడు వృత్తాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి బ్రహ్మహత్యా΄ాతకం నుంచి విముక్తి కోసం ఐదు ్ర΄ాంతాల్లో విష్ణ్వాలయాలను నిర్మించి ఆరాధించాడన్నది పురాణ కథనం. ఈ ఐదు క్షేత్రాల్లో మాధవ స్వామి ఆలయాలు వెలిశాయి. వారణాసిలో బిందు మాధవస్వామి ఆలయం, ప్రయాగలో వేణు మాధవస్వామి ఆలయం, పిఠాపురంలోని కుంతీ మాధవస్వామి ఆలయం, రామేశ్వరంలోని సేతుమాధవస్వామి ఆలయం, అనంతపద్మనాభంలోని సుందర మాధవస్వామి ఆలయం ప్రసిద్ధి చెందాయి.

మార్గం : పిఠాపురం రాజమండ్రికి 62 కిలో మీటర్లు, సామర్లకోటకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధానమైన రైళ్లన్నీ పిఠాపురంలో ఆగుతాయి. కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి బస్సు సౌకర్యం ఉంది.

వేణుగోపాల స్వామి దేవాలయం – మెళియాపుట్టి
శ్రీకాకుళం జిల్లాలో వెలసిన పురాతన వేణుగోపాల స్వామి దేవాలయం మెళియాపుట్టి గ్రామంలో కొలువై ఉంది. టెక్కలికి 24 కి.మీ. దూరంలో ఉన్న ఈ గ్రామంలో గల ఆలయాన్ని గజపతిమహారాజు 1810 లో నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఆలయ నిర్మాణం, ఆలయంలో కొలువైన వేణుగో΄ాల స్వామి ఎంతో సుందరంగా దర్శనమిస్తారు. డోల పౌర్ణమి ఉత్సవాలు 9 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని ఆంధ్ర ఖజురాహో అని కూడా పిలిచేవారట.. అక్కడ ఉన్న నిర్మాణ శైలి, గోడల పైన ఉన్న శిల్పాలు అలా ఉంటాయట.


శ్రీ రాజగోపాల స్వామి దేవాలయం నరసపూర్‌
నరసపూర్‌లో కొలువైన రాజగోపాలస్వామి దేవాలయం 18 వ శతాబ్దానికి చెందినదిగా శాసనాల ద్వారా తెలుస్తుంది. గోదావరి నదిలో విగ్రహం లభించగా దానిని తీసుకొని వచ్చి ప్రతిష్టించి దేవాలయాన్ని నిర్మాణం చేశారు. ఆలయంలో కొలువైన కృష్ణుడిని కల్యాణ కృష్ణుడిగా పిలుస్తారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీ రాజగోపాల స్వామిగా కొలువైనారు. ఈ దేవాలయంలో స్వామి వారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే పెళ్లిళ్లు త్వరగా అవుతాయని నమ్మకం. స్వామి అనుగ్రహంతో పెళ్లి కుదిరిన వారు దేవాలయ ఆవరణలోనే పెళ్లి చేసుకుంటారు. 

సమ్మోహన వేణుగోపాల స్వామి దేవాలయ–జూనం చుండూరు, గుంటూరు
గుంటూరు జిల్లా జూనంచుండూరు గ్రామంలో వెలసిన సమ్మోహన వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో నల్లనిరూపుడైన స్వామి విగ్రహం సుమారు ఆరు అడుగులు పొడవు, నాలుగు అడుగుల వెడల్పుతో సుందర, సుమనోహరంగా దర్శమిస్తోంది. దాదాపు 1500 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మాణమైనట్లు కథనం. దేవాలయంలోని ఈ స్వామిలో ఓ ప్రత్యేకత ఉంది. స్వామి వారి మూలవిరాట్‌ ప్రణవ స్వరూపంలో ఉండి ఆపై వేణుగోపాలునిగా స్వామి దర్శనమిస్తారు. దేశంలో మరెక్కడా ఇటువంటి భంగిమ ఉన్నటువంటి విగ్రహం ఉండదంటారు. ఆది ప్రణవ స్వరూపంలో చుట్టూ దశావతారాలు, సప్త్తరుషులు, వేణుగోపాలునికి ఇరుపక్కల రుక్మిణి, సత్యభామలు గోవులతో కొలువుదీరి ఉంటారు.ఈ స్వామిని సేవిస్తే కల్యాణం అవుతుందని, సంతాన, సౌభాగ్య సంపదలకు లోటుండదనీ ప్రతీతి.

– డి.వి.ఆర్‌.భాస్కర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement