breaking news
pension system
-
పింఛను వ్యవస్థల్లో భారత్ స్థానం మరింత దిగువకు
ముంబై: రిటైర్మెంట్ తరువాతి పెన్షన్ల వ్యవస్థల్లో భారత్ స్థానం మరింత దిగజారింది. మొత్తం 47 దేశాలతో కూడిన గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ జాబితాలో ఏకంగా 45వ స్థానానికి పడిపోయింది. గత ఏడాది 44 దేశాలతో జాబితా రూపొందించగా అందులో మనదేశం 41వ స్థానంలోనూ 2021లో 43 దేశాల జాబితాలో 40వ స్థానంలోనూ నిలవడం గమనార్హం. మెర్సర్ సీఎఫ్ఏ ఇన్స్టిట్యూట్ సిద్ధం చేసిన ఈ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ తాజా నివేదిక ఈ విషయాలను తెలిపింది. ఇండెక్స్ విలువను పరిగణిస్తే మాత్రం భారత్ గత ఏడాది విలువ (44.4) కంటే ఈ ఏడాది విలువ కొంచెం పెరిగి 45.9 కి చేరడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా రిటైర్మెంట్ తర్వాత ఆదాయాన్నిచ్చే పెన్షన్ వ్యవస్థలను (64 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహించే) మెర్సర్ అధ్యయనం చేసింది. నెదర్లాండ్ 85 ఇండెక్స్ వ్యాల్యూతో అన్నింటికంటే మెరుగ్గా ఉంది. 83.5 శాతం విలువతో ఐస్ల్యాండ్, 81.3 శాతం విలువతో డెన్మార్క్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 42.3తో అర్జెంటీనా అన్నింటి కంటే దిగువన ఉంది. పదవీ విరమణ తరువాత కూడా ఉద్యోగులకు తగినంత ఆదాయం ఇవ్వగల సామర్థ్యం పెన్షన్ వ్యవస్థకు ఉందా? ఈ ప్రయోజనాలను దీర్ఘకాలం కొనసాగించగలదా? పెన్షన్ వ్యవస్థ సమగ్రతతో పనిచేస్తోందా? అన్న అంశాల ఆధారంగా మెర్సర్ ఈ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ను రూపొందించింది. అంటే నెదర్లాండ్స్ వంటి దేశాల్లో రిటైర్మెంట్ తరువాత కూడా ఓ మోస్తరు జీవనశైలితో జీవితం గడిపేందుకు తగినంత పెన్షన్ లభిస్తుందన్నమాట. కాగా... ఈ ఏడాది గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్లోకి బోట్స్వానా, క్రొయేషియా, కజకిస్థాన్లు కొత్తగా ప్రవేశించాయి. జననాల రేటు క్షీణించడం తాలూకూ ప్రభావం పలు ఆర్థిక వ్యవస్థలు, వాటి పెన్షన్ పథకాలపై పడిందని ఈ నివేదిక తెలిపింది. గత ఐదేళ్లలో చైనా, కొరియా, సింగపూర్, జపాన్లు తమ స్కోర్ను పెంచకునేందుకు సంస్కరణలు చేపట్టినట్టు తెలిపింది. మెర్సర్ ఇన్స్టిట్యూట్ రూపొందించిన నివేదిక ప్రకారం భారత్లో పెన్షన్ వ్యవస్థ గతం కంటే కొంత మెరుగైంది. తగినంత పెన్షన్, దీర్ఘకాలం ఇవ్వగలగడమన్న రెండు సూచీల్లో ఈ మెరుగుదల కనిపించింది. కానీ.. ప్రపంచ ర్యాంకింగ్లలో మాత్రం వెనుకబడే ఉంది. ఆదాయానికి తగ్గట్టుగా పెన్షన్ నిధికి చందాలు ఇచ్చే నిర్బంధ వ్యవస్థ లేకపోవడం భారత్ లోపాల్లో ఒకటని తెలిపింది. ప్రైవేట్ పెన్షన్ ప్లాన్లు కేవలం ఆరు శాతం మాత్రమే ఉన్నాయని, రిటైర్మెంట్కు ముందు వచ్చే ఆదాయంతో పోలిస్తే తరువాత వచ్చేది చాలా తక్కువగా ఉందని కూడా ఈ సంస్థ తెలిపింది. భారత్లో పెన్షన్ వ్యవస్థ తాలూకూ ఆస్తులు జీడీపీతో పోలిస్తే తక్కువగా ఉన్నాయని, రిటైర్మెంట్ కోసం కేటాయించే నిధులు తగినన్ని లేవనేందుకు, పొదుపు కూడా తక్కువగా ఉందనేందుకు ఇది ఒక రుజువు అని వివరించింది. -
ఆర్థిక భరోసా ‘గ్యారెంటీ’
మనుషుల జీవిత కాలం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 60 ఏళ్లకుపైగా జీవించే వారు 2022లో 10 శాతం ఉండగా 2025 నాటికి 16 శాతానికి పెరుగుతారు. ఓపీఎస్ అనేది ఎన్ని సంవత్సరాలు జీవిస్తే అన్నేళ్లూ ఇవ్వాలి. అమెరికా లాంటి దేశం కూడా పెన్షన్లపై పరిశోధన చేసి చివరకు సాధ్యం కాక ఓపీఎస్ను తగ్గించేసింది. సమయం, వయసు నిబంధనలను సవరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఓపీఎస్, సీపీఎస్లపై చిత్తశుద్ధితో ఆలోచించింది. ఓపీఎస్తో సుదీర్ఘ భవిష్యత్తులో జీతాల చెల్లింపులకు సైతం ఇబ్బందులొస్తాయి. ఇక సీపీఎస్ను అమలు చేస్తే వడ్డీ రేట్లు తగ్గిపోయి షేర్ మార్కె ట్లో పెట్టుబడులు సరైన రాబడి ఇవ్వ నప్పుడు ఉద్యోగులకు నష్టం వస్తుంది. అందుకే దీనిపై బాగా ఆలోచించి మధ్యేమార్గంగా జీపీఎస్ను తెచ్చాం. – అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాలనలో ఉద్యోగుల సేవలు ఎంతో కీలకమని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పబ్లిక్ సర్వెంట్స్ తమ అభిమతం కంటే ప్రజా సేవకే ప్రాధాన్యమిస్తారన్నారు. అలాంటి ఉద్యోగుల కష్టాన్ని గుర్తించిన తమ ప్రభుత్వం వారి ఆకాంక్షలకనుగుణంగా పనిచేస్తోందన్నారు. ప్రధానంగా ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచామన్నారు. తమ ప్రభుత్వం 11వ పే రివిజన్ కమిషన్ సిఫారసులను అమలు చేసిందని, అంతకంటే ముందు ఉద్యోగులు నష్టపోకుండా మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. బుధవారం శానససభలో ఏపీ రెగ్యులరైజేషన్ ఆఫ్ సర్వీసెస్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ బిల్లు–2023, ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ సిస్టమ్ (జీపీఎస్) బిల్లు–2023ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ ద్వారా ప్రభుత్వంపై ఏటా దాదాపు రూ.311 కోట్ల మేర అదనపు భారం పడుతుంది. జీపీఎస్ అమలుతో 2040 నాటికి రూ.2,500 కోట్లు అదనంగా ఆర్థిక భారం పడుతుందని అంచనా. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను (ఓపీఎస్) అమలు చేస్తే భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అందుకే కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) ఉద్యోగులకు మేలు చేసేలా ప్రభుత్వం గ్యారెంటీడ్ పెన్షన్ సిస్టమ్ను(జీపీఎస్) తెచ్చిందన్నారు. ఒక సర్వే ప్రకారం ఓపీఎస్ కొనసాగితే రాష్ట్రంలో ఉద్యోగుల పెన్షన్ల ఖర్చు ప్రస్తుతం ఉన్నదాని కంటే నాలుగున్నర రెట్లు పెరుగుతుందన్నారు. ఓపీఎస్ ప్రకారం పెన్షన్ 1991–92లో సున్నా నుంచి ప్రారంభమై 2022–23 నాటికి దేశవ్యాప్తంగా రూ.1.7 లక్షల కోట్లకు చేరుకుంటుందని తెలిపారు. భవిష్యత్తులో ఇది మరింత పెరిగి పెన్షన్లే కాకుండా జీతాలకూ ఇబ్బందులొస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న న్యూ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్/సీపీఎస్) ప్రకారం దేశవ్యాప్తంగా 2023 నుంచి 2050కి నాటికి పెన్షన్ల చెల్లింపులు రూ.4 లక్షల కోట్లకు చేరుకుంటే అదే ఓపీఎస్ ప్రకారం అయితే రూ.18 లక్షల కోట్లవుతుందన్నారు. ‘దీనివల్ల అసలు ఓపీఎస్ను ఎవరైనా చేయగలరా? తాత్కాలికంగా ఒక వ్యక్తిని తృప్తి పరిచేందుకు ఎన్నైనా చెప్పొచ్చు. కానీ దీర్ఘకాలంలో ఇది సాధ్యమైనా? పాలన చేసేటప్పుడు ఈరోజు పరిస్థితిని, భావి తరాల పరిస్థితిని కూడా చూసుకోవాలి. కొంతమంది మాదిరిగా ఏదో ఒకటి చేసుకోండని చెప్పి అమల్లోకి వెళ్తే ఐదేళ్లకో, పదేళ్లకో కుప్పకూలిపోతుంది. అందుకే మధ్యేమార్గాన్ని అనుసరిస్తున్నాం’ అన్నారు. ఇంకా బుగ్గన ఏమన్నారంటే.. రాబడి కంటే ఎక్కువ ఏపీ ఓన్ రెవెన్యూ 2014–15లో రూ.38,038 కోట్లుగా ఉంది. ఇది 2015–16 నాటికి రూ.44,842 కోట్లు, 2016–17లో రూ.44,374 కోట్లు, 2017–18కి రూ.53 వేల కోట్లు, 2020–21 నాటికి రూ.60,823 కోట్లకు చేరింది. ఇందులో మానవ వనరులపై ఖర్చు 2014–15లో రూ.25,094 కోట్లు కాగా ప్రస్తుతం రూ.83,604 కోట్లకు పెరిగింది. రాష్ట్రం మొత్తం రాబడిలో హెచ్ఆర్ ఖర్చులే 66 శాతంగా ఉన్నాయి. జీతాలు, పెన్షన్లకు 2014–15లో 70 శాతం ఉంటే.. 2019–20లో వంద శాతం, 2020–21 నాటికి 110 శాతం అయ్యింది. అంటే 2020–21 నాటికి మన రాష్ట్రానికి వచ్చే రాబడి కంటే ఎక్కువగా పెన్షన్లు, జీతాలకు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే ఎక్కువ సొంత రాబడిలో మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే 2020–21లో ఏపీలోనే పెన్షన్ల ఖర్చు ఎక్కువ. 2015–16లో ఏపీలో 91 శాతం ఖర్చు అవుతుంటే తెలంగాణలో 53 శాతమే ఉంది. 2020–21లో ఏపీలో 110 శాతంగా ఉంటే తెలంగాణ లో 53 శాతమే ఉంది. తెలంగాణ కంటే ఏపీలో రెట్టింపు వ్యయం అవుతోంది. కర్నాటక, తమిళనాడులోనూ మనకంటే తక్కువగానే ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఓపీఎస్ను అమలు చేయడం సాధ్యంకాదు. 2014–15లో హెచ్ఆర్ ఖర్చు రూ.25,094 కోట్లు అయితే పెన్షన్లకు రూ.6,147 కోట్లు అయ్యింది. 2022–23లో హెచ్ఆర్ వ్యయం రూ.83,406 కోట్లుండగా పెన్షన్లు రూ.22,602 కోట్లకు చేరాయి. ఇది మరింత పెరగడం ఖాయం. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓపీఎస్లోకి వెళ్లమని కొందరు సలహా ఇస్తున్నారు. కానీ రాష్ట్ర భవితకోసం ఆలోచిస్తున్నాం. ఓపీఎస్తో ఆర్థిక పరిస్థితి చేయిదాటి పోతుంది సీపీఎస్లో ప్రస్తుతం ప్రభుత్వం రూ.1,510 కోట్లు ఏటా చెల్లిస్తోంది. అదే ఓపీఎస్లోకి వెళ్తే ఇప్పటికిప్పుడు కట్టాల్సింది రూ.23 కోట్లే. అయినప్పటికీ ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మధ్యేమార్గంగా జీపీఎస్పై ఆలోచనలు చేశాం. ఓపీఎస్కు వెళ్తే పెన్షన్లకు 2023లో రూ.20 వేల కోట్లకు పైగా, 2025 వచ్చేసరికి రూ.22,037 కోట్లు, 2030–35 నాటికి రూ.33,546 కోట్లు, ఆ తరువాత నుంచి ఇక చేయిదాటి పోతుంది. 2004లో నియమితులైన ఉద్యోగులు 2045 నాటికి రిటైరవుతారు. అప్పుడు ఒకేసారి పెన్షన్ల భారం పెరుగుతుంది. దీన్ని ఆలోచించి జీపీఎస్పై కసరత్తు చేశాం. ప్రఖ్యాత కేఏ పండిట్ æసంస్థతో సంప్రదించి ఈ విధానాన్ని తెచ్చాం. పెన్షన్కు ప్రభుత్వానిదే బాధ్యత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 5.70 లక్షల మంది ఉన్నారు. వీరిలో ఓపీఎస్ ఉద్యోగులు 2.02 లక్షల మంది, సీపీఎస్ ఉద్యోగులు 3.04 లక్షలు, పెన్షనర్లు ఓపీఎస్లో 3,73,770, రెగ్యులర్ పెన్షనర్లు 24,663, ఫ్యామిలీ పెన్షనర్లు 1,69,107 మంది ఉన్నారు. సీపీఎస్లో ఉద్యోగులకు 20 శాతం కంటే పెన్షన్ రాదు. దానికీ గ్యారెంటీ లేదు. రిటైరయ్యాక చివరి మూలవేతనంలో సగం మొత్తం పెన్షన్గా ఉండేలా జీపీఎస్ను రూపొందించాం. సీపీఎస్లో వడ్డీ రేట్లు తగ్గినా, షేర్మార్కెట్లో రాబడి లేకున్నా వారికి పెన్షన్ భద్రత ఉండదు. అదే జీపీఎస్లో ఉద్యోగి చివరి నెల మూలవేతనంలో 50% పెన్షన్కు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. జీవిత భాగస్వామికి 60 శాతం పెన్షన్ ఉంటుంది. దాంతోపాటు డీఆర్, ఈహెచ్ఎస్ స్కీమ్ను అమలు చేస్తాం. ఉదాహరణకు ఆఫీసు సబార్డినేట్ చివరి జీతంలో మూల వేతనం రూ.45,966 అయితే సీపీఎస్లో 20 శాతం అంటే రూ.9579 మాత్రమే పెన్షన్ వస్తుంది. దానికి గ్యారెంటీ లేదు. కానీ జీపీఎస్లో 50 శాతం కింద రూ.23,923 వస్తుంది. పోలీసు కానిస్టేబుల్కు రూ.60,485 చివరి జీతం మూల వేతనం ఉంటే సీపీఎస్ లో రూ.12,079 పెన్షన్, జీపీఎస్లో రూ.30,243 వస్తుంది. ఎస్జీటీ టీచర్లు చివరి జీతంలో మూల వేతనం రూ.78,352 అయితే వారికి సీపీఎస్లో రూ.15,647 పెన్షన్, అదే జీపీఎస్లో రూ.39,175 ఇస్తారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు చివరి జీతంలో మూల వేతనం రూ.1,48,597 ఉంటే సీపీఎస్ కింద రూ.29,675, అదే జీపీఎస్ కింద రూ.74,299 వస్తుంది. దీనితో పాటు వారి ఫ్యామిలీ పెన్షన్ కింద 60 శాతం, హెల్త్ స్కీం సైతం వర్తిస్తుంది. ఏ లెక్కన చూసినా జీపీఎస్లో ఉద్యోగికి మేలు జరుగుతుంది. ఉద్యోగుల భద్రత కోసం ఆలోచించి భవిష్యత్తులో ఏ ఒక్కరికీ నష్టం రాకూడని తీసుకున్న నిర్ణయమిది. భారీగా ఉద్యోగాల భర్తీ 53 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా రెగ్యులర్ గవర్నమెంట్ ఉద్యోగుల మాదిరిగా భద్రత కల్పిస్తున్నాం. వైద్య విధాన పరిషత్ను సైతం డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్గా మార్పు చేసి 15 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చాం. ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే 1.35 లక్షల మందికి గ్రామ, వార్డు సచివాలయాలను తెచ్చి ఉద్యోగాలిచ్చాం. మరో 2.50 లక్షల మందిపైగా వలంటీర్లుగా పని చేస్తున్నారు. ఒక్క వైద్య ఆరోగ్య రంగంలోనే 53,126 ఉద్యోగాలను భర్తీ చేశాం. రెగ్యులర్ క్యాలెండర్ ప్రకారం వివిధ శాఖలో మరో 10,143 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించాం. గ్రూప్1, 2లతో పాటు ఎస్ఐ, ఆర్ఎస్ఐ నియామకాలు, 6,100 పోలీసు కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేశాం. ఉద్యోగులపై చంద్రబాబు విషం గతంలోనే ఉద్యోగులపై విషాన్ని తన మనసులో మాట పుస్తకం ద్వారా చంద్రబాబు బయటపెట్టారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లతో రాష్ట్రం అప్పుల వలలో చిక్కుకుపోతోందని విద్వేషాలను ప్రచురించారు. ఇదంతా ఉమ్మడి రాష్ట్రంలో సర్ప్లస్ రెవెన్యూ ఉన్నప్పుడు రాసిన మాట. సీఎం జగన్ కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమాన్ని ఆపకుండా ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉద్యోగులకు చేయాల్సినంత మేలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాలను ఆలోచించుకోవాలి. ఊహించని రీతిలో జీతాల పెంపు చిన్న స్థాయి ఉద్యోగుల జీవన ప్రమాణాలను పెంచేందుకు భారీగా జీతాలు పెంచాం. ఆశా వర్కర్ల జీతాలను రూ.3 వేల నుంచి ఏకంగా రూ.10 వేలకు పెంచడంతో 43 వేల మందికి లబ్ధి చేకూరింది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాపై భారం రూ.155 కోట్లు నుంచి రూ.517 కోట్లకు చేరుకుంది. గిరిజన, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ వర్కర్ల జీతాలను రూ.12 వేల నుంచి రూ.18 వేలకు పెంచడంతో ప్రభుత్వంపై రూ.415 కోట్ల భారం కాస్తా రూ.622 కోట్లకు వెళ్లింది. మెప్మా రిసోర్స్ పర్సన్లకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు, సెర్ప్ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్కు రూ.2 వేల నుంచి రూ.10 వేలకు పెంచి వారి ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేశాం. 16 వేల మంది హోంగార్డులకు రూ.18 వేల నుంచి రూ.21,300కి జీతం పెంచడం ద్వారా భారం రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్లకు పెరిగింది. 88 వేల మంది మిడ్ డే మీల్స్ సహాయకులకు రూ.వెయ్యి నుంచి రూ.3 వేలు చేయడంతో రూ.200 కోట్లు అదనపు భారం పడింది. 48,770 మంది అంగన్వాడీలకు రూ.7 వేల నుంచి రూ.11,500కి, ఇందులో 55,607 మంది అంగన్వాడీ హెల్పర్స్కు రూ.4 వేల నుంచి రూ.7 వేలకు పెంచాం. సెర్ప్లో పని చేసే హెచ్ఆర్ ఉద్యోగులకు 23 శాతం జీతాల పెంపుతో 4,569 మందికి లబ్ధి చేకూరింది. సూక్ష్మస్థాయిలో ఆలోచించి 108 డ్రైవర్లకు రూ.13 వేలు ఉండే జీతాన్ని రూ.28 వేలు చేశాం. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్కు రూ.15,500 నుంచి రూ.20 వేలు, 104 డ్రైవర్లుకు రూ.26 వేలకు, ఆస్పత్రుల్లోని శానిటేషన్ వర్కర్లకు రూ.8 వేల నుంచి రూ.18 వేలకు పెంచాం. దాదాపు 3 లక్షల మందికి పైగా ఉద్యోగులకు జీతాల పెంపు ద్వారా ఆర్థిక భారం రూ.2 వేల కోట్లు నుంచి రూ.3500 కోట్లుకు చేరింది. రూ.1,500 కోట్లు అదనపు భారాన్ని ప్రభుత్వం మోస్తోంది. వీటికి తోడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు తమ కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు వీక్లీ ఆఫ్లు తీసుకొచ్చాం. ఏజెన్సీల చేతుల్లో శ్రమ దోపిడీకి గురైన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్లోకి తీసుకొచ్చి చట్టం చేసి ఒకటో తేదీన జీతంతో పాటు ఈపీఎస్, ఈఎస్ఐను కూడా కల్పిస్తున్నాం. ఉద్యోగులకు ప్రత్యేక లీవ్ బెనిఫిట్స్, కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ తీసుకొచ్చాం. 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కాంట్రాక్టు ఉద్యోగుల చిరకాల వాంఛను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తున్నారు. వివిధ శాఖల్లో సుమారు 10,117 మంది ఫుల్టైం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నాం. వీలైనంత ఎక్కువ మందికి మేలు చేసేలా 2–6–2014కు ముందు ఐదేళ్లు సర్వీసు ఉండాలనే నిబంధనలను సీఎం జగన్ సడలించారు. రాష్ట్రం విడిపోయిన నాటికి పర్మినెంట్ శాంక్షన్డ్ పోస్టులో ఫుల్ టైం కాంట్రాక్టు విభాగంలో నియమితులైన వారిని క్రమబద్ధీకరిస్తాం. శాంక్షన్డ్ పోస్టుకు ఆర్థిక శాఖ అనుమతి ఉండి నోటిఫై అయిన ఖాళీలను నిర్దిష్ట నిబంధనల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ పారదర్శకంగా భర్తీ చేసి ఉండాలి. -
ఉద్యోగుల భవిష్యత్కు భరోసా
నిడమర్రు : పదవీ విరమణ తర్వాత ఉద్యోగుల జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)పై ప్రజా సంకల్పయాత్ర సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించిన తీరుపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. 2014 నుంచి ఉద్యోగుల జీవితాలను చీకటిమయం చేసిన ఈ సీపీఎస్ను అధికారంలో వస్తే రద్దు చేస్తామని ప్రజా సంకల్పయాత్ర తొలిరోజున జగన్ ఇచ్చిన హామీ సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 4వ తేదీన చిత్తూరులో జరిగిన ఎన్జీవోస్ సభలో సీపీఎస్ రద్దు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందని సీఎం చంద్రబాబు ప్రకటించడం ఉద్యోగుల పట్ల సీఎం చంద్రబాబు వైఖరి మరోసారి బహిర్గతమైందని వారంటున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దుతోపాటు, ఉద్యోగుల సొంత ఇంటి కల నెరవేర్చుతానని, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని ప్రకటించడంతో వచ్చే ఎన్నికల్లో తమ కలలను సాకారం చేసే వారి వెంటే నడుస్తామని ఉద్యోగ సంఘాల నేతలు చెపుతున్నారు. ఆందోళనను పట్టించుకోని బాబు సీపీఎస్ విధానం రద్దు చెయ్యాలనే డిమాండ్తో ఇప్పటికే వివిధ స్థాయిల్లో ఆందోళనలు జరిగాయి. సీపీఎస్ విధానం రద్దు చేసి, పాత పెన్షన్ విధానం కొనసాగించాలని జరుగుతున్న ఉద్యమాలను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఇటీవల స్పష్టమయ్యింది. ఈనెల 4న తిరుపతిలో జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సభలో సీఎం చంద్రబాబు మాటల్లో ఇది బహిర్గతం అయ్యింది. సీపీఎస్ రద్దు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదని, అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని సీఎం చెప్పడంపై సీపీఎస్ ఉద్యోగులు విరుచుకుపడుతున్నారు. సీపీఎస్పై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేస్తున్నా సీపీఎస్ రద్దుపై చంద్రబాబు తప్పించుకునే తీరును ఉద్యోగ సంఘాలు తప్పుపడుతున్నాయి. ఉద్యోగి భవిష్యత్ స్టాక్ మార్కెట్లో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి ప్రతి ఉద్యోగి, తన బేసిక్ పే, డీఏలలో పదిశాతం చొప్పున ప్రతి నెలా జమ చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం మరో పది శాతం జమ చేస్తుంది. ఈ సొమ్ము మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెడతారు. స్టాక్ మార్కెట్లో వచ్చే లాభనష్టాల మీద ఆధారపడి, రిటైరైన తర్వాత ఆ ఉద్యోగికి పెన్షన్గా చెల్లిస్తారు. పాత పెన్షన్ విధానంలో మాదిరి ఈ సీపీఎస్లో నిర్ణీత మొత్తంలో పెన్షన్ వస్తుందన్న గ్యారంటీ లేదు. స్టాక్ మార్కెట్లు దెబ్బతింటే, వచ్చే పెన్షన్ తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి అసలేమి రాకపోవచ్చు. ఈ కారణం చేతే ఉద్యోగ సంఘాలు సీపీఎస్ను వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యోగుల పోరాటాన్ని జగన్ గుర్తించారు అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ ప్రటించడంతో 12 ఏళ్లుగా ఉద్యోగులు చేస్తున్న పోరాటం ప్రతిపక్ష నేతగా జగన్ గుర్తించినట్లు అయింది. ఇది మాకు ఆనందంగా ఉంది. సీపీఎస్ రద్దు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై నెట్టేయడం బాధాకరం – వీరవల్ల వెంకటేశ్వరరావు, అధ్యక్షులు, ఏపీసీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సీపీఎస్ రద్దు చేసేవారి వెంటే ఉంటాం సీపీఎస్ రద్దు చేసి, పాతపింఛన్ అమలు చెయ్యాలని ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. జగన్ ప్రకటనతో సీపీఎస్ రద్దు ఆశలకు ఉపిరి ఊదినట్లయింది. సీపీఎస్ రద్దు చేసేందుకు కృషి చేసేవారి వెంటే ఉద్యోగులుంటారు. ఎమ్మెల్యే, ఎంపీలుగా 5 ఏళ్లు చేసినవారికి జీవిత పెన్షన్ ఉంటే 30 ఏళ్లు సుదీర్ఘ సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగికి సీపీఎస్తో పెన్షన్ బదులు టెన్షన్ మిగులుతుంది. – వేమవరపు ఏడుకొండలు, జిల్లా ఉపాధ్యక్షులు ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సీపీఎస్పై పోరాటం ఫలించింది సీపీఎస్ రద్దుపై చేస్తున్న పోరాటం జగన్ హామీతో ఫలించింది. ఉద్యోగి దాచుకున్న సొమ్మును షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టడం వల్ల ఉద్యోగి జీవితం గాలిలో దీపంగా మారుతుంది. సీపీఎస్ రద్దు విధానం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందని కేంద్రం ప్రకటించినా... ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేకపోవడం బాధాకరం. – రావూరి లక్ష్మి, సీపీఎస్ ఉద్యోగి, ఏలూరు ఉద్యోగుల పక్షపాతిగా జగన్ హామీలు ప్రజా సంకల్పయాత్ర తొలిరోజే ఉద్యోగుల పక్షపాతిగా జగన్ మాట్లాడటం హర్షణీయం. సీపీఎస్ రద్దుతోపాటు, ప్రభుత్వ ఉద్యోగి సొంత ఇంటి కల, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చెయ్యడం వంటి అంశాలపై ప్రతిపక్ష నేతగా జగన్ అవగాహనతో మాట్లాడారు. ప్రపంచ బ్యాంకు సూచనల ప్రకారం అనేక దేశాల్లో సీపీఎస్ విధానం అమలు చేసినా విఫలమైంది. – జెడ్డం సుధీర్, జిల్లా అధ్యక్షులు, ఏపీవైఎస్సార్టీఎఫ్ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు జగన్ సీపీఎస్ విధానం రద్దు చేస్తామనగానే ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపినట్ల యింది. 30 ఏళ్లపాటు సేవలందించిన ఉద్యోగికి ఏమాత్రం భరోసా ఇవ్వని సీపీఎస్ రద్దు చెయ్యడం సాహసోపేత నిర్ణయం. పాత పెన్షన్ విధానంతోనే వారి భవిష్యత్కు భరోసా ఉంటుంది. – గుంపుల వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు, బహుజన టీచర్స్ అసోసియేషన్ జగన్ నిర్ణయంతో ఉద్యోగుల్లో హర్షం జగన్ అధికారంలోకి వస్తే ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సీపీఎస్ విధానం రద్దు చేస్తామని చెప్పడం ఆహ్వానించదగ్గ అంశం. రెండేళ్లుగా సీపీఎస్ రద్దు చెయ్యాలని అనేక పోరాటాలు చేస్తునే ఉన్నాం. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం తీవ్రతరం అవుతున్న తరుణంలో జగన్ హామీ ఉద్యోగుల సమస్యలు జాతీయ స్థాయి నేతలను ఆలోచింపచేసేలా ఉంది. –ఉషా దీప్తి, జిల్లా అధ్యక్షురాలు, మహిళా విభాగం ఏపీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ -
‘కొత్త పింఛన్ విధానంతో నష్టమే’
శ్రీకాకుళం అర్బన్: నూతన పెన్షన్ విధానం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు నష్టదాయకమని ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ అన్నారు. నూతన పెన్షన్ విధానం–పర్యావసానాలపై సెమినార్ అనే కార్యక్రమాన్ని శ్రీకాకుళంలోని ఎన్జీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. నూతన ఆర్థిక విధానాల్లో భాగంగా పెన్షన్ బాధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయన్నారు. ఈ విధానాల వల్ల పాతపెన్షన్ కూడా గ్యారెంటీ లేకుండా పోతుందని అన్నారు. కాబ ట్టి ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా కలసికట్టుగా పో రాడి ప్రభుత్వం తన విధానాలను మార్చుకునేలా ఒత్తిడి తీసుకురావాలన్నారు. పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పాల్గొన్న ఈ సదస్సులో గరిమెళ్ల అధ్యయనవేదిక కన్వీనర్ ఎస్.కిషోర్కుమార్, ఉద్యోగ సంఘ నాయకుడు కె.శ్రీనివాస్, ఉపాధ్యాయ సంఘ నాయకులు గొంటి గిరిధర్ పాల్గొన్నారు. -
ఉమ్మడి రాష్ట్రాన్ని కడిగేసిన కాగ్
ఆర్థిక నిర్వహణ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాగ్ నిలువునా కడిగేసింది. 2013 మార్చితో ముగిసిన ఉమ్మడి రాష్ట్ర నివేదికను తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ ముందు ఉంచింది. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు చాలా లోపభూయిష్టంగా ఉందని కాగ్ మండిపడింది. మ్యాచింగ్ గ్రాంటును విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపింది. 2013 మార్చి నాటికి ఉమ్మడి రాష్ట్రంలో అన్నిరకాల పింఛన్లు కలిపి రూ. 72.36 లక్షల కోట్లు ఉన్నాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర పథకాలకు ఖర్చుచేయడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పింది. పింఛన్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ప్రైవేటు సంస్థకు అప్పగించారని, పింఛన్ల అర్హుల నిర్ధారణకు ప్రభుత్వ యంత్రాంగం లేదని మండిపడింది. పింఛను లబ్ధిదారులు, రేషన్ కార్డులను పోల్చిచూసేందుకు సరైన డేటాబేస్ లేదని , పింఛన్ల కోసం స్మార్ట్ కార్డుల ప్రక్రియ పూర్తికాలేదని కాగ్ చెప్పింది.