ఆర్ఐఎల్లో అగ్నిప్రమాదం-ఇద్దరు మృతి
అహ్మదాబాద్: గుజరాత్ లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముకేష్ అంబానీ నేతృత్వంలోని ఆర్ ఐ ఎల్ జామ్నగర్ ప్లాంట్లో డీటీఏ (డొమెస్టిక్ టారిఫ్ ఏరియా) రిఫైనరీలో గురువారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించగా మరో ఎనిమిది మంది కాంట్రాక్టు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను తక్షణమే జామ్నగర్ సివిల్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే మెయింటెనెన్స్ కోసం ఉత్పత్తి ఆపివేసిన ప్లాంట్లో ప్రమాదం జరిగిందనిరిలయన్స్ ఇండస్ట్రీ వర్గాలు ప్రకటించాయి. ఇది దురదృష్ట వశాత్తు జరిగిన ప్రమాదమనీ, వెంటనే రిలయన్స్ కు చెందిన అగ్ని మాపకదళాలు మంటల్ని ఆదుపు చేస్తున్నాయన్నారు. గాయపడిన వారికి తగిన వైద్య సదుపాయాలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ప్రకటించాయి. కార్యకలాపాలు యధావిధిగానే కొనసాగుతున్నాయని తెలిపింది.