
అర్ధరాత్రి దాకా పదోన్నతుల కౌన్సెలింగ్
అనంతపురం ఎడ్యుకేషన్: ఎస్జీటీ కేడర్ నుంచి స్కూల్ అసిస్టెంట్ కేడర్లకు పదోన్నతులు కల్పించేందుకు శుక్రవారం అనంతపురంలో నిర్వహించిన కౌన్సెలింగ్ అర్దరాత్రి దాటేదాకా సాగింది. అన్ని యాజమాన్యాల పరిధిలోని 686 పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ సాగింది. మున్సిపల్ పాఠశాలల్లో 304 పోస్టులు, మున్సిపల్ కార్పొరేషన్లో 52 పోస్టులు, ప్రభుత్వ పాఠశాలల్లో 26, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 304 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. మున్సిపల్, కార్పొరేషన్ స్కూళ్లలో పోస్టులకు 1:2, ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పోస్టులకు 1:3 రేషియో ప్రకారం టీచర్లను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల్లోనూ పదోన్నతులకు పెద్దగా ఆసక్తి చూపలేదు. సౌకర్యవంతమైన ఖాళీలు లేకపోవడంతో చాలామంది పదోన్నతులు తీసుకోలేదు. మునిసిపల్, కార్పొరేషన్ టీచర్లకు కేఎస్ఆర్ స్కూల్లో, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు శారదా స్కూల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్ కౌన్సెలింగ్ను పర్యవేక్షించారు. కౌన్సెలింగ్ హాజరైన టీచర్లతో ఆప్షన్ తీసుకుని ఆన్లైన్లో నమోదు చేశారు. వారందరికీ శనివారం పదోన్నతుల ఉత్తర్వులు జనరేట్ కానున్నాయి. వీరితో పాటు బదిలీ అయిన స్కూల్ అసిస్టెంట్లు, పీఎస్హెచ్ఎంలు (స్కూల్ అసిస్టెంట్ కేడర్ టీచర్లు) అందరూ శుక్రవారం వారి పాత స్కూళ్లలో రిలీవై.. శనివారం ఉదయం కొత్త స్కూళ్లల్లో చేరాల్సి ఉంటుందని డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు సంబంధించి శుక్రవారం తెల్లవారుజామున నుంచే ఉత్తర్వులు జనరేట్ అయ్యాయి. ఏ సబ్జెక్టులో ఎంతమంది బదిలీ అయ్యారనే వివరాలను రాత్రి 12 గంటలు దాటినా విద్యాశాఖ అధికారులు ప్రకటించకపోవడం గమనార్హం. దీనిపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
రోస్టర్ రగడ
కార్పొరేషన్ పరిధిలోని స్కూళ్లకు స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతుల విషయంలో అధికారులు రోస్టర్ పాటించడం లేదంటూ రాష్ట్రోపాధ్యాయ సంఘం నాయకులు రగడ చేశారు. రోస్టర్ సక్రమంగా పాటించాలంటూ ఆ సంఘం జిల్లా ప్రధానకార్యర్శి ఎస్.రామాంజనేయులు డిమాండ్ చేశారు. కేఎస్ఆర్ బాలికల పాఠశాలలో జరిగిన కౌన్సెలింగ్ను అడ్డుకున్నారు. అక్కడే ఉన్న ఆర్జేడీ... ఈ విషయంపై జేడీ సర్వీసెస్తో ఫోన్లో మాట్లాడి స్పష్టత ఇచ్చారు. అనంతరం కౌన్సెలింగ్ ప్రారంభమైంది.
కనీస వసతులు లేక అల్లాడిన టీచర్లు
సాయంత్రంలోపు కౌన్సెలింగ్ ముగుస్తుందని ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులకు అర్ధరాత్రి దాటినా కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరీ ముఖ్యంగా ఆయా కేంద్రాల్లో కనీసం తాగునీటి వసతి కూడా కల్పించలేదు. పెద సంఖ్యలో వచ్చిన టీచర్లు సరైన వెలుతురు లేక ఇబ్బందులు పడ్డారు. వసతుల కల్పనలో విద్యాశాఖ పూర్తిగా వైఫల్యం చెందిందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడ్డారు.
మున్సిపల్, కార్పొరేషన్ టీచర్లకు కేఎస్ఆర్ స్కూల్లో కౌన్సెలింగ్
జిల్లాపరిషత్, ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు శారదా స్కూల్లో..
పర్యవేక్షించిన పాఠశాల విద్య ఆర్జేడీ

అర్ధరాత్రి దాకా పదోన్నతుల కౌన్సెలింగ్