breaking news
wild life act
-
కుక్క మెడకు తాడు కట్టి 5 కిలోమీటర్లు..
మాచారెడ్డి: పందుల కాపలా కోసం కొనుగోలు చేసిన కుక్క బైక్పై కూర్చోకపోవడంతో దాని మెడకు వైర్ తాడు కట్టి బైక్ను నడుపుతూ 5 కిలోమీటర్లు లాక్కెళ్లాడు ఓ వ్యక్తి. దీంతో కుక్క మెడకు గాయమైంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి మాచారెడ్డి మండలం పాల్వంచ మర్రి వద్ద వెయ్యి రూపాయలువెచ్చించి కుక్కను కొనుగోలు చేశాడు. అనంతరం దాన్ని బైక్ వెనుక లాక్కెళ్లాడు. గమనించిన పలువురు జంతు ప్రేమికులు ఆ వ్యక్తిని వెంబడించి చివాట్లు పెట్టారు. ఎట్టకేలకు దాన్ని బైక్పై ఎక్కించి కొమురయ్యను హెచ్చరించి పంపించారు. -
ఏం పాపం చేశాం.. మాకు బతకాలని ఉంటుంది.. దగ్గరకు రాకండి ప్లీజ్!
ఆరిలోవ(విశాఖ తూర్పు): పచ్చని అరణ్యాలు పలుచపడుతున్నాయి. కొండలు జనావాసాలుగా రూపాంతరం చెందాయి. దీంతో అరణ్యంలో ఉండాల్సిన వన్య ప్రాణులు జనారణ్యంలోకి ప్రవేశించి ప్రాణాలు కోల్పోతున్నాయి. కొన్ని జంతు జాతులు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. అందుకే వన్యప్రాణుల సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని అటవీ శాఖాధికారులు, జంతు సంరక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 4(శనివారం)న ప్రపంచ వన్య ప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. విశాఖ నగరంలో జనసాంద్రత విపరీతంగా పెరిగింది. భారీగా నివాసాల కొరత ఏర్పంది. స్థలాల ధర చుక్కలను తాకుతోంది. దీంతో పేద జనం అడవులు, కొండలను ఆక్రమించి నివాసాలు ఏర్పరుచుకుంటున్నారు. విశాఖ నగరాన్ని ఆనుకొని ఉన్న కొండలు జనావాసాలతో కిక్కిరిసిపోయాయి. కంబాలకొండ, సీతకొండ, ఎర్రకొండ, ఎండాడ కొండలు, అమనాం ప్రాంతాల్లో దట్టమైన రిజర్వ్డు ఫారెస్టుకు చెందిన కొండలున్నాయి. వీటిలో కంబాల కొండలో 17,600 ఎకరాలు, సీతకొండలో 800, ఎర్రకొండలో 800, అమనాం ప్రాంతంలో 920 ఎకరాల విస్తార్ణంలో అడువులుండేవి. కొన్నేళ్లుగా ఆ అడవులు ఆక్రమణకు గురై విస్తీర్ణం తరిగిపోయింది. ఒకప్పుడు సుమారు 1,000 ఎకరాల్లో రుషికొండ ప్రాంతంలో కొండలుండేవి. వీటిలో ప్రస్తుతం పలు ఐటీ కంపెనీలు, ఫిల్మ్సిటీ వెలిశాయి. దీంతో అక్కడ అటవీ ప్రాంతమంతా కనుమరుగైంది. ఈ కొండలన్నింటిలోను సుమారు 8 చిరుతలు సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు అప్పట్లో గుర్తించారు. ఎండాడ కొండల్లో నాలుగు చిరుతలు సంచరించేవని, ఇక్కడ నిర్మాణాలు జరగడంతో వాటి జాడ కనిపించలేదు. చిరుతలకు ఆహారమైన జింకలు, కనుజులు, నక్కల సంఖ్య కూడా తగ్గతుందని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. దీంతో ఆహారం కోసం చిరుతలు జనారణ్యంలోకి చొరబడుతున్న సందర్భాలు ఉన్నాయి. చిరుతలు అడవుల్లో సుమారు 25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సంచరిస్తాయి. సీతకొండ, ఎర్రకొండ, అమనాం ప్రాంతాలు తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. దీంతో రాత్రివేల ఆహారం కోసం చిరుతలు తిరుగుతూ అడవులు సమీపంలోని నివాసాలలోకి చొరబడుతున్నాయి. గతంలో అమనాం, ఎంవీపీ కాలనీ, గోపాలపట్నం, అక్కయ్యపాలెం, మధురవాడ ప్రాంతాల్లో చిరుతలు ఆహారం కోసం జనారణ్యంలోకి వచ్చి ఇళ్లలోకి చొరబడిన సంఘటనలు తెలిసిందే. 2013 నుంచి వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం వన్యప్రాణులను సంరక్షించాలనే ఆలోచనతో ప్రపంచ వ్యాప్తంగా సీఐటీఈఎస్ అనే సంస్థ 2013 నుంచి వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం నిర్వహిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోను అటవీశాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి వన్యప్రాణులపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. జంతువుల ఆవాసాలను రక్షించడం, వన్యప్రాణులను వేటాడం చేయకుండా చూడడం ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకొంది. ఇందిరాగాంధీ జూలో వరుసగా రెండేళ్లు ఎలాంటి కార్యక్రమాలు చేయలేకపోయింది. 2020లో కరోనా కారణంగా నిర్వహించలేకపోయింది. ప్రస్తుతం తుపాన్ కారణంగా జూలో అధికారులు వన్యప్రాణులపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయలేకపోయారు. విశాఖ జూలో వన్యప్రాణులు నగరంలో 625 ఎకరాల అటవీ విస్తీ్తర్ణంలో ఉన్న ఇందిరాగాంధీ జూ పార్కులో అనేక రకాల వన్యప్రాణులున్నాయి. ఇక్కడ వివిధ రకాలకు చెందిన సుమారు 830 వన్యప్రాణులు కనువిందు చేస్తున్నాయి. రామచిలుకలు, ఆఫ్రికన్ చిలుకలు, మైనాలు, ఆస్ట్రిచ్లు, ఈమూలు, రంగురంగుల పిట్టలతో పాటు పులులు, సింహాలు, ఏనుగులు, నీటి ఏనుగులు, ఖడ్గమృగం, జిరాఫీలు, జీబ్రాలు, చింపాంజీలు, కనుజులు, జింకలు, కొండగొర్రెలు, అడవి కుక్కలు, హైనాలు తదితర వన్యప్రాణులను ఇక్కడ సంరక్షిస్తున్నారు. వన్యప్రాణుల రక్షణ అందరి బాధ్యత వన్యప్రాణులను రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. జూకి వచ్చిన సందర్శకులు సరదాగా వినోదం కోసం మాత్రమే వన్యప్రాణులను చూడాలనుకోకూడదు. వాటి జీవన విధానం, పర్యావరణంలో వాటి ఆవశ్యకత గరించి తెలుసుకోవాలి. ప్రతి ఏడాది జూలో వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం నిర్వహిస్తుంటాం. అయితే ఈ ఏడాది తుపాను కారణంగా జూకి సెలవు ప్రకటించడంతో జరుపుకోలేకపోతున్నాం. అందరూ వన్యప్రాణులను సంరక్షించడానికి కృషి చేయాలి. వాటిపై ప్రేమ చూపాలి. వాటి ఆవాసాలలోకి చొరబడకుండా ఉండాలి. ప్రస్తుం మన దేశంలో చీతాలు అంతరించిపోయాయి. మిగిలిన జంతు జాతి అంతరించిపోకుంగా చూడాలి. –నందని సలారియా, జూ క్యూరేటర్. -
పులిది కాదు.. ఆవుది..!
పులి చర్మం పట్టుబడిందంటూ ఇటు పోలీసులు, అటు అటవీశాఖాదికారులు నానా హంగామా చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ చర్మాన్ని అటవీశాఖాధికారులకు అప్పగించారు. వారు కూడా వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆ తరువాత, ఈ చర్మం పులిదో కాదోనన్న అనుమానం రావడంతో దానిని హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ కు పంపించారు. అక్కడి అధికారులు పరిశీలించి, ‘ఇది పులి చర్మం కాదు. ఆవు చర్మం’ అని తేల్చారు. దానిని తిరిగి ఇక్కడి అటవీశాఖాధికారులకు పంపారు. తమ తొందరపాటుకు ఇటు పోలీసు, అటు అటవీశాఖాధికారులు నాలుక కరుచుకుంటున్నారు. ఈ నెల 11న చర్లలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు.. ఓ ద్విచక్ర వాహన చోదకుడిని అనుమానంతో అదుపులోనికి తీసుకుని విచారించారు. గన్నవరంలోని ఓ వ్యక్తి ఇంట్లో పులి చర్మం ఉందని అతని ద్వారా తెలుసుకున్నారు. వెంటనే ఎస్సై పి.సంతోష్ తన సిబ్బందితో ఆ గ్రామానికి వెళ్లారు. అక్కడ ఓ ఇంటి నుంచి, చర్మాన్ని స్వాధీనపర్చుకున్నారు. పైకి చూడ్డానికి పులి చర్మంలా ఉంది. దీనికి సంబంధించిన తొమ్మిదిమందిని అదుపులోకి తీసుకున్నారు. ‘ఇంకెక్కడైనా పులి చర్మాలు, పులి గోళ్లు దాచి ఉంచారా..?’ అంటూ తమదైన శైలిలో ప్రశ్నించారు. వీరి నుంచి ఎటువంటి సమాధానం లేకపోవడంతో కేసు నమోదు చేశారు. అటవీశాఖాధికారులను పిలిపించి వారికి ఆ చర్మాన్ని అప్పగించారు. వారు దానిని తీసుకుని, ఆ తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ తరువాత, ‘ఈ చర్మం పులిదేనా..?!’ అనే అనుమానం రావడంతో, దానిని హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్కు పంపారు. అక్కడి అధికారులు దానిని పరిశీలించి, ‘ఇది పులిది కాదు.. ఆవు చర్మం’ అని ధ్రువీకరిస్తూ వెనక్కి పంపించారు. దీంతో.. పులి చర్మం పట్టుబడిందంటూ నానా హంగామా చేసిన పోలీసులు, అటవీశాఖాదికారులు నాలుక కరుచుకున్నారు. ఆవు చర్మాన్ని పులి చర్మంగా తయారుచేసి అమ్మేందుకు సిద్ధమయ్యారంటూ ఆ తొమ్మిదిమందిపై చీటింగ్ కేసు పెట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.