breaking news
World Literature
-
మూగవాని పిల్లనగ్రోవి!
‘నేను ఒంటరిగా కూర్చుని రాసుకునే సమయంలోనే నాకు ఇతరులతో సంభాషిస్తున్నట్లు అనిపిస్తుంద’న్న పాపానికి ఆ కవి, నాటకకర్త, నవలా రచయిత, సినిమా దర్శకుడు– రచయిత, నోబెల్ సాహిత్య పురస్కార విజేత ‘ఉలిపికట్టె‘ అనే బిరుదు సంపాదించుకున్నాడు. ‘గడ్డకట్టించే చల్లదనం లాంటిది ఒంటరితనం; అది వేధించే శూన్యతలాంటిది.అలాంటి సందర్భాల్లో, మనం మరీ అంత దిగజారిపోలేదని నచ్చజెప్పే తోడొకటి అవసరమ’ని చెప్పిన ఆ రచయితను పట్టుకుని ‘ఉలిపికట్టె‘గా జమకట్టడం సరైందేనా? ‘కళాకారుల సృజనలో జీవనగమనం ప్రతిఫలించినప్పుడే, వాళ్ళు ఆదర్శవ్యక్తులు కాగలుగుతార’న్న ఆ పెద్దమనిషిని పదిమందితో కలవడానికి ఇష్టపడని ‘నామాల కాకి’గా పరిగణించడం భావ్యమేనా? కానీ జెర్మన్ రచయిత పీటర్ హాంట్కె మొహాన యూరపియన్ పీఠాధిపతులు అవే ముద్రలు కొట్టారు. అలా మనుషుల మొహాలపై ముద్రలు కొట్టే పీఠాధిపతుల్లో చాలామందికి – సాధారణంగా – స్పందించే హృదయం ఉండదంటారు. హాంట్కె కథ వింటే ఆ మాట నిజమేననిపిస్తుంది! ముందు అతని కథ చెప్పుకుని, అప్పుడతని కళాకౌశలం గురించి చెప్పుకుందాం.దాదాపు వెయ్యిన్నర సంవత్సరాలుగా ఆగ్నేయ యూరపులోని బాల్కన్ ద్వీపకల్పం సమీపంలో నివసిస్తున్నది సెర్బు జాతి. రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ, తదనంతర మారణకాండల్లోనూ తీవ్రంగా నష్టపోయిన జాతుల్లో అదీ ఒకటి. మొదటి ప్రపంచయుద్ధం నాటికి సెర్బుల జనసంఖ్య 45 లక్షలు. వాళ్ళలో 17శాతం– ఎనిమిది లక్షల వరకు– ఆ యుద్ధానికి బలయ్యారు. రెండో ప్రపంచయుద్ధం నాటికి సెర్బుల జనసంఖ్య 55 లక్షలు కాగా, వారిలో పదిశాతం ఆ యుద్ధంలో తుడిచిపెట్టుకు పోయారు. అటు తర్వాత 1990 నాటికి సెర్బుల జనాభా 85 లక్షలకు చేరుకుంది.ఆ దశకంలో జరిగిన మారణకాండల్లో దాదాపు యాభైవేలమంది సెర్బులు బలైపోయారు; ఏడు లక్షలమంది ఇల్లూ వాకిలీ పొలమూ పుట్రా లేకుండాపోయారు. అలాంటి బాధిత జాతిలో పుట్టినవాడు పీటర్ హాంట్కె! ఇప్పుడు మనం ఆస్ట్రియాగా పిలిచే ప్రాంతమంతా ఒకప్పుడు ఐక్య జెర్మన్ సామ్రాజ్యంలో భాగంగా వుండేది. ఆరోజుల్లో– 1942లో– హాంట్కె అక్కడ పుట్టాడు. దక్షిణ ఆస్ట్రియాలో, కొండలూ కొలనులకు నెలవై వుండే ప్రాంతం కెరెంథియా. అందులో భాగంగా వుండే గ్రిఫిన్ అనే పట్టణం హాంట్కె స్వస్థలం.హాంట్కె కుటుంబ జీవనం స్థిమితంగా సాగిన సందర్భం లేదనే చెప్పాలి. అతని తల్లి ప్రపంచయుద్ధాలూ– ఆర్థికమాంద్యం– ద్రవ్యోల్బణం తదితర పరిణామాల నేపథ్యంలో తెగిన గాలిపటంగా మారిన మనిషి. కాకుల్లా పొడిచే పలుగాకుల మధ్యన అలాంటి బతుకు బతకలేక 1971లో అతని తల్లి మారియా ఆత్మహత్య చేసుకుంది. ‘పుర్రచేతి వాటం స్త్రీ’ అనే నవలికను 1972లో తన తల్లి జ్ఞాపకంగా హాంట్కె రాశారు; తర్వాత నాలుగేళ్ళకు ఆ నవలికనే ‘కలలను మీరిన ఖేదం’ పేరిట స్వీయ దర్శకత్వంలో సినిమాగానూ రూపొందించారు. సినిమా రంగంతో అతనికి అంతకు పదేళ్ళకు ముందు నుంచీ సంబంధముంది.తనే స్వయంగా నాలుగు సినిమాలు తీసిన హాంట్కె, 1969 నుంచి ’87 వరకూ విమ్మ్ వెండెర్స్ తీసిన నాలుగు సినిమాలకు స్క్రిప్టులు రాశాడు. వ్లాదిమిర్ గెరిక్ దర్శకత్వంలో రూపొందిన యుగోస్లావీన్ టీవీ ఫిల్మ్ ‘క్యాస్పర్’ స్క్రిప్టును కూడా హాంట్కెయే రచించారు. ‘క్యాస్పర్ హాసర్ జీవితకథ’గా పందొమ్మిదో శతాబ్దిలో ప్రచురమైన కల్పితగాథ ఆధారంగా హాంట్కె ముందో రూపకం రాశాడు. దాన్నే తర్వాత టీవీ స్క్రిప్టుగా రూపొందించాడు. (రడ్యార్డ్ కిప్లింగ్ ప్రసిద్ధ రచన ‘జంగిల్ బుక్’లోని మౌగ్లీ కూడా క్యాస్పర్ హాసర్ కోట్ జేబులోంచే ఊడిపడ్డాడంటారు! –అదలా వుంచండి.)దృశ్యమాధ్యమాల కోసం హాంట్కె రూపొందించిన ఈ రెండు స్క్రిప్టులకూ కొంత సామ్యముంది– కొంత వైరుద్ధ్యమూ వుంది. హాంట్కె తల్లి లోకరీతి ప్రకారం బతికిన మనిషి కాదు; అలా బతకాలని ఆమె అనుకోనూ లేదు! క్యాస్పరుకు ‘నాగరికుల’ భాష రానట్లే, ఆమెకి లోకం పోకడ తెలీదు. వాళ్ళిద్దరూ– ఓ రకంగా– మూగవాళ్ళే! సామాజిక కట్టుబాట్లను ఖాతరు చెయ్యనివాళ్ళే!! అయితే, క్యాస్పర్ లోకంపోకడ ఒంటబట్టించుకుని, సామాజిక జీవనంలో కలిసి పోవాలనుకున్నాడు. కానీ, అలా చెయ్యలేకపోయాడు.అతని మృతికి కారణమైన గాయం ఇతరులు చేసిందా? స్వయంగా తనను తానే పొడుచుకున్నాడా అనే ప్రశ్నకు గత రెండువందల యేళ్ళుగా సమాధానం దొరకనే లేదు! పోతే– మారియా మాత్రం తనకు నచ్చినట్లే బతకాలని ప్రయత్నించి, పదేపదే విఫలమై విసిగిపోయిన మనిషి. వాళ్ళ మూగ ఆవేదనలే ఇతివృత్తంగా హాంట్కె ఈ రెండు స్క్రిప్టులూ రచించాడు. కట్టుబాట్ల అరదండాల మధ్య ఊపిరిసలపని మూగవాళ్ళ మూలుగులను మనకు వినిపించిన పిల్లనగ్రోవే హాంట్కె కలం.వాస్తవానికి, హాంట్కె రాసిన 40 నవలల్లోనూ, 15 రూపకాల్లోనూ, అసంఖ్యాకమైన అతని స్క్రీన్ ప్లేలలోనూ అంతర్లీనంగా వుండే సామాన్య సూత్రమిదే! ‘కళ అటు ఆనందంలోంచీ, ఇటు ఆవేదనలోంచీ కూడా పుడుతుంది; అయితే చాలామటుకు ఉత్తమ కళాఖండాలు వేదనలోంచే రూపుదిద్దుకుంటాయ’న్నాడు నార్వీజియన్ పెయింటర్ ఎడ్వాడ్ మూంక్. 2019లో నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్న హాంట్కె అలాంటి అభిప్రాయాలను అంత సూటిగా ఎప్పుడూ చెప్పలేదు. కానీ అతని సాహిత్యమంతటా అలముకుని వున్న తాత్త్వికత అదే!- మందలపర్తి కిషోర్ -
సొంతకథను చెప్పుకున్న 'పరదేశి'!
కెజువో ఇషిగురో ప్రపంచ ప్రసిద్ధ బ్రిటిష్ రచయిత. కవనం లాంటి వచనం రాయగలిగిన ఈ నవలా రచయిత మొదట్లో కథానికలతోనే పదిమంది దృష్టిలో పడ్డారు. ఈ రెండు ప్రక్రియల్లోనూ అందెవేసిన చెయ్యి అనిపించుకోవడానికి ముందు కెజువో తను రాసుకున్న పాటలను తానే స్వరబద్ధం చేసుకుని గిటారు మీద వాటిని పలికిస్తూ అనేక యూరపియన్ దేశాల్లో పర్యటించాడు.అయితే, కెజువోను వాగ్గేయకారుడిగా గుర్తించడానికి యూరప్ పెద్ద ఆసక్తి చూపించలేదు. ఆ దశలోనే అతనికి స్టేసీ కెంట్–జిం టాంలిన్సన్ దంపతులతో పరిచయం ఏర్పడింది. ఆశావాదంతో పొంగిపొర్లే గీతాలను మాత్రమే పాడాలన్నది వారి నియమం! దాంతో, కెజువో భావనా స్వేచ్ఛకు సంకెళ్ళు వేసినట్లయింది. అయినప్పటికీ, కెజువో వాళ్ళకోసం 16 ఆల్బమ్లను రూపొందించారు! అది వేరే విషయం. తన జీవితానుభవంలోని చీకటినీడలను చిత్రించే నిమిత్తం కెజువోకు వచనాన్ని ఆశ్రయించక తప్పలేదు! చిత్రమేమిటంటే, అతగాడికి కథానికలూ– నవలల రచయితగానే ఎక్కువ పేరొచ్చింది. బుకర్ ప్రైజ్ మొదలుకొని నోబెల్ సాహిత్య పురస్కారం వరకూ అతన్ని వరించి వచ్చాయంటే అందుకు కెజువో వచన రచనలే కారణం. 1950 దశకం నాటి ఇతివృత్తాలతో రూపొందించిన నవలలూ కథానికలవి. అంతకన్నా నాలుగడుగులు వెనక్కి వేసి, మరికొన్ని రచనలు కూడా చేశాడు కెజువో. బహుశా ఆ కారణంగానే జేన్ ఆస్టిన్, చార్ల్స్ డికెన్స్, షార్లట్ బ్రాంట్, జార్జ్ ఇలియట్ లాంటి పందొమ్మిదో శతాబ్ది మహామహులతో కెజువో ఇషిగురోను పోల్చింది పాశ్చాత్య ప్రపంచం!రెండో ప్రపంచయుద్ధం ముగిసిపోతున్న తరుణంలో, అమెరికా తను రూపొందించిన అణుబాంబు విధ్వంసం ఎంత తీవ్రంగా వుంటుందో ప్రపంచానికి చూపించాలనుకొంది. 1945, ఆగస్ట్ తొమ్మిదో తేదీన ఈ దారుణానికి వేదిక అయిన దౌర్భాగ్యం నాగసాకి నగరానిది. అదే కెజువో స్వస్థలం. ప్రపంచయుద్ధం ముగిసిన తొమ్మిదేళ్ళకు, 1954లో కెజువో అక్కడ పుట్టాడు. 1959లో అయిదేళ్ళ కెజువోను వెంటబెట్టుకొని అతని తల్లితండ్రులు బ్రిటిష్ గడ్డపైకి వలస వచ్చేశారు. పరాయిగడ్డపై తన జాతీయతకు సంబంధించిన కెజువో ఆలోచనలే అతని తొలి రెండు నవలలకు ఇతివృత్తంగా అమిరాయి. ఆ మాటకొస్తే అతని మొత్తం సాహిత్య జీవితమంతా ఇవే నీడలు పరుచుకుపోయాయి.నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకోవడానికి మూడున్నర దశాబ్దాలకు ముందే –1982లో– కెజువో ‘దూరపుకొండల అస్పష్ట దృశ్యం’ అనే నవల రాశారు. ‘అది చదివినప్పటి నుంచీ కెజువో రచనారీతిని నేను అభిమానిస్తున్నాన’న్నారు సల్మాన్ రష్డీ. ఎత్సుకో అనే నడివయసు జపనీస్ మహిళ విషాద గాథ ఈ నవలకు ఇతివృత్తం. తన కుమార్తె ఆత్మహత్య సంఘటన మిగిల్చిన గాయం నుంచి బయటపడేందుకు ఎత్సుకో చేసే ప్రయత్నాన్నే ‘దూరపుకొండల అస్పష్ట దృశ్యం’లో కవితాత్మకంగా వర్ణించారు కెజువో. రెండో ప్రపంచయుద్ధం ముగింపు సందర్భంగా 1945లో నాగసాకి నగరం ఎలావుండేదో ఎత్సుకో నెమరేసుకోవడం ఈ నవలకు ఇతివృత్తం. ఈ నవలలో, ఎత్సుకో జ్ఞాపకాలుగా చిత్రితమైన చాలా విషయాలు వాస్తవానికి కెజువో తల్లితండ్రుల అనుభవాలేనంటారు.1986లో కెజువో తన రెండో నవల ‘తేలుతున్న ప్రపంచంలో మునుగుతున్న చిత్రకారుడు’ రాశారు. మసూజీ ఓనో అనే వృద్ధ చిత్రకారుడి ఉత్తమ పురుష కథనంగా ఈ నవలను రాశారు కెజువో. టోజో నియంతృత్వానికి చెక్కభజన చేసేందుకే తన కళను వినియోగించిన గతం మసూజీది. ఆ రోజుల్లో గొప్ప చిత్రకారుడిగా ఓ వెలుగు వెలిగిన మసూజీ, తర్వాతి రోజుల్లో అప్రతిష్ఠ పాలవుతాడు. ఆ విషయమే తలచుకుని బాధపడుతుంటాడు మసూజీ. ఈ వృద్ధ చిత్రకారుడు చివరికి సమాధానపడి, టై కట్టుకుని కూలిపని చేసుకునే ఆధునిక కార్మికులను గౌరవించి, తప్పుకున్నట్లు చిత్రిస్తూ ఈ నవలను ముగించాడు కెజువో.మొత్తం మీద, కెజువో నాలుగుసార్లు బుకర్ బహుమతి కోసం నామినేట్ అయినప్పటికీ ఒక్కసారి మాత్రమే ప్రైజు పొందారు. 1989లో వెలువడిన ‘పగళ్ళ మిగుళ్ళు‘ అనే నవలకే కెజువో బుకర్ ప్రైజ్ గెల్చుకున్నారు. 1930 దశకం నాటి ఓ ప్రేమపురాణాన్ని– అదేకాలంలో ఆసియన్ దేశాల్లో వ్యాపించిన బ్రిటిష్ ప్రభుభక్తి గాథనూ పడుగుపేకలుగా అల్లిన యాత్రాచరిత్ర ఈ నవల. కథానాయకుడు స్టీవె¯Œ ్స అనే జపనీస్ బట్లరు. చివరికి, అటు ప్రేమపురాణం వల్ల కానీ, ఇటు బ్రిటిష్ ప్రభుభక్తివల్ల గానీ మన బట్లరు దొర బావుకున్నదేమీ లేదని తేల్చి, 1950 దశకంలో కథ ముగిస్తాడు కెజువో. సల్మాన్ రష్డీతో సహా, ఎందరో ప్రముఖులు ఈ నవలను కెజువో సాధించిన పరిణతికి నిదర్శనంగా ఎంచారు.కెజువో నవలల్లో, ప్రయోగాత్మక రచన ‘నెవర్ లెట్ మి గో‘ (నన్నెన్నడూ పోనియ్యకు!) అంటారు విమర్శకులు. 1990 దశకంలో పాశ్చాత్య దేశాల్లో విశేషంగా చర్చకు వచ్చిన విషయాల్లో ‘ఆర్గన్ హార్వెస్టింగ్‘ ఒకటి. కోరుకున్న మొక్కలను అంటుకట్టడం– లేదా ఆయా మొక్కల జన్యు కణ ప్రతిరూపాలను వేరే మొక్కల్లో పెంచడం లాంటిదే ‘ఆర్గన్ హార్వెస్టింగ్‘ కూడా. లోపభూయిష్ఠమైన అవయవాలకు జన్యు ప్రతిరూపాలను రూపొందించి, వాటిని వేరే శరీరాల్లో ‘పెంచుతారు.‘ మూల వ్యక్తులకు అవసరమైనప్పుడు శస్త్రచికిత్స చేసి అవయవాల మార్పిడి చేస్తారు. ఈ ప్రక్రియనే ఇతివృత్తంగా తీసుకుని రాసిన నవలే ‘నెవర్ లెట్ మి గో‘. 2005లో ఈ నవలకు ఆర్థర్ క్లార్క్ పురస్కారం దక్కింది. వివాదాస్పదమైన ఇలాంటి అంశాలపై రాసే నవలలు దూషణభూషణలు రెండింటినీ స్వీకరించక తప్పదు కదా!‘ఈ ప్రపంచంతో మనకు ఉందనుకునే కల్పిత సంబంధానికి అట్టడుగున ఉన్న అధోలోకం పైన మూతను తొలగించిన రచయిత’గా కెజువో ఇషిగురాను అభివర్ణించింది స్వీడిష్ ఎకాడెమీ. 2017లో నోబెల్ సాహిత్య పురస్కారం గురించిన ప్రకటనలో సారా డేనియస్ చెప్పిన మాటలివి. అవి అక్షర సత్యాలు!- మందలపర్తి కిషోర్ -
TANA: తానా ప్రపంచ సాహిత్యవేదిక ‘ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు’ సదస్సు విజయవంతం
డాలస్, టెక్సాస్: తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న సాహిత్య సమావేశాల పరంపరలో జూన్ 30న జరిగిన 68వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రల్ఙు సదస్సు ఘనంగా జరిగింది. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అతిథులను సాదరంగా ఆహ్వానించి సదస్సును ప్రారంభిస్తూ “ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు చదవడంద్వారా కేవలం వారు గడిపిన జీవితమేగాక ఆనాటి సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితులు, ప్రజల జీవనవిధానం మొదలైన ఎన్నో విషయాలు తెలుస్తాయి. అంతేగాక ఆయా ప్రముఖులు తమ జీవితాలలో ఎదుర్కొన్న సమస్యలు, ఆటుపోట్లు, వాటిని అధిగమించిన తీరునుండి మనం ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చునని అందువల్ల తెలుగు సాహిత్య ప్రక్రియలలో ‘జీవితచరిత్రలు’ లేదా ‘ఆత్మకథలు’ చాలా ముఖ్యభూమిక వహిస్తాయన్నారు. కృష్ణాజిల్లాలోని ‘ముదునూరు’ అనే గ్రామంలో “జీవితచరిత్రల గ్రంధాలయం్ఙ వ్యవస్థాపకులు డా. నాగులపల్లి భాస్కరరావు ఈ కార్యక్రమంలో విశిష్టఅతిథిగా పాల్గొని ఈ గ్రంధాలయ స్థాపన వెనుకఉన్న ఆశయాన్ని, అమలు జరుగుతున్న తీరుతెన్నులను సోదాహరణంగా వివరించారు. విశిష్టఅతిథులుగా పాల్గొన్నవారిలో సుప్రసిద్ధ రచయిత్రి, విద్యావేత్త ఆచార్య డా. సి. మృణాళిని ప్రముఖ రచయిత బుచ్చిబాబు సతీమణి శివరాజు సుబ్బలక్ష్మి రచించిన “మా జ్ఞాపకాల్ఙు అనే జీవితచరిత్రను మరియు బీనాదేవి పేరుతో భార్యాభర్తలు కలిసి జంటగా రాసిన అనేక రచనలను “బీనాదేవీయం్ఙ అనే గ్రంథాలలోని అనేక విషయాలను చాల హృద్యంగా ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత డా. జి. వి. పూర్ణచందు తెలుగువారికి తక్కువగా పరిచయమైన తమిళనాట ఆధ్యాత్మికరంగంలో ఎనలేని కృషిచేసిన తెలుగు ప్రముఖులు “అప్పయ్య దీక్షితుల్ఙు మరియు “అల్లూరి వేంకటాద్రిస్వామ్ఙి జీవిత చరిత్రలలోని అనేక విశేషాలను పంచుకున్నారు.ప్రముఖ సాహితీవేత్త, ప్రయోక్త కిరణ్ ప్రభ ఒక రష్యన్ యువతి కేవలం భారతీయ నృత్యకళలపై ఆసక్తితో తన పేరును “రాగిణీదేవ్ఙి గా మార్చుకుని ఎన్నో సాహసాలతో భారతదేశంలో అడుగుపెట్టి, అనేక సంవత్సరాలు కృషిచేసి నాట్యం నేర్చుకున్నదీ, నాట్యశాస్త్రంపై ఎంతో పరిణితితో కూడిన గ్రంథాలు రాసిందీ, తన కుటుంబం మొత్తం ఏ విధంగా నాట్యకళకు జీవితాంతం అంకితం అయిందీ లాంటి అనేక ఆసక్తికరమైన విషయాలను చాలా ప్రతిభావంతంగా ఆవిష్కరించారు. అలాగే తాను నమ్మిన సిద్దాంతంకోసం తన తుదిశ్వాస వరకు ఏవిధంగా గిడుగు ఒంటరి పోరాటం చేసినదీ, వ్యావహారిక భాషోద్యమ పితామహుడు “గిడిగు వేంకట రామమూర్త్ఙి గారి జీవితంలోని అనేక కోణాలను కిరణ్ ప్రభ విశ్లేషించారు. సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇలాంటి సాహితీ సమావేశాలు విద్యార్థులకోసం ప్రత్యేకంగా నిర్వహించడం చాలా అవసరం అన్నారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకెద్వారా వీక్షించవచ్చును. https://www.youtube.com/watch?v=PpLUQ3jT2JU -
ఒక్క బైబిల్... వంద రచనలకు స్ఫూర్తి!
వరల్డ్ లిటరేచర్ బైబిల్ కథలు, జీసస్ జీవితం, బోధనల ఆధారంగా క్రైస్తవమతం తొలినాళ్లనుండే పశ్చిమ దేశాలలో కథలూ కావ్యాలూ రాస్తూ ఉన్నారు. ఈ రచయితల్లో కొందరిది మతదృష్టి అయితే మరి కొందరిది సామాజిక స్ఫూర్తి. తల్లిదండ్రుల్ని ఆదరించాలి, హత్య చెయ్యకూడదు, వ్యభిచారమూ దొంగతనమూ నిషిద్ధం, తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు, పరస్త్రీనీ పరుల ఆస్తినీ కాంక్షించకూడదు అని ఆ దేవుడే స్వయంగా శాసించినా, నిజ జీవితంలో, నిత్యజీవితంలో జనం వాటిని ఏనాడూ తు.చ. తప్పకుండా ఆచరించలేదు. ఇలా చెయ్యడం పాపమని తెలిసినా, చట్టవ్యతిరేకమని భయపెట్టినా, దుష్టబుద్ధులకు ఇవేమీ అడ్డురాలేదు. సమాజ కల్యాణాన్ని కోరిన రచయితలు ఈ సమస్యలకే స్పందించారు. తమ కావ్యాలలో నిరసన తెలిపారు. ఉదాహరణకు, ఇటాలియన్ మహాకవి దాంతె అలిహెయిర్ (1265-1325) రాసిన డివైన్ కామెడీ, సమకాలీన అధి కారాల వర్గాల అవినీతిని ఎండగట్టడానికి సంధించిన వజ్రాయుధం. సెవెన్ డెడ్లీ సిన్స్ గురించీ, ఈ పాపాలు చేసిన ఆ నాటి ప్రముఖుల గురించీ ఇందులో ప్రస్తా విస్తాడు దాంతె. నరకం, పాపప్రక్షాళన జరిగే లోకం, స్వర్గం అనబడే మూడు లోకాలలో కవి ప్రయాణిస్తాడు. పాపులు నరకంలో అనుభవిస్తున్న శిక్షల్ని చూస్తాడు. జీవితకాలంలో వీళ్లందరూ అష్టయిశ్వర్యా లనూ అనుభవించినవాళ్లే. ఇప్పుడేమయింది వీళ్ల పరిస్థితి అని అన్యాపదేశంగా ప్రశ్నిస్తాడు. అలాగే మరో మూడు వందల ఏళ్ల తర్వాత, ఇంగ్లిష్ కవి జాన్ మిల్టన్ (1608-1674) ప్యారడైజ్ లాస్ట్ రాశాడు. ఈడెన్ ఉద్యానవనంలో ఆడమ్, ఈవ్లు నిషేధింపబడిన ఆపిల్ తిని, తమ అమరత్వాన్ని కోల్పోయిన వైనాన్ని చిత్రిస్తుందిది. భగవదాజ్ఞను ఉల్లంఘించకూడదంటాడు కవి. మిల్టన్ సమకాలీనుడే జాన్ బర్డన్ (1628-1682). మత విశ్వాసమే మనిషికి సంస్కృతి అంటాడు. 1678లో తొలిసారి అచ్చయిన ‘ద పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్’ అనే ఈయన పుస్తకం కేవలం క్రైస్తవ ప్రచార గ్రంథంగానే గాక, సత్ప్రవర్తన, సచ్ఛీలత ఎంత ముఖ్యమో వివరిస్తుంది. భాష కూడా సరళంగా ఉండడంతో ఇంగ్లిష్ భాషలోనే అత్యంత ప్రాచుర్యం చెందిన పుస్తకంగా కూడా పేరు గాంచింది. ఇప్పటి దాకా ఇది ఎప్పుడూ ఔటాఫ్ ప్రింట్లో లేదట. 200 భాషల్లోకి అనువాదమైన పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ గాంధీజీని బాగా ప్రభావితం చేసిన పుస్తకాల్లో ఒకటి. ఈ క్లాసిక్స్ మాత్రమేగాక బైబిల్తో ప్రేరణ పొంది లేదా దాన్ని వ్యాఖ్యానిస్తూ (కొన్నిసార్లు వివాదాలు సృష్టిస్తూ కూడా) అనేకమంది నవలలు ప్రచురించారు. ఈ శతాబ్దపు తొలి రోజుల్లో హెవెన్, ఈడెన్, ఫ్లడ్ల గురించి మార్క్ ట్వెయిన్ రాసిన హాస్య, వ్యంగ్య వ్యాసాలన్నీ కలిపి ‘ద బైబిల్ ఎకార్డింగ్ టు మార్క్ ట్వెయిన్’ పేరుతో వచ్చిన ప్పుడు అది పెద్ద సంచలనం సృష్టించింది. డి.హెచ్.లారె న్స్ (ద మ్యాన్ హూ డైడ్); జాన్ శరమాగో(కాయిన్; ద గాస్పెల్ ఎకార్డింగ్ టు జీసస్ క్రైస్ట్) నార్మల్ మైలర్ (ద గాస్పెల్ ఎకార్డింగ్ టు ద సన్)లు తమ రచనలతో దుమారం లేపారు. ఇంకా పలు పాపులర్ నవలలు, బెస్ట్ సెల్లర్స్ కూడా బైబిల్ ప్రేరణతోనే వెలువడ్డాయి. ఉదాహరణకు హ్యారీపాటర్ చివరి పుస్తకంలో, కథానాయకుడు లోకకల్యాణం కోసం ఆత్మత్యాగం చేసి పునరుత్థానం పొందుతాడు. జోషస్టర్ సృష్టించిన సూపర్ మ్యాన్ ఏకైక లక్ష్యం దుష్టశిక్షణ- శిష్టరక్షణ. డాన్ బ్రాన్ రాసిన డావిన్సీ కోడ్కు మూలాలు బైబిల్లో ఉన్నాయని ప్రత్యే కంగా చెప్పక్కర్లేదు. మతగ్రంథాలు ఇష్టపడని వాళ్లకోసం, బైబిల్ను బుక్ ఆఫ్ గాడ్ (1996)పేరుతో వాల్టర్ వాంగెరిన్ ఒక నవలగా కూడా ప్రచురించాడు. ప్రస్తుతానికి ఇదో బెస్ట్ సెల్లర్. - ముక్తవరం పార్థసారథి


