పాకిస్థాన్ టూ ఆంధ్రా నోటు.. చేటు
నకిలీ నోట్ల చెలామణిలో ఐఎస్ఐ పాత్ర
కర్నూలు: రాష్ట్రంలో నకిలీ నోట్ల చెలామణి వెనుక పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ నుంచి పశ్చిమబెంగాల్, జార్ఖండ్ మీదుగా ఆంధ్రప్రదేశ్కు నకిలీ నోట్లు చేరుతున్నాయనే విషయం ఇప్పటికే పోలీసుల విచారణలో వెల్లడైంది. నకిలీ నోట్ల రవాణా మొత్తం రైలు మార్గంలోనే సాగుతున్నట్లు గుర్తించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ కేంద్రం కావడం ఆందోళన కలిగిస్తోంది.
కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా సూగూరు గ్రామానికి చెందిన ఇందవాసి వీరేష్ దొంగనోట్ల రవాణా చేస్తూ మంగళవారం రాత్రి పోలీసులకు చిక్కడంతో ఆసక్తికర విషయాలో వెలుగులోకి వస్తున్నాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఖలేచౌక్ గ్రామంలో సుల్తాన్ అనే వ్యక్తి ద్వారా రూ.3 లక్షల దొంగనోట్లను మహబూబ్ నగర్కు రవాణా చేస్తుండగా జిల్లా పోలీసులు ఇతన్ని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లు కూడా పాకిస్థాన్ నుంచే వచ్చినవలేనని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నకిలీ వ్యవహారంలో ఒక్కో లావాదేవీకి ఒక్కో బ్యాంకు అకౌంట్, ఫోన్ నెంబర్ వినియోగిస్తుండటం గమనార్హం.
రూపాయికి రెండు రూపాయలు
నకిలీ నోట్ల కుంభకోణంలో సరికొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. రూ.50 వేల ఒరిజినల్ నోట్లు ఇస్తే... లక్ష రూపాయల నకిలీ నోట్లు ఇస్తున్నారు. ఈ వ్యవహారమంతా పకడ్బందీగా బ్యాంకుల ద్వారానే జరుగుతోంది. అయితే ఒకసారి ఇచ్చే బ్యాంకు అకౌంట్ను మరోసారి ఇవ్వకపోవడం ఒక ఎత్తయితే... ఒకసారి ఇచ్చిన బ్యాంకు అకౌంట్ తర్వాత పనిచేయడం లేదని విచారణలో తేలింది. అంటే ప్రతి లావాదేవీకి సరికొత్త బ్యాంకు అకౌంటన్న మాట. ఫోన్ నెంబర్లు కూడా ఒక లావాదేవీకి ఒక్కోటి వినియోగిస్తుండటం గమనార్హం.
ఆర్థిక మూలాలే లక్షంగా...
హైదరాబాద్ కేంద్రంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఇప్పటి వరకు భౌతిక దాడులకు దిగడం తెలిసిందే. లుంబిని పార్కు, గోకుల్ఛాట్ ఘటనలు ఈ కోవకు చెందినవే. అయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా ఐఎస్ఐ దృష్టి సారించినట్లు నకిలీ నోట్లను రవాణా చేస్తూ పట్టుబడిన వారి ద్వారా సమాచారం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ మీదుగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వరకూ రైళ్ల ద్వారా ఈ నకిలీ నోట్ల రవాణాదారులు ప్రవేశిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది.
నకిలీ నోట్ల ప్రధాన సూత్రధారి అజ్ఞాతంలో ఉండి గుమస్తాల ద్వారా పశ్చిమ బెంగాల్ మీదుగా ట్రైన్లో విశాఖపట్నంకు చేర్చి అక్కడి నుంచి దళారులకు నకిలీ నోట్లు చేరవేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. సుల్తాన్ అనే ప్రధాన ఏజెంట్ ద్వారా ఈ దందా కొనసాగుతుంది. కర్నూలు, గుంతకల్లు, పెబ్బేరు కేంద్రాలుగా నకిలీ నోట్ల చెలామణి ముమ్మరమైంది. రెండు వారాల క్రితం గుంతకల్లులో భారీ మొత్తంలో నకిలీ నోట్లు రవాణా చేస్తూ కొందరు వ్యక్తులు పోలీసుల వలకు చిక్కారు. గతంలో బనగానపల్లె, ఇటీవల ఉరవకొండలోనూ నకిలీ నోట్ల చెలామణిదారులు పట్టుబడ్డారు. ధాన్యం కొనుగోలు చేసి క్రయ విక్రయాలు చేసే వ్యాపారులే లక్ష్యంగా నకిలీ నోట్ల చలామణి సాగుతోంది.