బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన అనంత
అనంతపురం కార్పొరేషన్: ముస్లింలకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ అని, ఈ పండుగ పర్వదినాన ముస్లింలకు అల్లా ఆశీస్సులుండాలని ఆకాంక్షించారు. బక్రీద్ పర్వదినం రోజున ఖుర్బానీ ఇచ్చే ముస్లింలకు ఎంతో పుణ్యఫలం లభిస్తుందన్నారు. త్యాగం మనిషిని ఉన్నతుడిని చేస్తుందని, దైవ పరీక్షలో కట్టుకున్న భార్యను వదిలి, కన్నకొడుకు ప్రాణాలు బలిచ్చేందుకు సిద్ధపడిన మహనీయుని త్యాగానికి గుర్తుగా ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని జరుపుకుంటారని తెలిపారు.
కలెక్టర్ బక్రీద్ శుభాకాంక్షలు
అనంతపురం అర్బన్: ముస్లింలకు కలెక్టర్ వినోద్కుమార్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ను ఆనందంగా జరుపుకోవాలని, అల్లా కృపతో జిల్లా సుభిక్షంగా ఉండాలని ఆకాక్షించారు.
తాగునీటి సమస్యపై స్పందించరేం?
కూడేరు: ముద్దలాపురం ఎస్సీ కాలనీవాసులు తాగునీటి కోసం శుక్రవారం అనంతపురం – బళ్లారి జాతీయరహదారిపై నిరసన చేపట్టారు. సాయంత్రం ఆరు గంటల నుంచి అరగంటపాటు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. పలువురు దళితులు మాట్లాడుతూ పీఏబీఆర్ నుంచి సీపీడబ్ల్యూఎస్ ప్రాజెక్టు ద్వారా సరఫరా కావాల్సిన తాగునీరు తమ కాలనీకి 15 రోజులుగా నిలిచిపోయిందన్నారు. దీనికితోడు పంచాయతీ నీరు కూడా రావడం లేదన్నారు.
తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఏ ఒక్కరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో తహసీల్దార్ మహబూబ్ బాషా, సీఐ రాజు వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. మోటార్ల సమస్య వల్ల తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగిందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. తాత్కాళికంగా ట్యాంకర్తో నీరు సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో కాలనీవాసులు ఆందోళన విరమించారు.

తాగునీటి సమస్యపై స్పందించరేం?

ముస్లింలకు అల్లా ఆశీస్సులుండాలి