breaking news
Window glasses
-
విండోపవర్
మీ ఇంట్లో కిటికీల సంఖ్యను రెట్టింపు చేసుకోండి వీలైతే మీ భవనాలను అద్దాలతో కప్పేసుకోండి ఎందుకంటే.. ఇంకొన్ని ఏళ్లలో ఈ కిటికీలు, అద్దాలే విద్యుదుత్పత్తి కేంద్రాలు కానున్నాయి మరి! సూర్యుడి వెలుతురును అడ్డుకోకుండానే విద్యుత్తును అందించడం వీటి ప్రత్యేకత. అదెలాగంటే...సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (ఎన్టీయూ) సరికొత్త సోలార్ సెల్స్ను ఆవిష్కరించింది. అత్యంత పలుచగా ఉండటమే కాకుండా పెరోవిస్కైట్ అనే పదార్థంతో తయారైన ఈ సోలార్ సెల్స్ను నేరుగా కిటికీలు, అద్దాలపై ఏర్పాటు చేసకోవచ్చు. వెలుతురును కూడా ప్రసారం చేయగల ఈ అర్ధ పారదర్శక సోలార్ సెల్స్ రికార్డు స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి చేయగలవు. ప్రస్తుతం సోలార్ సెల్స్ సిలికాన్తో తయారవుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే సిలికాన్ ఖరీదు చాలా ఎక్కువ. సామర్థ్యం విషయంలోనూ పరిమితులున్నాయి. బిగించుకోవడం, వాడుకోవడంలోనూ ఇబ్బందులున్నాయి. ఈ నేపథ్యంలో చౌక, మరింత సమర్థమైన సోలార్సెల్స్ తయారీకి చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే సుమారు రెండు దశాబ్దాల క్రితం పెరోవిసై్కట్ను ప్రత్యామ్నాయంగా గుర్తించారు. కాకపోతే అప్పట్లో వీటి సామర్థ్యం చాలా తక్కువగా అంటే కాంతి రూపంలో పడే శక్తిలో కేవలం రెండు శాతాన్ని మాత్రమే విద్యుత్తుగా మార్చగలిగేది. తరువాతి కాలంలో జరిగిన పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు ఈ సామర్థ్యం 20 శాతానికి చేరుకోవడం గమనార్హం. వెలుతురు, విద్యుత్తుల బ్యాలెన్స్... ఎన్టీయూ శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన సరికొత్త పెరోవిస్కైట్ సోలార్ సెల్స్ ఎంత మందం ఉంటాయో తెలుసా? కేవలం పది నానోమీటర్లు. అంటే మనిషి వెంట్రుక కంటే పది వేల రెట్లు తక్కువ మందం అన్నమాట. పైగా ఈ సెల్స్పై పడే కాంతిలో 41 శాతం నేరుగా ప్రసారమయ్యేంత పారదర్శకంగా ఉంటాయి. అయితే ఇలా పారదర్శకంగా ఉంచేందుకు దీని విద్యుదుత్పత్తి సామర్థ్యం విషయంలో కొంత రాజీ పడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ సోలార్ సెల్స్ 7.6 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. కాకపోతే చౌక కాబట్టి భవనాలను వీటితో కప్పేసి సిలికాల్ సోలార్ సెల్స్ కంటే ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీన్ని అర్థం చేసుకోవాలంటే చిన్న ఉదాహరణ చూద్దాం.. న్యూయార్క్లో వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనే ఓ భారీ భవనముంది. ఈ ఒక్క భవనాన్ని ఎన్టీయూ శాస్త్రవేత్తలు తయారు చేసిన పెరోవిసై్కట్ సోలార్ సెల్స్ తో కప్పేస్తే వందల మెగా వాట్/గంటల విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంత విద్యుత్తుతో అమెరికాలో 40 వరకూ ఇండ్ల అవసరాలు తీర్చవచ్చునని అంచనా. సవాళ్లూ లేకపోలేదు... పెరోవిసై్కట్ సోలార్ సెల్స్తో ఎన్టీయూ శాస్త్రవేత్తలు సరికొత్త అద్భుతాన్ని సృష్టించినప్పటికీ వీటిని విస్తృత స్థాయిలో వాడే విషయంలో కొన్ని సవాళ్లు మిగిలే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇవి ఎంతకాలం మన్నుతాయి అన్నది. సిలికాన్ సోలార్ సెల్స్ సగటు ఆయుష్షు సుమారు 25 ఏళ్లు. అయితే పెరోవిసై్కట్ పదార్థానికి తడి తగిలితే సరిగ్గా పనిచేయవు. ఆక్సిజన్, వేడి, అతినీలలోహిత కిరణాలను తట్టుకోవడం కష్టం. అందువల్ల వీటి దీర్ఘకాలిక మన్నికపై కొన్ని సందేహాలు ఉన్నాయి. అయితే వాహనాల పైకప్పులపై వీటిని వాడుకోవడం ద్వారా బ్యాటరీలను నిత్యం ఛార్జ్ చేసుకుంటూ ఉండవచ్చు. అలాగే స్మార్ట్ గ్లాసెస్, తొడుక్కునే ఎలక్ట్రానిక్స్ వంటివి పదే పదే ఛార్జ్ చేసుకునే అవసరం తప్పుతుంది. ప్రస్తుతం ఈ సోలార్ సెల్స్పై ఎన్టీయూ పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకుంది. భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు కంపెనీలతో చర్చలూ జరుపుతోంది. అన్నీ సవ్యంగా జరిగితే కొన్నేళ్లలోనే ఇవి మన ఇంటి కిటికీలపైకి చేరవచ్చు. పెరుగుతున్న ప్రాధాన్యం... 2009లో జపనీస్ శాస్త్రవేత్త సుటోము మియాసాకా పెరోవిస్కైట్ను సోలార్ సెల్స్ తయారీకి వాడవచ్చునని గుర్తించారు. అప్పటి నుంచి దీని ప్రాధాన్యం ఏటికేడాదీ పెరుగుతూ వస్తోంది. 2012 – 13 కల్లా పెరోవిసై్కట్ సోలార్ సెల్స్ సామర్థ్యం పది శాతానికి చేరింది. 2015 నాటికి 20 శాతం సామర్థ్యంతో సిలికాన్తో సరి సమానమైంది. మరో ఐదేళ్లకు సిలికాన్ – పెరోవిస్కైట్ సోలార్ సెల్స్ సామర్థ్యం 30 శాతానికి, తాజాగా టాండెమ్ పెరోవిసై్కట్ – సిలికాన్ మాడ్యూల్స్ 35 శాతానికి చేరుకుంది. అమెరికా, జర్మనీ, దక్షిణ కొరియాల్లో ఈ సోలార్ సెల్స్ పైలెట్ స్థాయి ప్రాజెక్టులు నడుపుతూండటం గమనార్హం. –సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉత్తరప్రదేశ్లో ‘వందేభారత్’పై రాళ్ల దాడి!
ఉత్తరప్రదేశ్లో వందేభారత్ రైలుపై అల్లరి మూకలు రాళ్లు రువ్వాయి. ఈ ఘటనతో రైల్వేశాఖలో కలలకం చెలరేగింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. యూపీలోని లక్నో నుంచి ప్రయాగ్రాజ్ వెళ్తున్న వందే భారత్ రైలుపై ఈ రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో ఆ రైలు కిటికీ అద్దాలు పగిలిపోయాయి ఈ సంఘటన శ్రీరాజ్ నగర్- బచ్రావాన్ మధ్య జరిగింది. గేట్ నంబర్ 178 సమీపంలో రైలుపై బయటి నుంచి ఎవరో రాళ్లు విసిరారు. దీంతో రైలులోని సీ-3 కోచ్ కిటికీ అద్దం బద్దలయ్యింది. రైలు టెక్నీషియన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. -
కిటికీ అద్దం...బోలెడంత కరెంటు!
కరెంటు కష్టాలు ఇక దాదాపుగా తీరినట్లే.. ఎందుకంటారా? ఇంకొన్నేళ్లలో ఇంటి కిటికీలకు బిగించిన అద్దాలే సోలార్ ప్యానెల్స్గానూ పనిచేయనున్నాయి కాబట్టి! ఈ రకమైన పారదర్శక ప్యానెళ్లను కొంత కాలంగా తయారు చేస్తున్నా.. వాటి సామర్థ్యం తక్కువ కావడం వల్ల ఇప్పటివరకూ అవి విస్తృత వినియోగంలోకి రాలేదు. అమెరికాకు చెందిన ద నేషనల్ రెన్యుయబుల్ ఎనర్జీ లేబొరేటరీ (ఎన్ఆర్ఈఎల్) తాజాగా ఈ ఇబ్బందిని కూడా అధిగమించింది. ఈ సంస్థ శాస్త్రవేత్తలు తయారు చేసిన పారదర్శక సోలార్ప్యానెళ్లు తనపై పడే సూర్యరశ్మిలో 11 శాతాన్ని విద్యుత్తుగా మార్చడంలో విజయం సాధించాయి. సాధారణ సోలార్ప్యానెళ్ల సామర్థ్యం 15 శాతం వరకూ ఉంటుంది. ఈ స్మార్ట్ సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేసుకుంటే అమెరికా మొత్తమ్మీద వాడే విద్యుత్తులో 80 శాతం అక్కడికక్కడే ఉత్పత్తి చేసుకోవచ్చునని ఈ ప్రాజెక్టులో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్త లాన్స్ వీలర్ తెలిపారు. సాధారణ పరిస్థితుల్లో పారదర్శకంగా ఉండే ఈ ప్యానెల్ ఎండ తాకగానే నలుపు రంగును సంతరించుకుంటుంది. ఫలితంగా భవనం లోపలికి వచ్చే ఎండ తగ్గిపోతుంది. అదే సమయంలో విద్యుదుత్పత్తి ప్రారంభమవుతుంది. పెరోవ్స్కైట్స్ అనే వినూత్న పదార్థం, ఒక పొర కార్బన్నానోట్యూబ్ల వాడకం ద్వారా వీటి ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందని అంచనా. -
సెటైక్ గాడ్జెట్స్
కిటికీ అద్దం... కరెంటు! కిటికీ అద్దాలు వెలుగుతోపాటు కొంచెం కరెంటు కూడా అందిస్తే ఎలా ఉంటుంది? ఫొటోలో కనిపిస్తున్న గాజుముక్క ఈ పనే చేస్తుంది. మిషిగన్ స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అభివద్ధి చేశారు దీన్ని. ఈ రకమైన అద్దాల తయారీకి చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నా పారదర్శకంగా ఉంటూ సౌరశక్తిని గ్రహించేలా చేయగలగడం ఇదే తొలిసారి. మనిషి కంటికి కనిపించని పరారుణ, అతినీలలోహిత కిరణాల్లోని శక్తిని ప్రత్యేక పదార్థాల సాయంతో సేకరించి... గాజు అంచుల్లో ఏర్పాటు చేసే సూక్ష్మస్థాయి సౌరశక్తి ఘటకాలకు సరఫరా చేయడం ద్వారా ఈ అద్దాలు విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ప్రస్తుతం వీటి సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయి. వీటిని విద్యుదుత్పత్తికి మాత్రమే కాకుండా స్మార్ట్ఫోన్ స్క్రీన్లుగానూ ఉపయోగించుకునే అవకాశముందని ఈ పరిశోధనలు చేపట్టిన శాస్త్రవేత్త రిచర్డ్ లంట్ అంటున్నారు. పరికరం చిన్న...ప్రయోజనం మిన్న..! వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఖర్చుతో కూడుకున్నవి, వ్యయప్రయాసలూ ఎక్కువే. కానీ ఫొటోలో కనిపిస్తున్న చిన్న పరికరాన్ని చూశారుగా... రక్త, మూత్రపరీక్షలను చిటికెలో చేసేస్తాయి. మొబైల్ఫోన్ను జత చేస్తే.. ఫలితాలను ఎక్కడికైనా పంపవచ్చు. తగిన సలహా, సూచనలు పొందవచ్చు కూడా. హార్వర్డ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ పరికరాన్ని భారతదేశంలోనే పరీక్షిస్తున్నారు. కేవలం రూ.1500తో తయారు చేయగల ఈ పరికరం ఏ మొబైల్ఫోన్తోనైనా పనిచేస్తుంది. ఏ రకమైన పరీక్ష నిర్వహించాలన్నది సెలెక్ట్ చేసుకునేందుకు, రెండు బటన్లు ఉంటాయి. పరీక్షించాల్సిన పదార్థంలోకి కొసను ముంచి విద్యుత్తు వోల్టేజీ పంపినప్పుడు రసాయన సమ్మేళనాలను గుర్తించి విశ్లేషణ జరుపుతుంది. మధుమేహం, మలేరియా వంటి వ్యాధులతోపాటు వాతావరణ కాలుష్యాలను, నీటి కాలుష్యాన్ని కూడా ఈ పరికరం ద్వారా గుర్తించగలగడం మరో విశేషం. కరవును గుర్తించేందుకు నాసా ఉపగ్రహం... నాలుగు చినుకులు పడగానే దుక్కిదున్నడం... విత్తులేయడం రైతుల పని. కురిసిన వర్షం సరిపోకపోతే పంట చేతికందకపోవడమూ కద్దు. మరి నేల పైభాగంలో ఎంత తేమ ఉందో తెలిస్తే? అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ మరో రెండు నెలల్లో ప్రయోగించే ‘సాయిల్ మాయిశ్చర్ ఆక్టివ్, పాసివ్ (ఎస్మ్యాప్)’ ఉపగ్రహం ఇదే పనిచేయనుంది. భూమికి 365 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ ప్రపంచం మొత్తమ్మీద ఉపరితల తేమను లెక్కకట్టడం దీని లక్ష్యం. ఉపరితలం నుంచి అయిదు సెంటీమీటర్ల లోతువరకూ ఉండే తేమను గుర్తిస్తుంది ఈ ఉపగ్రహం. ఎస్మ్యాప్ ఒకసారికి దాదాపు 50 కిలోమీటర్ల విస్తీర్ణంలోని తేమను లెక్కిస్తుంది. రెండు మూడు రోజులకు భూమి మొత్తం వివరాలు సేకరించగలుగుతుంది. కరవు పరిస్థితులను ముందుగానే తెలుసుకొనేందుకు ఎస్మ్యాప్ ఉపయోగపడుతుందని నాసా శాస్త్రవేత్త నరేంద్ర దాస్ తెలిపారు. కంటి పరీక్షలకు హైటెక్ కెమెరా! బాష్ ఇంజినీరింగ్ కంపెనీ తొలిసారి కంటి పరీక్షలను సులువు చేయగల, చేతిలో ఇమిడిపోయే సరికొత్త హైటెక్ కెమెరాను తయారు చేసింది. ఈ పరికరం తాలూకూ ఆలోచన, ఆచరణ మొత్తం భారత్లోనే పూర్తికావడం విశేషం. అరచేతిలో పట్టుకుని పరీక్షించగలిగేలా ఉండటం ద్వారా ఈ పరికరాన్ని ఎక్కడైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. డయలేషన్ లేకుండా (కళ్ల పరీక్షకు ముందు చుక్కల మందు వేయడాన్ని డయలేషన్ అంటారు) కూడా కళ్లను పరీక్షించగలగడం దీని మరో ప్రత్యేకత. కంటి జబ్బులను గుర్తించేందుకు అత్యాధునిక సాఫ్ట్వేర్ అల్గారిథమ్స్ను ఉపయోగించారు. కంటి ముందు, వెనుకభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను గుర్తించేలా దీని నిర్మాణంలో తగు జాగ్రత్తలు తీసుకున్నారు. కళ్లజోడు దుకాణాలు మొదలుకొని ఆసుపత్రుల వరకూ అందరూ సులువుగా ఉపయోగించవచ్చు.


