
ఆస్ట్రోనాట్ జాహ్నవికి సత్కారం
అమలాపురం టౌన్: త్వరలో అంతరిక్షంలోకి వెళ్లబోతున్న ఆస్ట్రోనాట్ దంగేట జాహ్నవి శుక్రవారం అమలాపురం వచ్చింది. గారపాటి వీర్రాజు మెమోరియల్ ట్రస్ట్ ఆహ్వానం మేరకు ఆమె పట్టణానికి వచ్చి ఇక్కడి మేధావులు, విద్యావేత్తలతో కొద్దిసేపు మాట్లాడింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన జహ్నవి దేశం తరఫున తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లబోతున్న మహిళగా చరిత్రకెక్కనుందని కోనసీమ సైన్స్ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ సీవీ సర్వేశ్వరశర్మ అన్నారు. జాహ్నవి మాట్లాడుతూ తాను 2029 ఆస్టోనాట్ టైటాన్స్ స్పేస్ ఇనాగ్యురల్ ఆర్బిటాల్ మిషన్కు ఎంపికయ్యాయని చెప్పింది. అనంతరం ట్రస్ట్ తరఫున జాహ్నవిని సత్కరించారు. ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త గారపాటి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ తన గైడెన్స్లో చదివిన జాహ్నవి అంతరిక్షంలోకి వెళ్లబోతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్రాంత స్పేస్ శాస్త్రవేత్త పెద్దిరెడ్డి సత్యనారాయణ, కుడుపూడి శాంతి భూషణ్ పాల్గొన్నారు.