
కొత్త రేషన్కార్డులకు గ్రీన్ సిగ్నల్
● మార్పులు, చేర్పులకు అవకాశం ● ప్రారంభమైన క్షేత్రస్థాయి విచారణ ● నిరుపేదల నిరీక్షణకు ఎట్టకేలకు తెర
కై లాస్నగర్: కొత్త రేషన్ కార్డుల జారీపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దృష్టి సారించింది. అర్హులందరికీ కార్డులు అందించాలని నిర్ణయించింది. అలాగే ప్రస్తుతం ఉన్న కా ర్డుల్లోనూ మార్పులు, చేర్పులకు సై తం అవకాశం కల్పించింది. ఇందుకో సం ప్రజాపాలన, మీ సేవ కేంద్రాల ద్వారా అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణకు ఆదేశించింది. అందుకు అనుగుణంగా రంగంలోకి దిగి న రెవెన్యూ యంత్రాంగం ము న్సిపల్, గ్రామీణ ప్రాంతాల్లో అర్హుల గుర్తింపునకు శ్రీకారం చుట్టింది. దరఖాస్తుదారుల కుటుంబసభ్యుల వివరాలతో పాటు, వారి సమగ్ర సమాచారం సేకరిస్తూ ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు. త్వరలోనే వారికి కొత్త కార్డులు జారీ అయ్యే అవకాశముంది. కాగా పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసిన గ్రామాల్లోని 1,652 మందిని రేషన్కార్డుల్లో చేర్చారు. వారి కోసం 10 క్వింటాళ్ల బియ్యం కేటాయించారు. వీరంతా ఈనెలా కోటాలో బియ్యం పొందనున్నారు.
జిల్లాలో 51,903 దరఖాస్తులు
కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్కార్డుల జారీ కోసం ప్రజాపాలన, మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. దీంతో వాటి కోసం ఆశగా ఎదురుచూస్తున్న పేదలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 51,903 దరఖాస్తులు రావడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇందులో ప్రజాపాలన కార్యక్రమంలో 47,075, మీసేవ కేంద్రాల ద్వారా 4,860 దరఖాస్తులు వచ్చాయి. కొత్త కార్డులు జారీ చేయకపోవడంతో పాటు ఉన్న వాటిలోనూ కొత్తగా సభ్యుల పేర్లను చేర్చకపోవడం, వివరాల మార్పులకు సైతం అవకాశం ఇవ్వకపోవడంతో కొత్తగా పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చిన మహిళలు, పుట్టిన పిల్లల పేర్లు కార్డుల్లో నమోదుకు నోచుకోలేదు. ఇలాంటి వారికి కూడా అవకాశం కల్పించడంతో వాటికి కూడా పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. కుటుంబ సభ్యుల పేర్లను చేర్చేందుకు 22,963, కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం 19,562 దరఖాస్తులు వచ్చాయి.
క్షేత్రస్థాయి విచారణ షురూ...
ప్రజాపాలన, మీసేవ కేంద్రాల ద్వారా రేషన్కార్డుల కోసం అందిన దరఖాస్తుల్లో అర్హుల గుర్తింపునకు క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. నూతన కార్డుల జారీ, మార్పులు, చేర్పులకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా రెవెన్యూ యంత్రాంగం దానిపై దృష్టి సారించారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి విచారణ చేపడుతున్నారు. అర్హులను గుర్తించేందుకు వివరాలు సేకరిస్తున్నారు. సాగునీటి వసతి కలిగిన భూమి అయితే 3 ఎకరాలు, సాగునీటి వసతి లేనటువంటి అయిదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారిని జాబితా నుంచి తొలగిస్తున్నారు. కుటుంబ సభ్యులు, ఆధార్, మొబైల్ నంబర్, భూమి విస్తీర్ణం, కారు, బైక్ ఉన్నాయా? తదితర వివరాలతో పాటు వారి ఆస్తుల వివరాలను పరిశీలిస్తూ ఫుడ్ సెక్యూరిటీ కార్డు యాప్లో నిక్షిప్తం చేస్తున్నారు. ఒక కుటుంబానికి అయిదెకరాల భూమి ఉండి యాప్లో తక్కువ నమోదైతే పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగా తిరిగి నమోదు చేస్తున్నారు. ఇలాంటి వివరాల ఆధారంగా అనర్హులను ఏరివేస్తున్నారు.
సర్వేలో సాంకేతిక సమస్యలు
సర్వేకు వెళ్లిన రెవెన్యూ ఉద్యోగులకు అర్హుల గుర్తింపులో సాంకేతిక సమస్యలు తప్పడం లేదు. మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసిన సమయంలో ఆధార్కార్డు నంబర్కు బదులుగా ఇతరత్రా నంబర్లను నమోదు చేశారు. దీంతో యాప్లో ఆధార్కార్డును నమోదు చేస్తే అది నమోదు కావడం లేదు. కొంతమంది పాత కార్డుల్లో తమ పేర్లను తొలగించుకోకుండానే కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేశారు. ఇలాంటి వారి వివరాలు సైతం యాప్లో అప్లోడ్ కావడం లేదు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు కొన్ని గ్రామాల్లో నెట్వర్క్ సమస్య తలెత్తడంతో యాప్లో వివరాల నమోదుకు ఇబ్బందిగా మారుతున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలో కొత్తకార్డులకోసం అందిన దరఖాస్తుల వివరాలు
ప్రజాపాలనలో అందిన దరఖాస్తులు 47,075
అధికారులు పరిశీలించినవి 8,824
అర్హులుగా గుర్తించినవి 8,460
అనర్హులుగా తేలినవారు 311
మీ సేవ కేంద్రాల ద్వారా అందిన దరఖాస్తులు 4,860
అధికారులు పరిశీలించినవి 76
పెండింగ్లో ఉన్న దరఖాస్తులు 4,784
సరైన సమాచారమివ్వాలి
కొత్త రేషన్ కార్డుల జారీకోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తహసీల్దార్ల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇంటి వద్దకు వచ్చే రెవెన్యూ సిబ్బందికి దరఖాస్తుదారులు వాస్తవంతో కూడిన సమాచారం అందించాలి. తప్పుడు సమాచారమిస్తే కార్డులు ఇవ్వకపోగా బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అనర్హులు స్వచ్ఛందంగా వారి కార్డులను అధికారులకు సరెండర్ చేయాలి.
– ఎండీ వాజీద్ అలీ,
డీసీఎస్వో, ఆదిలాబాద్

కొత్త రేషన్కార్డులకు గ్రీన్ సిగ్నల్