breaking news
pilot study
-
కరోనా మృతుల ముక్కు, గొంతులో.. 24 గంటల్లో వైరస్ నిర్వీర్యం
న్యూఢిల్లీ: కరోనా బారినపడి మృతిచెందిన వారిలో వైరస్ ఆనవాళ్లు ఎన్ని రోజులపాటు ఉంటాయన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కరోనా వల్ల చనిపోయిన వారిలో వైరస్ కచ్చితంగా సజీవంగా ఉంటుందని, అది మరొకరికి వ్యాపిస్తుందన్న అంచనాతో ప్రత్యేకమైన జాగ్రత్తలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అయితే, చనిపోయిన తర్వాత బాధితుల ముక్కు, గొంతులో వైరస్ 12 నుంచి 24 గంటలకు మించి క్రియాశీలకంగా ఉండదని ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ విభాగం అధినేత డాక్టర్ సుదీర్ గుప్తా మంగళవారం చెప్పారు. మృతుల నుంచి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు భారీగా తగ్గిపోతాయని అన్నారు. కరోనా బాధితుల మృతదేహాలపై ఎయిమ్స్లోని డిపార్టుమెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్లో గత ఏడాదికాలంగా ఒక పైలట్ స్టడీని నిర్వహించారు. దాదాపు 100 మృతదేహాలను పరీక్షించారు. మరణించిన తర్వాత 12 నుంచి 24 గంటల మధ్య కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా, నెగెటివ్ అని తేలింది. అంటే ఆయా మృతదేహాల్లో కరోనా వైరస్ క్రియాశీలతను కోల్పోయింది. పూర్తిగా బలహీనపడింది. కోవిడ్–19 మహమ్మారి కారణంగా చనిపోతే.. 24 గంటల తర్వాత మృతదేహంలోని ముక్కు, నోటి భాగాల్లో వైరస్ యాక్టివ్గా ఉండదని తమ అధ్యయనంలో వెల్లడైనట్లు డాక్టర్ సుధీర్ గుప్తా పేర్కొన్నారు. అయినప్పటికీ కరోనా సంబంధిత మృతదేహాలను దహనం లేదా ఖననం చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముక్కు, గొంతులో వైరస్ ఆనవాళ్లు లేకున్నా శరీరం లోపలి నుంచి ప్రమాదకరమైన ద్రవాలు వాటి ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అందుకే కరోనా సంబంధిత మృతదేహాల ముక్కు, గొంతును పూర్తిగా మూసి ఉంచాలన్నారు. అంత్యక్రియలు నిర్వహించేవారు పీపీఈ కిట్లు, మాసు్కలు ధరించాలని తెలిపారు. కరోనా సోకి మృతిచెందిన వారి అంత్యక్రియలు ముగిశాక బూడిద, ఎముకల్లో వైరస్ ఎంతమాత్రం ఉండదని డాక్టర్ సు«దీర్ గుప్తా పేర్కొన్నారు. వాటిని సేకరించడంలో ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. వాటి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు లేవన్నారు. -
ఫేస్బుక్ ద్వారా వినూత్న స్టడీ, వాలంటీర్లు కావాలి
న్యూయార్క్: మతిమరుపు అనేది మనిషి జీవితంలో ఊహించని పరిణామాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా వయసుమళ్లిన వారిపై దాడి చేసిన వారి జీవితాలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న వ్యాధి అల్జీమర్స్. ఈ అల్జీమర్స్ వ్యాధి బారినపడ్డ రోగి జీవితంలో అనూహ్యంగా ఎంత గందరగోళం ఏర్పడుతుందో వారి సంరక్షకులపై అంతకంటే ఎక్కువ ఒత్తిడి నెలకొంటుంది. ఇరవై నాలుగ్గంటలూ వారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన సంరక్షకులకు డిప్రెషన్, ఆతురత, నిద్రలేమి, హృదయసంబంధ (కార్డియోవాస్క్యులర్) తదితర వ్యాధులు ఎక్కువ అవుతున్నాయని ఇటీవల ఓ స్టడీలో తేలింది. ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి ఉపయోగపడేలా ఫేస్బుక్ వెబ్ యాప్ ద్వారా ఒక అధ్యయనం చేపట్టనున్నారు. ఇండియానా యూనివర్శిటీ-పర్డ్యూవిశ్వవిద్యాలయం ఇండియానాపోలిస్ పరిశోధకుల బృందం స్వచ్ఛందంగా ఒక వినూత్న రీతిలో పైలట్ అధ్యయనం నిర్వహిస్తోంది. ఈ అధ్యయానికి గాను వాలంటీర్లను ఆహ్వానిస్తోంది. ఈ పార్టిసిపెంట్స్ తో మైక్రోవాలంటరీంగ్ గ్రూపు ను క్రియేట్ చేసి వారితో చర్చలు నిర్వహించనుంది. దీనికోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వెబ్ యాప్ ద్వారా సంరక్షకుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనుంది. దీని ద్వారా అల్జీమర్స్ పీడితుల సంరక్షలకు ఉపయోగపడాలని భావిస్తోంది. ఆరువారాల పాటు నిర్వహించనున్నఈ పైలట్ అధ్యయనంలో పాల్గొనే ఆసక్తి వున్నవారు alzgroup.iu.edu ద్వారా తెలుసుకోవచ్చని యూనివర్శిటీ ఒక ప్రకటనలో తెలిపింది.