breaking news
Pranav Haldea
-
ఐపీవో నిధుల సమీకరణ వీక్
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో పబ్లిక్ ఇష్యూల వేగం తగ్గింది. దీంతో 14 కంపెనీలు మాత్రమే లిస్టింగ్కురాగా.. కేవలం రూ. 35,456 కోట్లు సమీకరించాయి. గతేడాది తొలి అర్ధభాగంలో 25 ఇష్యూల ద్వారా కంపెనీలు సమకూర్చుకున్న రూ. 51,979 కోట్లతో పోలిస్తే తాజా పెట్టుబడులు 32 శాతం క్షీణించాయి. ప్రైమ్ డేటాబేస్ గణాంకాలివి. నిజానికి మొత్తం నిధుల సమీకరణలో 58 శాతం వాటాను ఆక్రమించిన ఎల్ఐసీ ఇష్యూ(రూ. 20,557 కోట్లు)లేకుంటే ఈ సంఖ్య మరింత నిరుత్సాహకరంగా కనిపించేదని ప్రైమ్ డేటాబేస్ గ్రూప్ ఎండీ ప్రణవ్ హాల్దియా పేర్కొన్నారు. అయితే ప్రైమ్ గణాంకాల ప్రకారం ఇకపై ప్రైమరీ మార్కెట్లు కళకళలాడనున్నాయి. ఇప్పటికే 71 కంపెనీలు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు అనుమతులు పొందాయి. తద్వారా రూ. 1,05,000 కోట్లు సమీకరించే సన్నాహాల్లో ఉన్నాయి. ఇవికాకుండా మరో 43 కంపెనీలు రూ. 70,000 కోట్ల పెట్టుబడుల కోసం సెబీని ఆశ్రయించాయి. అనుమతులు వెలువడవలసి ఉంది. మొత్తం ఈ జాబితాలో 10 న్యూఏజ్ టెక్నాలజీ కంపెనీలుకాగా.. రూ. 35,000 కోట్ల సమీకరణకు వేచి చూస్తున్నాయి. ఈక్విటీ నిధులు సైతం డీలా తొలి అర్ధభాగంలో పబ్లిక్ ఈక్విటీ నిధుల సమీకరణ సైతం 55 శాతం క్షీణించింది. రూ. 41,919 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే కాలంలో ఈక్విటీ మార్గంలో రూ. 92,191 కోట్ల పెట్టుబడులు లభించాయి. ఎల్ఐసీని మినహాయిస్తే డెల్హివరి రూ. 5,235 కోట్లు, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ రూ. 1,581 కోట్లు సమకూర్చుకున్నాయి. 14 కంపెనీలలో డెల్హివరీ మాత్రమే న్యూఏజ్ టెక్ కంపెనీ కావడం గమనార్హం! పేటీఎమ్సహా కొన్ని ఇతర కంపెనీలు ఇన్వెస్టర్లను నిరాశపరచడం ప్రభావం చూపింది. దీంతో 14 ఐపీవోలలో 4 కంపెనీలకు మాత్రమే 10 రెట్లు, అంతకుమించిన స్పందన లభించింది. ఈ కాలంలో కేవలం 41 కంపెనీలు ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. గతేడాది ఇదే సమయంలో 87 సంస్థలు సెబీని ఆశ్రయించాయి. మరో 2 కంపెనీలు రెడీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు వీలుగా రెండు కంపెనీలు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేశాయి. జాబితాలో ఎన్విరో ఇన్ఫ్రా ఇంజినీర్స్, ఉదయ్శివ్కుమార్ ఇన్ఫ్రా ఉన్నాయి. దీంతో ఈ నెల(సెప్టెంబర్)లో ఇప్పటివరకూ కొత్తగా 8 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పట్టినట్లయ్యింది. కాగా.. ఐపీవోలో భాగంగా ఎన్విరో ఇన్ఫ్రా 95 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ఇక ఉదయ్శివకుమార్ ఇన్ఫ్రా రూ. 60 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. రెండు సంస్థలూ వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు నిధులను వినియోగించనున్నాయి. ప్రభుత్వం తదితర సంస్థలకు చెందిన నీటిపారుదల పథకాలు, వేస్ట్వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు డిజైనింగ్, నిర్మాణం, నిర్వహణ సేవలు ఎన్విరో అందిస్తోంది. ఉదయ్శివకుమార్ రహదారుల నిర్మాణంలో కార్యకలాపాలు కలిగి ఉంది. తదితరాల నిర్మాణం, నిర్వహణలను ఎన్విరో చేపడుతోంది. రోడ్లు, బ్రిడ్జిలు, ఇరిగేషన్, కాలువలు, పారిశ్రామిక ప్రాంతాల నిర్మాణం తదితరాలను చేపడుతోంది. -
పబ్లిక్ ఇష్యూలు పండలేదు
న్యూఢిల్లీ: గడిచిన ఏడాది(2013) దేశీయ కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా కేవలం రూ. 1,619 కోట్లను సమీకరించాయి. గత 12 ఏళ్లలోనే ఇది అతి తక్కువ మొత్తం కాగా, ఇందుకు మార్కెట్లలో ఏర్పడిన ఒడిదొడుకులు కారణంగా నిలిచాయి. ప్రైమ్డేటా బేస్ గణాంకాల ప్రకారం 2012లో 11 కంపెనీలు ఐపీవోల ద్వారా రూ. 6,835 కోట్లను సమీకరించాయి. అయితే 2013లో మూడు కంపెనీలు మాత్రమే పబ్లిక్ ఇష్యూలను చేపట్టి రూ. 1,619 కోట్లను సమకూర్చుకున్నాయి. ఇంతక్రితం 2001లో మాత్రమే కంపెనీలు ఐపీవోల ద్వారా అతితక్కువగా రూ. 296 కోట్లను సమీకరించాయి. కాగా, 2010లో ఐపీవోల ద్వారా అత్యధికంగా రూ. 37,535 కోట్లను సమీకరించడం విశేషం! సమీపకాలంలో కష్టమే: సమీప కాలంలో ఐపీవో మార్కెట్ పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదని ప్రైమ్ డేటాబేస్ ఎండీ ప్రణవ్ హల్దియా అభిప్రాయపడ్డారు. రాజకీయ, ఆర్థిక పరిస్థితులలో అనిశ్చితి కొనసాగడంతోపాటు, సెకండరీ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతుండటం ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నదని వివరించారు. అయితే 915 కంపెనీలు భవిష్యత్లో ఐపీవో ద్వారా నిధులు సమీకరించాలనే ఆసక్తిని ప్రదర్శిస్తుండటం విశేషమని చెప్పారు. ఈ బాటలో ఇప్పటికే 14 సంస్థలు రూ. 3,635 కోట్లను సమీకరించేందుకు సెబీ అనుమతిని పొందినట్లు వెల్లడించారు. ఇదే విధంగా మరో 10 కంపెనీలు రూ. 3,100 కోట్ల సమీకరణకు సెబీ అనుమతి కోసం వేచి చూస్తున్నట్లు పేర్కొన్నారు. జస్ట్ డయల్ సక్సెస్ ఐపీవో ద్వారా 2013లో జస్ట్ డయల్ రూ. 919 కోట్లను సమీకరించడంలో విజయవంతంకాగా, రెప్కో హోమ్ ఫైనాన్స్ రూ. 270 కోట్లు, వీమార్ట్ రిటైల్ రూ. 94 కోట్లను సమకూర్చుకున్నాయి. ఇక మరోవైపు ఇదే కాలంలో 35 చిన్న, మధ్య తరహా కంపెనీలు (ఎస్ఎంఈలు) ఐపీవోల ద్వారా రూ. 335 కోట్లను వసూలు చేయగలిగాయి. సెంటిమెంట్ బలహీనంగా ఉండటం, ప్రధాన ఇండెక్స్లు ఒడిదొడుకులను చవిచూడటం, ప్రమోటర్ల వాటాలకు సరైన ధర లభించకపోవడం తదితర అంశాల నేపథ్యంలో నిజానికి గత మూడేళ్లలో ఐపీవోలకు మార్కెట్లు సహకరించలేదని ప్రణవ్ పేర్కొన్నారు. దీంతో అటు ప్రభుత్వం సైతం డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని సాధించలేకపోయిందని చెప్పారు. 35 ఎస్ఎంఈల పబ్లిక్ ఇష్యూలు అందుబాటులో లేకపోవడం, కేవలం మూడు ఇష్యూలే మార్కెట్లను తాకడం వంటి అంశాలు చిన్న ఇన్వెస్టర్లను నిరుత్సాహానికి లోనుచేశాయని తెలిపారు.