ఆన్లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ను దాదాపు మూడు దశాబ్దాల పాటు అగ్రపథంలో నడిపిన సహ-వ్యవస్థాపకుడు, ప్రస్తుత ఛైర్మన్ రీడ్ హేస్టింగ్స్ (65) తన 29 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి ముగింపు పలికారు. ఆయన సంస్థ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ కీలక పరిణామం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేసింది. బలమైన ఆదాయ గణాంకాలు నమోదైనప్పటికీ హేస్టింగ్స్ సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు వచ్చిన వార్తతో సంస్థ షేరు విలువ ఒక్కరోజులో ఏకంగా 9% పడిపోయింది.
కీలక సమయంలో వీడ్కోలు
వార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో కంపెనీ విలీన చర్చలు విఫలమై పోటీ పెరిగిన క్లిష్ట సమయంలో హేస్టింగ్స్ తప్పుకోవడం చర్చనీయాంశమైంది. రాబోయే జూన్ వార్షిక సమావేశంలో ఆయన తిరిగి ఎన్నికలకు నిలబడబోరని, ఇకపై తన సమయాన్ని దాతృత్వ కార్యక్రమాలకు, ఇతర వ్యాపారేతర కార్యకలాపాలకు కేటాయిస్తానని స్పష్టం చేశారు.
డీవీడీ అద్దె నుంచి స్ట్రీమింగ్ సామ్రాజ్యం వరకు..
1997లో ఒక చిన్న డీవీడీ-బై-మెయిల్ సర్వీస్గా నెట్ఫ్లిక్స్ను ప్రారంభించిన హేస్టింగ్స్ ప్రపంచ వినోద రంగం గమనాన్ని మార్చేశారు. 2011లో ‘క్విక్ స్టార్’ నిర్ణయం వంటి వైఫల్యాలు ఎదురైనా, కొవిడ్ మహమ్మారి వంటి కీలక సమయాల్లో సంస్థను లాభాల బాట పట్టించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తన పుస్తకం ‘నో రూల్స్ రూల్స్’లో పేర్కొన్నట్లుగా ఉత్పాదకతతో కూడిన పని సంస్కృతిని ఆయన సృష్టించారు.
భవిష్యత్తు లక్ష్యాలు
హేస్టింగ్స్ వారసుడు కంపెనీ కో-సీఈఓ గ్రెగ్ పీటర్స్ సంస్థ వృద్ధిపై ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఒక బిలియన్ మంది ప్రేక్షకులను చేరుకునే సామర్థ్యం తమకుందని ఆయన పేర్కొన్నారు. 2026 నాటికి ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం 3 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. కేవలం సినిమాలు, సిరీస్ లే కాకుండా జపాన్ వరల్డ్ బేస్ బాల్ క్లాసిక్ వంటి ప్రత్యక్ష క్రీడలు, వీడియో పాడ్కాస్ట్లపై సంస్థ దృష్టి పెడుతోంది.
ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరల వేడి!


