రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత గడ్డపై అడుగు పెడుతున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత్, రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పుతిన్ రెండు రోజుల పర్యటన కోసం డిసెంబర్ 4న మన దేశానికి వస్తున్నారు. ఇందు కోసం భారత్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.
పుతిన్ భారత్ పర్యటనపై ప్రపంచ దేశాల్లో ఆసక్తి నెలకొంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మోదీ-పుతిన్ ముఖాముఖి సంభాషణ జరుగుతోంది. దీంతో ఉత్సుకత మరింత పెరిగింది. దేశాధినేతలు పర్యటనకు వచ్చినప్పుడు ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా ఉంటాయి. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన నేపథ్యంలో ఈ ఏర్పాట్లకు ఎంత ఖర్చు అవుతుందనే ఆసక్తి అందరిలో ఉంటుంది. ఆ వివరాలు చూద్దాం..
రూ.150 కోట్లు!
భద్రతాపరమైన కారణాలతో సాధారణంగా దేశాధినేతల పర్యటనలకు అయిన ఖర్చు వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయదు. అయినప్పటికీ మీడియా అంచనాలు, గత పర్యటనల వ్యయ నమూనాల ప్రకారం.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన నిమిత్తం ప్రభుత్వానికి రూ.50 కోట్ల నుండి రూ.150 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. అధికారిక గణాంకాలు విడుదల కానప్పటికీ, ఇటీవలి సంవత్సరాలలో ఇది మరింత ఖరీదైన దౌత్య పర్యటనగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఢిల్లీ స్టార్ హోటళ్ల ధరలకు రెక్కలు
పుతిన్ పర్యటన కారణంగా న్యూఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటళ్లలో ఆక్యుపెన్సీ అమాంతం పెరిగింది. దీంతో ఆయా హోటళ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. ఢిల్లీలోని ఐటీసీ మౌర్యకు చెందిన 4,700 చదరపు అడుగుల 'గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్'లో పుతిన్ ఉంటారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక నివేదిక తెలిపింది. ఇప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తోపాటు ఆయనకు ముందు అధ్యక్షులు జో బైడెన్, బిల్ క్లింటన్ వంటి అగ్రశ్రేణి ప్రముఖులు కూడా గతంలో ఇదే సూట్లో బస చేశారు.
హై ప్రొఫైల్ ప్రతినిధుల రాక, పెరిగిన భద్రతా అవసరాలు కూడా హోటల్ సుంకాలను గణనీయంగా పెంచాయి. రష్యన్ బృందం, ఇతర దౌత్య మిషన్ల డిమాండ్ కారణంగా ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటళ్లు రేట్లను ఒక్క రాత్రి బసకు రూ.85వేల నుంచి రూ.1.3 లక్షలకు పెంచినట్లు తెలుస్తోంది.


