breaking news
water tanks Cleaning
-
Cow Urine: గోమూత్రంతో నీళ్ల ట్యాంక్ శుభ్రం!
బెంగళూరు: దేశంలో కుల, మత, వర్గ వైషమ్యాలకు.. రాజకీయాలే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఫలితం.. విద్వేషాన్ని ఎక్కించుకుని మూర్ఖంగా వ్యవహరించే స్థితికి ప్రజలు చేరుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలో విస్తుపోయే ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ దళిత మహిళ నీరు తాగిందనే కోపంతో.. నీటి ట్యాంకర్ను శుభ్రం చేశారు గ్రామస్తులు. అదీ గోమూత్రంతో కావడం గమనార్హం. ఛామరాజనగర్ జిల్లా హోగ్గోటరా గ్రామంలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. నవంబర్ 18వ తేదీన గ్రామంలో ఓ వివాహ వేడుక జరిగింది. అయితే.. ఆ వేడుకకు హాజరైన ఓ మహిళ.. తిన్న తర్వాత దాహం తీర్చుకునేందుకు అక్కడే ఉన్న ఓ ట్యాంకర్ నల్లా ద్వారా నీరు తాగింది. ఇది గమనించిన కొందరు పెద్దలు.. సదరు మహిళ ఎస్సీకి చెందింది కావడంతో రచ్చ చేశారు. వేడుకలో తాగేందుకు ఎవరూ అంగీకరించలేదని.. అందుకే దాహం తీర్చుకునేందుకు ట్యాంక్ నీళ్లు తాగానని ఆమె చెప్పింది. అయితే ఆ పెద్దలు ఆమెను మందలించి.. ట్యాంకర్ నుంచి నీటిని ఖాళీ చేయించారు. ఆపై కొందరి సలహాతో ‘పవిత్ర’మైన గోమూత్రంతో ట్యాంకర్ను శుభ్రం చేయించారట. ఈ ఘటన స్థానిక తహసీల్దార్ దృష్టికి వెళ్లగా.. ట్యాంకర్ శుభ్రం చేసిన మాట వాస్తవమేనని, అయితే అది గోమూత్రంతో అవునా? కాదా? అనే విషయంపై స్పష్టత లేదని మీడియాకు తెలిపారు. ఇక బాధితురాలి గురించి తమ దగ్గర సమాచారం లేదన్న ఆయన.. ఆమె గురించి తెలిస్తే విచారించి, కేసు నమోదు చేస్తామని అన్నారు. అంతేకాదు గ్రామంలో చాలా వాటర్ ట్యాంకర్లు ఉన్నాయని, అందులో నీరు ఎవరైనా తాగొచ్చని ఆయన చెప్తున్నారు. ఈ ఘటన మీద జిల్లా కలెక్టర్ నివేదిక కోరడంతో.. పూర్తి స్థాయి నివేదికకు సిద్ధమైనట్లు సదరు తహసీల్దార్ వెల్లడించారు. -
నీటి పరీక్షలు.. నిర్వహిస్తే ఒట్టు
డిచ్పల్లి, న్యూస్లైన్ : వ్యాధుల బారిన పడి పల్లెలు తల్లడిల్లుతున్నా నీటి పరీక్షల జాడ కరువైంది. క్లోరినేషన్ చేసిన నీటిని ప్రజలకు తాగునీరుగా అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పట్టింది. గ్రామాల్లో రక్షిత నీటి నిర్ధారణ పరీ క్షల కోసం రెండేళ్ల కిందట పంపిణీ చేసిన కిట్లు పంచాయతీ కార్యాలయాల్లోని స్టోర్ రూముల్లో మూలుగుతున్నాయి. పల్లె ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలన్న సంకల్పంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కిట్లను పంపిణీ చేశారు. అయితే పంచాయతీ అధికారులు, వైద్య సిబ్బంది తాగునీటి పరీక్షలను విస్మరించా రు. జిల్లావ్యాప్తంగా ఏ ఒక్క గ్రామ పంచాయతీలో కూడా తాగునీటి పరీక్షలు జరిపిన దాఖలాలు లేవంటే అతిశయోక్తి కాదు. నీటి పరీక్షల నిర్వహణ కోసం గతం లో మండల స్థాయిలో పంచాయతీ సిబ్బందికి నామ్కే వాస్తేగా శిక్షణ తరగతులను నిర్వహించారు. ఒకటి రెండు రోజులు పంచాయతీ సిబ్బందికి నీటి పరీక్షలపై అవగాహన కల్పించి వేలాది రూపాయల విలువ చేసే కిట్లు, సామగ్రిని అందజేసి చేతులు దులుపుకున్నారు. గ్రామ పంచాయతీల్లో రక్షిత మంచినీటి ట్యాంకుల శుభ్రం, క్లోరినేషన్ పనుల నిర్వహణను వాటర్మెన్లు చూస్తుంటారు. వారికి నీటి పరీక్షలపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రభుత్వం ద్వారా వచ్చిన పరీక్షల కిట్లను పట్టించుకోలేదు. దీంతో కిట్లు పంచాయతీ కా ర్యాలయాల్లో వృథాగా పడి ఉన్నాయి. సిబ్బంది చేపట్టి న క్లోరినేషన్ పనులను పంచాయతీల కార్యదర్శులు, కారోబార్లు, స్థానిక వైద్య సిబ్బంది నీటి పరీక్షలను ని ర్వహించాలి. గ్రామాల్లో తాగునీటి సరఫరా పనుల నిర్వహణ వాటర్మెన్లపై వదిలేయడంతో వారు పట్టించుకోవడం మానేశారు. గ్రామంలోని రక్షిత ట్యాంకు శుభ్రత, బ్లీచింగ్ పౌడర్ వాడకం క్లోరినేషన్ మోతాదును కిట్ల ద్వారా గుర్తించి, స్థానిక పంచాయతీ రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే గ్రా మ పంచాయతీల్లో నీటి నిర్ధారణ పరీక్షల జాడ కరువైం ది. ఆర్డబ్ల్యూస్ శాఖ వారు పంపిణీ చేసిన కిట్లు కొన్ని పంచాయతీల్లో స్టోర్రూమ్ల్లో మూలుగుతుండగా.. మిగతా పంచాయతీల్లో వాటి ఆచూకీ కన్పించని దుస్థితి ఉంది. వారోత్సవాలకే పరిమితం.. ప్రభుత్వం ఏటా పారిశుద్ధ వారోత్సవాలను నిర్వహిస్తోంది. అధికారులు ఆ సమయంలో చూపిన శ్రద్ధ, త ర్వాత కాలంలో తాగునీటి సరఫరాపై చూపడం లేదని విమర్శలు విన్పిస్తున్నాయి. గ్రామాల్లో తాగునీటి ట్యాం కుల క్లోరినేషన్ పనులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో రక్షిత మం చి నీటి ట్యాంకులను శుభ్రపర్చడానికి, నీటి క్లోరినేషన్కు ఉపయోగపడే బ్లీచింగ్ పౌడర్ సైతం మైనర్ గ్రా మపంచాయతీల్లో అందుబాటులో ఉండడం లేదు. కొ న్ని గ్రామాల్లో పైపులైన్ల లీకేజీల వల్ల రక్షిత మంచినీరు కలుషితమవుతోంది. ట్యాంకు నుంచి నీటిని వదిలి మొదటి కుళాయి, మధ్యభాగం, చివరి కుళాయి నీటిని పట్టుకొని పంచాయతీ సిబ్బంది పరీక్షలను చేపట్టాలి. కాని పంచాయతీల్లో నీటి పరీక్షల మాటే మరిచారు. నీటిలోని క్రి మి కీటకాలు ప్రజలకు హాని కల్గిస్తున్నాయి. పల్లె ప్రజలు వ్యాధుల బారిన పడి మంచాన పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పంచాయతీల్లో నీటి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పల్లె ప్రజలు కోరుతున్నారు.