నిరంతర పరిశీలన: సీఎం జగన్‌

CM YS Jagan Says Every School Student Must Get Tabs MEO Should Take Care - Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబుల పంపిణీ పూర్తి

విద్యార్థులు నేర్చుకుంటున్న తీరుపై డేటా అనలిటిక్స్‌తో పరిశీలించాలి 

ఇందుకు అనుగుణంగా హెచ్‌ఎం, ఎంఈఓలు చర్యలు తీసుకోవాలి

వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికి ఐఎఫ్‌పీ ప్యానల్స్‌ 

డిజిటల్‌ స్క్రీన్ల వల్ల 6–10 తరగతుల విద్యార్థులకు అత్యుత్తమ బోధన 

డిక్షనరీలు లేని పిల్లలకు వచ్చే విద్యా కానుకతో కలిపి ఇవ్వాలి

విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పిల్లలకు విద్యాకానుక అందాలి

డీఎస్సీ–98 అభ్యర్థులకు త్వరగా పోస్టింగులు ఇవ్వాలి

గోరుముద్దకు అదనంగా వారంలో మూడు రోజులు రాగి మాల్ట్‌

ఇందుకు ప్రభుత్వంపై అదనంగా రూ.50 కోట్లు భారం

పాఠశాలల్లో సౌకర్యాల నిర్వహణను నిరంతరం పరిశీలించాలి

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబుల్లో ఎలాంటి సమస్య తలెత్తినా వారం రోజుల్లో మరమ్మతు చేసి ఇవ్వాలని, లేదా కొత్త ట్యాబును అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ట్యాబుల ద్వారా పాఠాలు నేర్చుకుంటున్న తీరుపై డేటా అనలిటిక్స్‌ ద్వారా నిరంతర పరిశీలన ఉండాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా హెడ్‌ మాస్టర్, ఎంఈఓలు తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

పాఠశాల విద్యా శాఖ కార్యకలా­పాలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాల­యంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్యాబుల పంపిణీ పూర్తయిందని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ట్యాబుల (నిర్వహణ) మెయింటెనెన్స్‌కు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వీస్‌ సెంటర్‌ను కంపెనీ ద్వారా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ట్యాబుల వాడకం.. దాని ద్వారా పాఠాలు నేర్చుకుంటున్న తీరు,  తదితర అంశాలపై ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు.

తరగతి గదుల డిజిటలైజేషన్‌లో భాగంగా ఐఎఫ్‌పి ప్యానెల్స్‌ (ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్‌) ఏర్పాటుపై తీసుకుంటున్న చర్యల గురించి సీఎంకు వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికి ఐఎఫ్‌పి ప్యానెల్స్‌ ఏర్పాటు కావాలని, 6–10 తరగతుల విద్యార్థులందరికీ ఇవి అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని స్పష్టం చేశారు. డిజిటల్‌ స్క్రీన్ల వల్ల విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందాలని, వీటిని ఉపయోగించుకుని ఎలా బోధన చేయాలో టీచర్లకు చక్కటి అవగాహన కలిగేలా శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

పిల్లలందరికీ డిక్షనరీలు ఇవ్వాలి
– పిల్లలు అందరి వద్దా డిక్షనరీలు ఉన్నాయా? లేవా? మరోసారి పరిశీలించండి. లేని పిల్లలు అందరికీ వచ్చే విద్యా సంవత్సరం విద్యా కానుకతో కలిపి ఇవ్వాలి. ఇందు కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలి. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పిల్లలకు విద్యా కానుక అందాలి.
– పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చూసుకోవాలి. ఏ స్కూల్లో లేకపోయినా వెంటనే ఆ మేరకు చర్యలు తీసుకోవాలి. సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టడం వల్ల బోధనలో నాణ్యత పెరుగుతుంది. తద్వారా విద్యార్థుల అభ్యాసం కూడా మెరుగు పడుతుంది. డీఎస్సీ–98 అభ్యర్థులకు పోస్టింగులు త్వరగా ఇవ్వాలి. 
– గోరుముద్ద నాణ్యతను నిరంతరం పరిశీలించాలి. ఫిబ్రవరి 1 నుంచి వారంలో మూడు రోజులు పిల్లలకు బెల్లంతో తయారు చేసిన రాగి మాల్ట్‌ ఇవ్వాలి. అన్ని స్కూళ్లు, అంగన్‌వాడీలకు సార్టెక్స్‌ ఫోర్టిఫైడ్‌ బియ్యం మాత్రమే సరఫరా చేయాలి. నాణ్యత విషయంలో రాజీపడొద్దు.

ఇప్పటికే సరఫరా..
– ప్రత్యేక లేబుల్‌తో సార్టెక్స్‌ ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీలు, అన్ని గురుకుల పాఠశాలలు హాస్టళ్లకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
– 22 వేలకుపైగా స్కూళ్లలో నాడు–నేడు రెండో దశ పనులు నడుస్తున్నాయని, ఇప్పటికే దాదాపు రూ.1,500 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని వివరించారు. 
– ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ, గ్రామ వార్డు సచివాలయాల శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, విద్యాశాఖ సలహాదారు ఏ సాంబశివారెడ్డి, ఇంటర్‌ మీడియట్‌ విద్య కమిషనర్‌ ఎం వీ శేషగిరిబాబు, పాఠశాల మౌలిక వసతులు కల్పన కమిషనర్‌ కాటమనేని భాస్కర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ జీ వీరపాండ్యన్, మిడ్‌ డే మీల్స్‌ డైరెక్టర్‌ నిధి మీనా, నాడు–నేడు డైరెక్టర్‌ (టెక్నికల్‌) మనోహర్‌ రెడ్డి, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ (పాఠశాల విద్యా శాఖ) ప్రతాప్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

స్కూలు పిల్లలకు ఇప్పుడు ఇస్తున్న ఆహారానికి అదనంగా పిబ్రవరి 1వ తేదీ నుంచి వారానికి మూడు రోజులు బెల్లంతో తయారు చేసిన రాగి మాల్ట్‌ గ్లాసుడు చొప్పున ఇవ్వాలి. ఐరన్, కాల్షియం లోపం నివారణకు ఇది బాగా ఉపయోగ పడుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి రూ.50 కోట్లు అదనంగా ఖర్చవుతుంది. నాడు– నేడు కింద బాగు చేసిన పాఠశాలల్లో సౌకర్యాల నిర్వహణపై నిరంతర పరిశీలన ఉండాలి. ఎస్‌ఎంఎఫ్, టీఎంఎఫ్‌ (స్కూల్, టాయ్‌లెట్‌ నిర్వహణ నిధి) నిధులను వినియోగించుకుని ఏ సమస్య వచ్చినా వెంటనే మరమ్మతులు చేపట్టాలి. 
– సీఎం వైఎస్‌ జగన్‌     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top