breaking news
Restitution of Kanjugal rights
-
అత్తారింటికి దారి ఇదే
ఏలుకో. మర్యాదగా ఏలుకో... లేదా జైలుకి పో! ఒకవేళ భార్యను వదిలి పారిపోయినా... భార్యను పుట్టింట్లో దించి జారుకున్నా... సార్కి కోర్టు మంచి మొట్టికాయలు వేస్తుంది. ఆడపిల్లకు అత్తారింటికి దారి చూపిస్తుంది! అంటే... ఇన్-లాస్ దగ్గరికి తీసుకెళ్లే ‘లా’ ఇది! శభాష్... ఐ లవ్ దిస్ లా!! ‘‘పాప... బంగారు బొమ్మలా ఉంది’’. ‘‘అబ్బో సొట్ట బుగ్గలు.. అచ్చం నాన్న పోలికే’’. ‘‘పండులా ఉందిరా.. పండు అని పిలుచుకోండి ముద్దుగా’’. ‘‘ఏం పేరు సెలెక్ట్ చేసుకున్నారు... ఆడపిల్ల అంటే లక్ష్మి... లక్ష్మీదేవి పేరేదైనా పెట్టండి... బాగుంటుంది’’. ‘‘ఏం కాదు.. అమ్మాయంటే శక్తి... పార్వతీదేవి పేరేదైనా సెలెక్ట్ చేద్దాం’’. మైథిలి ఒళ్లో హాయిగా నిద్రపోతున్న 21 రోజుల పసిపాప గురించే ఆ చర్చ! ఆ పాపాయికి వరుసకు అత్తలు, పిన్నులు, అమ్మమ్మలు, నాన్నమ్మలు అయ్యే వాళ్ల మాటలు అవన్నీ! చెవులతో వింటూ మర్యాదకు నవ్వుతున్నా మైథిలి మెదడు తన భర్త గురించే ఆలోచిస్తోంది. ఆమె కళ్లు అతడి కోసమే వెదుకుతున్నాయి. ఏడో నెలలో తీసుకొచ్చి అమ్మవాళ్లింట్లో దింపాడు. అడపాదడపా ఫోన్కాల్స్ తప్ప పెద్దగా మనసు విప్పి మాట్లాడింది లేదు ఈ రెండున్నర నెలల్లో. ఒకట్రెండు సార్లు ఏదో పనిమీద వచ్చినప్పుడు మాత్రమే తనను చూసి వెళ్లాడు తప్ప ప్రత్యేకించి తనకోసం వచ్చిందీ లేదు, తను కడుపుతో ఉన్నప్పుడు పుట్టబోయే బిడ్డ గురించి పంచుకున్న కలలూ లేవు, పెట్టుకున్న ముచ్చట్లూ లేవు! ఈ ఆలోచనలతో గతంలోకి వెళ్లిపోయింది మైథిలి! బిడ్డ పుట్టక ముందే... బెదిరింపు! ఉమ్మడి కుటుంబం. అత్తా, మామ, బావగారు, తోడికోడలు, వాళ్ల ఇద్దరు పిల్లలు, పెళ్లి కావలసిన మరిది, ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వచ్చిపోయే ఆడబిడ్డ. వీళ్లందరితో కళకళలాడుతూ కనిపించింది ఆ ఇల్లు కొత్త పెళ్లికూతురిగా ఆ గుమ్మంలోకి అడుగుపెట్టిన మైథిలికి. పనులతోపాటు స్నేహాన్నీ పంచుకోవచ్చునుకుంది తోడికోడలుతో. ఆడబిడ్డ తనకూ అక్కయ్య అవుతుందని ఆశపడింది. మరిది తమ్ముడు లేని లోటు తీరుస్తాడని, అత్తామామల పెద్ద దిక్కు నీడలో నిశ్చింతగా ఉండొచ్చు అని ఊహించుకుంది. అయితే ఆర్నెల్లకు అత్తారింటి స్వభావం పూర్తిగా అర్థమైంది. తాను ఊహించుకుంది తలకిందులైంది. భర్త... తన మాట తప్ప అందరి మాటా వింటాడు. తనకు తప్ప అందరికీ విలువిస్తాడు. పడకగదిలో తప్ప తన గురించి ఆలోచించడు. అప్పుడు కూడా... ఆ ఇంట్లో తనకు జరుగుతున్న అవమానాల గురించి చెప్పినా పట్టించుకోడు. అమ్మ, వదిన, అక్క మాటలకు ఎదురు చెప్పొద్దు అనేవాడు. భర్త దగ్గర ప్రైవసీ కోరుకోవడం కూడా తప్పే ఆ ఇంట్లో. అదీ తన విషయంలో మాత్రమే. ఎందుకో అర్థం కాలేదు. ఈలోపే నెల తప్పింది. విషయం తెలిసిన వెంటనే తన భర్త... ముందుగా వాళ్ల అమ్మానాన్న, అక్క, వదిన మొహంలోకి చూశాడు. వాళ్లు సంతోషంగా కనపడ్డాకే తాను తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అదీ వాళ్లతోపాటుగానే. వాళ్లందరి సమక్షంలోనే! కొడుకే పుట్టాలని తనతో ఏవేవో పూజలు చేయించారు. మరి ఆడపిల్ల పుడితే? ఉక్రోషంతో భర్తను అడిగింది ఒకసారి మైథిలి. ‘‘శాశ్వతంగా మీ అమ్మవాళ్లింట్లోనే ఉంటావ్’’ అనేసి వెళ్లిపోయాడు! కంగు తిన్నది మైథిలి. పొగిలి పొగిలి ఏడ్చింది. ‘‘ఏయ్ పిల్లా.. కళ్లనీళ్లేంటి? నీ కూతురును పొగుడుతుంటే మురిసిపోయి వచ్చిన కన్నీళ్లా...’’ వదిన ఆడుతున్న పరాచకానికి చప్పున ఈ లోకంలోకి వచ్చింది మైథిలి. బిడ్డ పుట్టాక... రాకుండా సాధింపు! మైథిలి తల్లీతండ్రీ, అన్నావదినా.. ఇంటిల్లిపాదీ వెళ్లి మైథిలి అత్తారింటివారిని ఆహ్వానించినా ఉయ్యాల వేడుకకు ఎవ్వరూ రాలేదు. అర్ధరాత్రి వరకూ ఎదురుచూస్తూనే ఉంది మైథిలి. ‘‘నా పిచ్చిగానీ... డెలివరీ అవగానే మహాలక్ష్మి పుట్టిందండీ’’ అంటూ మామయ్య, అత్తయ్యవాళ్లకు నాన్న సంతోషంగా ఫోన్ చేస్తే ‘అవునా’ అని కూడా అనని వాళ్లు, అమ్మాయి పుడితే అక్కడే ఉండాలని అల్టిమేటం ఇచ్చిన భర్త.. కనీసం పుట్టిన పసిగుడ్డును చూడాలనే ఆరాటమైనా లేని భర్త.. ఉయ్యాల ఫంక్షన్కు వస్తారని ఎలా అనుకుంది? అత్తారింట్లో పరిస్థితి గురించి అమ్మకు చెపితే... ‘ఓ బిడ్డ పుట్టనీవే అన్నీ సర్దుకుంటాయి.. పుట్టే పిల్ల కేరింతలు అందరినీ మార్చేస్తాయి చూడూ’’ అంటూ ఆశపెట్టింది. హు.. నమ్మడానికి తనకుండొద్దూ.. ఆశకైనా హద్దుండొద్దూ.. అంటూ నిరాశతో తన మీద తనే నిష్ఠూరమాడుకుంది. బాధపడింది. పాప ఆలనాపాలనతో మూడు నెలలు గడిచాయి. మూడో నెల దాటకుండానే సారెతో అత్తారింటికి పంపించాలి. ఎన్నిసార్లు కబురుచేసినా వాళ్ల దగ్గర్నుంచి సమాధానం లేదు. వెళ్లి ఆహ్వానించినా స్పందన లేదు! బెదిరింపులకు, సాధింపులకు... ముగింపు ‘‘ఏం చేద్దామనుకుంటున్నావ్?’’ మైథిలిని అడిగాడు వాళ్లన్నయ్య. ‘‘తెలీట్లేదన్నయ్యా’’ అంటూ బోరుమంది మైథిలీ. వెంటనే తేరుకొని.. ‘‘అయన మరీ చెడ్డవాడు కాదు... వాళ్ల అమ్మానాన్న, అన్నావదిన, అక్కాబావల మాట వింటాడు అదొక్కటే తప్ప ఇంకే ఇబ్బందీ లేదన్నయ్యా...’’ అంది. ‘‘మరి అదే ఇంటికి మళ్లీ వెళతానంటావా?’’ అన్నాడు. ‘‘పాప ఉంది కదా.. అన్నయ్యా.. దాని ఆటపాటలు చూసైనా మారుతాడేమో.. ఒక్క ప్రయత్నం చేస్తా’’ అంది. మరునాడే.. మైథిలిని తీసుకొని లాయర్ దగ్గరకు వెళ్లాడు మైథిలి అన్నయ్య. విషయం, మైథిలి ఆశా అర్థమైన లాయర్.. ‘రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్’ పిటిషన్ వేయమని సలహా ఇచ్చారు. మైథిలి పిటిషన్ వేసింది. రెండు నెలల్లో మైథిలి బిడ్డతో సహా అత్తారింటికి వెళ్లింది! - సరస్వతి రమ రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ అంటే? - ఇ. పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 9 వైవాహిక లేదా దాంపత్య హక్కుల పునరుద్ధరణకు సంబంధించినది. సరైన కారణం చూపకుండా భర్త భార్యను గాని, భార్య భర్తను గాని వదిలేసి కాపురానికి తీసుకెళ్లకుండా లేదా కాపురానికి వెళ్లకుండా ఉంటే... బాధితురాలు లేదా బాధితుడు కోర్టుద్వారా కాపురపు హక్కు డిక్రీని పొందవచ్చు. మైథిలి విషయంలో ఆమె భర్త బలమైన ఏ కారణం లేకుండానే ఆమెను తల్లిగారింట్లో వదిలేశాడు. మైథిలి వేసుకున్న పిటిషన్ ఆధారంగా కోర్టువారు ఆమె భర్తను పిలిపించి ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. ‘‘కుటుంబ సభ్యులను గౌరవించడమంటే భార్యను అగౌరవపరచడం కాదుకదా. ఆడపిల్ల పుట్టిందని, అమ్మ చెప్పిందని భార్యను కాపురానికి తీసుకెళ్లకపోవడమేంటి?’’ అని మైథిలి భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వేరు కాపురం పెట్టయినా సరే మైథిలిని తీసుకెళ్లాలని ఆదేశించారు. ఈ సెక్షన్ స్త్రీలకు ఒక వెసులుబాటునూ ఇస్తోంది. ఒకవేళ కోర్టు ఆదేశాలను భర్త ధిక్కరిస్తే... అంటే డిక్రీ మంజూరైన తర్వాత కూడా యేడాది వరకూ భార్యను కాపురానికి తీసుకెళ్లకపోతే ఆ భార్యకు నష్టపరిహారం తీసుకునే హక్కును, భర్త ప్రాపర్టీ అటాచ్మెంట్ను కోరే వీలునూ కల్పిస్తోంది ఈ సెక్షన్. -
మ్యారేజ్ కౌన్సెలింగ్
కలిసి ఉండలేక విడిపోవాలనుకునే దంపతులు కొందరు. విడిగా ఉండాల్సి వచ్చి కలిసిపోవాలని తపించే దంపతులు కొందరు. విడిపోడానికి కోర్టులు ఉన్నాయి. చట్టాలున్నాయి. కలిసిపోడానికి ఈ కోర్టులతో, చట్టాలతో అవసరం లేదు కానీ... దంపతులలో ఏ ఒక్కరు విముఖంగా ఉన్నా... రెండోవారు దాంపత్య జీవితం కోసం కోర్టును ఆశ్రయించవచ్చు. ‘రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్’తో ఒకటవచ్చు. కేస్ స్టడీ సహజీవనంలోనూ హక్కులు వర్తిస్తాయి విజయ, వేణుగోపాల్ 15 ఏళ్ల నుండీ కలసి జీవిస్తున్నారు. సంతానం కూడా కలిగింది. వారికి వివాహ వ్యవస్థ పట్ల, సంప్రదాయం పట్ల నమ్మకం లేదు. అందువల్ల వివాహం చేసుకోకుండా సహజీవనం సాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు కూడా వారిని భార్యాభర్తల్లానే అంగీకరించారు. కానీ పాప పుట్టాక, అదీ ఆమెకు ఐదేళ్లు నిండినప్పటినుండీ వేణుగోపాల్ ప్రవర్తనల్లో చాలా మార్పు వచ్చింది. భార్యను తీవ్రంగా వేధించడం ప్రారంభించాడు. మాటలతో, చేతలతో మనోవేదనకు గురిచేయడం ప్రారంభిం చాడు. కట్టుకున్న భార్యలా విజయ తనపై అధికారం చలాయిస్తోందని, విజయ పెత్తనం తనపై చెల్లదని, కనీసం ఇంటి అవసరాలకు, పాప పోషణకూ కూడా డబ్బులివ్వకుండా సతాయించడం మొదలుపెట్టాడు. దీనికి తోడు తాను మరలా వివాహం చేసుకుంటారనీ తమది చట్టబద్ధమైన వివాహం కాదనీ విజయను తీవ్రంగా హింసించడం ప్రారంభించాడు. విజయ, వేణుగోపాల్ మాటలకు తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. నిజంగా తమది భార్యాభర్తల సంబంధం కాదా? తనకూ పాపకూ చట్టపరంగా ఏ రక్షణలూ, హక్కులూ లభించవా అని ఆవేదనకు లోనైంది. ఈ విషయాన్ని గురించి న్యాయవాదిని సంప్రదించింది. ఇరువురు యువతీ యువకులు చాలాకాలం కలసి జీవిస్తే వారు చట్టప్రకారం భార్యాభర్తల్లానే పరిగణింపబడతారనీ, స్త్రీ భాగస్వామికి చట్టబద్ధమైన రక్షణలూ, హక్కులూ లభిస్తాయనీ, హింస నుండి ఎదుర్కొనే హక్కూ, ఆస్తికి సంబంధించిన అన్ని హక్కులూ, వారి సంతానానికి చట్టబద్ధత అన్నీ లభిస్తాయని తెలుసుకుంది. వేణుగోపాల్పై న్యాయ పోరాటానికి సిద్ధమైంది. సెక్షన్ 2 (ఎఫ్) డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్ 2005 కూడా సహజీవనాన్ని వివాహబంధంగా గుర్తించిందనీ తెలుసుకొని ఊపిరి పీల్చుకుంది. సహజీవనంలో ఉండే భాగస్వాములకు అదివరకే వివాహమై ఉండరాదు. అంటే ఇరువురూ అవివాహితులై ఉండాలి. ఒకవేళ వివాహమై ఉంటే, భర్త నుండి గానీ, భార్య నుండి గానీ విడాకులైనా తీసుకొని ఉండాలి. లేకుంటే భార్య కానీ, భర్త కానీ జీవించి ఉండకూడదు. ఇరువురూ మేజర్లై ఉండాలి అని సుప్రీంకోర్టువారు తెలిపి ఉన్నారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసింది ఏమిటంటే, సహజీవనమంటే అక్రమ సంబంధం కాదు. ప్రశ్న - జవాబు మా పెళ్లి అయి 20 ఏళ్లయింది. ఇద్దరు పిల్లలు విజయవాడలో ఇంజనీరింగ్ కోర్స్ చేస్తున్నారు. మావారు హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. పిల్లలను హాస్టల్లో ఉంచి చదివించే స్తోమత లేక, విజయవాడలో చిన్న పోర్షన్ అద్దెకు తీసుకొని, పిల్లలను చదివిస్తున్నాను. నేను కూడా చిన్న ఉద్యోగం చేసుకుంటూ, ఇంటి అద్దెకు, పిల్లల అవసరాలకు సరిపడా ఆర్జిస్తున్నాను. భర్తకు దూరంగా ఉండటం కొంచెం కష్టమైనా, పిల్లల భవిష్యత్తు కోసం, వారి ఉన్నతి కోసం పిల్లలతోనే ఉంటున్నాను. వారానికి, పదిహేను రోజులకు మేమంతా కలుసుకొంటున్నాము. హైదరాబాద్ నుండి విజయవాడకు నా భర్త వీకెండ్స్లో వస్తూ పోతూ ఉంటున్నాడు. నా సంపాదన వల్ల ఆర్థికంగా ఊపిరి పీల్చుకుంటున్నాము. ఇదిలా ఉండగా మావారికి ఇటీవల చిరాకు, అకారణ కోపం ఎక్కువైనాయి. చీటికీ మాటికీ పోట్లాటకు సిద్ధమవుతున్నారు. నేను తనతో లేనని బాధతో ఉన్నారని పదే పదే అంటుండడంతో నేను తరచు హైదరాబాద్ వెళ్లి అక్కడ పనులన్నీ చక్కదిద్ది, అన్నీ ఏర్పాటు చేసి వస్తున్నాను. అయినా వారి ప్రవర్తన మారలేదు. ఒక నెల నుండీ ఆయన మా దగ్గరకు రావట్లేదు. ఫోన్ కాంటాక్ట్ కూడా లేదు. తీరా చూస్తే, నాకు కోర్టు నుండి నోటీసు వచ్చింది. నా భర్త ‘రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్’ కింద హైదరాబాద్ ఫ్యామిలీ కోర్టులో కేస్ వేశారు. పిల్లల చదువు మధ్యలో ఉంది. నేనేమి చేయాలి; కోర్టులో ఎలా ప్రొసీడ్ అవ్వాలి? - బి. అమల, విజయవాడ భయపడవలసిన అవసరం లేదు. ఏ కారణం లేకుండా భార్య భర్తను గానీ, భర్త భార్యను గానీ వదలి, కాపురం చేయకుండా విడివిడిగా ఉంటే, తమ కాపురం హక్కులు/ వైవాహిక హక్కులు పునరుద్ధరించమని సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 కింద దాఖలు చేసే పిటిషన్ ఇది. కోర్టువారు విచారణ జరిపి సహేతుకమైన కారణం లేకుండా, భార్య భర్తను కానీ లేక భర్త భార్యను కానీ వదిలివేసి విడిగా జీవిస్తున్నారని భావిస్తే, భర్తను భార్యను కాపురానికి తీసుకొని వెళ్లమని కానీ లేక భార్యను భర్త దగ్గరకు వెళ్లి కాపురం చేయమని గానీ డిక్రీ జారీ చేస్తారు. మీరు విజయవాడలో ఉండటానికి సరైన కారణం ఉంది. అంటే పిల్లల చదువు, వారి భవిష్యత్తు కోసమే మీరు అక్కడ ఉంటూ, మీ భర్త వద్దకు వెళ్లి వస్తూ, అతనికి మీ వద్దకు రానిస్తూ ఉన్నారు. కనుక మీ భర్త మీపై వేసిన కేసును కొట్టివేస్తారు. మీరు విజయవాడలో ఉండటానికి గల కారణాలు సాక్ష్యాధారాలతో సహా కోర్టు ముందు నిరూపించుకోండి. మేమిద్దరం అక్కాచెల్లెళ్లం. నాకు 23 ఏళ్లు. మా చెల్లికి 20 సం. మా అమ్మగారు ఇటీవలే మరణించారు. మా అమ్మకు ఒక చెల్లెలు, ఒక అన్నయ్య ఉన్నారు. వారంతా చక్కగా సెటిలయ్యారు. మా తాతగారు అంటే అమ్మా వాళ్ల నాన్నగారికి పదెకరాల భూమి ఉంది. ఆయన వీలునామా రాయకుండానే (అమ్మకంటే ముందే) మరణించారు. మా అమ్మగారు ఉన్నంతకాలం మా మేనమామ ఆస్తి పంపకం జరగనివ్వకుండా అడ్డుపడుతూ వచ్చాడు. ప్రస్తుతం మా ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు. నాన్నగారు అనారోగ్యంతో బాధపడుతున్నారు. మామయ్యను ఆస్తి పంచమంటే మీ అమ్మే పోయింది. ఇక మీతో మాకు సంబంధమేమిటి? అంటున్నాడు. మాకు న్యాయం జరగదంటారా? - జి. రాగసుధ, వినుకొండ మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. మీ మామయ్య వాదన తప్పు. ఆస్తి ఇవ్వకుండా కుంటిసాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు. మీ తాతగారి పొలంలో మీ అమ్మకు, పిన్నికి, మామయ్యకూ సమానమైన వాటా వస్తుంది. మహిళ అయినా, పురుషుడు అయినా ఉమ్మడి ఆస్తిలో వారికి ఉన్న వాటాలు వారి తర్వాత లేదా వారు మరణించాక వారి వారి వారసులకే సంక్రమిస్తాయి. అంతేకాని, జీవించి ఉన్న ఇతర కుటుంబ సభ్యులకు మాత్రం కాదు. మీ తల్లి మరణించినంత మాత్రాన ఆమెకు ఆస్తిలో హక్కు రద్దుకాదు. మీ తల్లికి సంబంధించి మీ అక్కచెల్లెళ్లు వారసులు కనుక మీకు తప్పకండా వాటా వస్తుంది. మీరు తగిన సాక్ష్యాలతో కోర్టును ఆశ్రయించండి. తప్పకుండా సఫలమవుతారు. మా పెళ్లయ్యి ఐదు సంవత్సరాలైంది. నా భర్త శాడిస్ట్ అని వివాహమైన కొద్దికాలానికే తెలిసింది. పరువు మర్యాదలకు భయపడి కొన్నాళ్లు ఓపిక పట్టాను. నన్ను నానా నరకయాతనలకు గురిచేశాడు. ప్రతిరోజూ లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. వాళ్లతో, వీళ్లతో అక్రమ సంబంధాలు అంటకట్టి వేధించేవాడు. భరించలేక పుట్టింటికి వచ్చాను. నా ఉద్యోగం నేను చేసుకుంటూ నా జీవనం నేను సాగిస్తున్నాను. ఇది కూడా సహించలేని నా భర్త నేను పనిచేసే ఆఫీస్కు వచ్చి, నానా రభస చేస్తున్నాడు. నన్ను దారి కాచి వేధిస్తున్నాడు. నాకు డి.వి.యాక్ట్ గురించి తెలిసి ప్రొటెక్షన్ ఆఫీసర్ గారిని సంప్రదించి, వారి దగ్గర రక్షణ ఉత్తర్వులు కోరుతూ పిటిషన్ పెట్టుకున్నాను. వారి దానిని కోర్టువారికి పంపారు. అక్కడ నా మొర విన్న మేజిస్టేట్గారు ‘ఎక్స్పార్టీ రక్షణ ఉత్తర్వులి’చ్చారు. నా భర్తకు ఒక కాపీ కూడా పంపారు. అయినా అతని వేధింపులు ఆగలేదు పైగా అవి సివిల్ ఆర్డర్స్ అని తననేమీ చేయలేవని వాదిస్తున్నాడు. నాకు తగిన సలహా ఇవ్వగలరు. - పి. అనూరాధ, విశాఖపట్నం డొమెస్టిక్ వయొలెన్స్ చట్టం సివిల్ చట్టమైనప్పటికీ దానికి క్రిమినల్ అధికారాలు ఉన్నాయి. కోర్టువారిచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించి, మిమ్ములను వేదనకు గురిచేస్తున్నాడు. అందువలన మీరు సెక్షన్ 31 ప్రకారం అంటే బ్రీచ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆర్డర్ కింద కేసు వేయండి. విచారణ తర్వాత మీ భర్తకు సంవత్సరం జైలు శిక్ష, 20,000 రూపాయల జరిమానా పడే అవకాశం ఉంది. అసలు ఈ పిటిషన్ వేసిన వెంటనే, అతని వేధింపులు ఆగే అవకాశం వంద శాతం ఉంది. ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్