
మీ ఊరి పక్కనే దాష్టీకం.. కనిపించలేదా?
● పరిటాల సునీతను ప్రశ్నించిన తోపుదుర్తి ప్రకాష్రెడ్డి
రాప్తాడురూరల్: ‘నీ సొంతూరుకు సమీపంలోనే ఉన్న ఏడుగుర్రాలపల్లిలో బాలికను 14 మంది బ్లాక్మేల్ చేసి నెలల తరబడి అత్యాచారం చేసి, గర్భవతిని చేసిన దాష్టీకం దృష్టికి రాలేదా సునీతమ్మా’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ప్రశ్నించారు. ఏడుగుర్రాలపల్లి ఘటనపై స్పందించిన తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ ఈ ఘటన ఆ గ్రామంలో ప్రతి ఇంటికీ తెలిసినా నీ చెవులకు సోకలేదా.. నువ్వేమైనా నిద్రపోతున్నావా అని మండిపడ్డారు. పోలీసులు, ఇంటెలిజెన్స్, స్పెషల్బ్రాంచ్ ఏమి చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒత్తిళ్లు.. ఆంక్షల తర్వాత వెలుగు చూసిన ఈ ఘటనపై తాము మాట్లాడుతున్నామన్నారు. బాలికకు అన్యాయం చేసిన వారు ఎవ్వరైనా సరే కఠినంగా శిక్షించాలన్నారు. ఒక మహిళగా కనీస స్పందన లేకుండా... ‘వైఎస్సార్సీపీ నాయకులు బాలిక విషయంలో రాజకీయాలు చేస్తున్నారు’ అని సిగ్గు లేకుండా ఎలా మాట్లాడతారని మండిపడ్డారు. నిందితులకు కఠినంగా శిక్ష పడాలంటే మీరు లాయర్లను ఏర్పాటు చేయొద్దని సునీతకు సూచించారు. బాలికకు న్యాయం చేయలేని నీవు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బయటకు రాని ఘోరాలెన్నో..?
ఏడుగుర్రాలపల్లి 40 ఏళ్లుగా మీకు రిగ్గింగ్ గ్రామమని ప్రకాష్రెడ్డి అన్నారు. అంత ఏకఛత్రాధిపత్యం నడుపుతున్న గ్రామంలో బాలికకు ఇంతటి అన్యాయం జరిగినా మీకు తెలీలేదంటే ఎవరు నమ్ముతారు అని పరిటాల సునీతను ప్రశ్నించారు. రామగిరి మండలంలో తొలి గ్రామం కుంటిమద్దికి రావాలంటేనే పోలీసులు మమ్మల్ని రానివ్వడం లేదన్నారు. పోలేపల్లి గుడికి వెళ్తామంటే అడ్డుకున్నారన్నారు. పరిటాల కుటుంబం ఆధిపత్యం చలాయించే గ్రామాల్లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన ఒక్కటేనన్నారు. బయటకు రాకుండా ఎన్నిఘోరాలు.. నేరాలు జరుగుతున్నాయో అని అనుమానం వ్యక్తం చేశారు. రామగిరి బంగారు గనుల గుంతల్లో వందలాది శవాలున్నాయని గతంలో చెప్పుకునేవారని గుర్తు చేశారు. ఎక్కడెక్కడో చంపి శవాలను అక్కడేశారన్నారు. మీరంటే అలాంటి భయం ఇంకా కొనసాగుతోందన్నారు. అందుకే మాజీ ఎమ్మెల్యే అయిన తనను ఆ మండలంలోకి రానివ్వాలంటే పోలీసులు భయపడుతున్నారన్నారు. అలాంటి మీ కంచుకోటలో అకృత్యం జరిగిందన్నారు. ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయం గురించి ఒక పత్రిక రాసిందన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా తాను నోరు విప్పి మాట్లాడితే రాజకీయం అంటగడుతున్నావంటే నువ్వు మహిళవేనా అని ప్రశ్నించారు.