
నిబంధనలకు పాతర
● అనువైన స్థానాల కోసం అడ్డదారులు
● మే 31 నాటికి 40 ఏళ్లు నిండిన వారికి మాత్రమే ‘అవివాహిత మహిళ’ కేటగిరీ కింద 5 ప్రత్యేక పాయింట్లు
● బదిలీల చట్టానికి తూట్లు పొడుస్తున్న కొందరు మహిళా టీచర్లు
● పెళ్లికాకుంటే చాలు ‘అవివాహిత మహిళ’ పాయింట్లు
● చిన్న వయసు టీచర్లూ ఈ పాయింట్లు పొందిన వైనం
● ఎస్జీటీ కేటగిరిలోనే 30 మందికి పైగా అక్రమంగా పాయింట్లు
అనంతపురం ఎడ్యుకేషన్: అనువైన స్థానాల కోసం కొందరు టీచర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. సమాజానికి మార్గదర్శకంగా ఉండాల్సిన గురువులే వక్రమార్గాన పాయింట్లు పొందాలని చూస్తున్నారు. నిబంధనలకు పాతరేస్తున్నారు. కొందరు అనర్హత కల్గిన మహిళా టీచర్లు ‘అవివాహిత మహిళ’ కేటగిరీ కింద పాయింట్లు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పెళ్లి కాకుంటే చాలు ఈ పాయింట్లు పొందుతున్నారు. దాదాపు 30 మంది ఎస్జీటీల సీనియార్టీ జాబితాలో ఇలాంటి టీచర్లు ఉండడం విద్యాశాఖలో కలకలం రేపుతోంది. ఎక్కువగా బ్రహ్మసముద్రం, రొళ్ల, డి.హీరేహాల్, గుమ్మఘట్ట, మడకశిర, రాయదుర్గం, అమడగూరు, కంబదూరు, అగళి, గుడిబండ, కుందుర్పి మండలాల్లో పని చేస్తున్న మహిళా టీచర్లు ఎక్కువగా అక్రమంగా పాయింట్లు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. తాత్కాలిక సీనియార్టీ జాబితాను పరిశీలించిన పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అనర్హుల జాబితాను సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు.
31 నాటికి 40 ఏళ్లు నిండిన వారే అర్హులు
బదిలీల చట్టం జీవో 22 ప్రకారం మే 31 నాటికి 40 ఏళ్లు నిండిన వారికి మాత్రమే ‘అన్మ్యారెడ్ ఉమెన్’ (అవివాహిత) కేటగిరీ కింద 5 స్పెషల్ పాయింట్లు పొందేందుకు అర్హులు. ఈలెక్కన 1985 మే 31కి ముందు జన్మించి ఉండాలి. అయితే 1987 నుంచి 1999 మధ్య జన్మించిన వారు దాదాపు 30 మంది దాకా అవివాహిత పాయింట్లు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. 26, 27 ఏళ్ల మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవడం విశేషం. జీఓలో చాలా స్పష్టంగా ఇచ్చినా కూడా ఇలా దరఖాస్తు చేశారంటే అడ్డదారులోల పాయింట్లు పొందేందుకేనంటూ ఇతర ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. వాటిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే వారందరికీ ఆ పాయింట్లు తొలగిస్తామని డీఈఓ ప్రసాద్బాబు స్పష్టం చేశారు.
ఎవరు సహకరించారో...
ఎస్ఏ (ఫిజికల్ సైన్స్) బదిలీల్లో భాగంగా సీనియారిటీ లిస్టులో 38వ నంబర్లో ఉన్న రాఘవేంద్ర ప్రస్తుతం కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం ఎంపీయూపీ పాఠశాలలో పనిచేస్తున్నారు. రీఅపోర్షన్లో ఆయన పోస్ట్ పోయింది. ప్రస్తుత స్టేషన్లో 2023 నుంచి 2025 వరకు పనిచేశారు. అంతకు మునుపు స్టేషన్లో 2017 నుంచి 2023 వరకు పనిచేశారు. ప్రీవియస్ స్టేషన్ పాయింట్లు వాడుకున్నా 17.5055 రావాలి. కానీ 8 ఏళ్లు పని చేసినట్లు 24 పాయింట్లు వేసుకున్నారు. ఈ విషయం గ్రీవెన్స్ సమయంలో ఎంఈఓకు కొందరు ఫిర్యాదు చేశారు. ఎంఈఓ స్వయంగా డీఈఓ కాఆర్యలయానికికి వెళ్లి 24 పాయింట్లు తొలగించి 17.5055 మా పాయింట్లు వేయించారు. ఆ తర్వాత ఏమి జరిగిందో.. ఎవరు సహకరించారో తెలీదు కానీ 24 పాయింట్లు వేసుకున్నారు. ప్రస్తుత కౌన్సెలింగ్లో కాలువపల్లి జెడ్పీహెచ్ఎస్కు వచ్చారు. ఈయనకంటే ఎక్కువపాయింట్లు ఉన్న టీచర్లకు అన్యాయం జరిగింది. ఈ వ్యవహారంపై ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పాతిరెడ్డి డీఈఓకు ఫిర్యాదు చేశారు.