తిరుమలలో నామాల వివాదం
⇒ స్వామి అలంకరణలో లోపాలంటూ
⇒ పెద్ద జీయర్ మౌఖిక ఫిర్యాదు!
⇒ అది కుట్రలో భాగం అంటున్న రమణ దీక్షితులు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో మరోసారి నామాల వివాదం రేగింది. ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు స్వామి తిరునామం అలంకరణలో ఉద్దేశ పూర్వకంగా పొరపాట్లు చేశారా? అనుకోకుండా చేశారా? అన్న విషయాన్ని తేల్చాలని ఆలయ డిప్యూటీ ఈవో కోదండరామారావుకు శుక్రవారం పెద్ద జీయర్ స్వామి మౌఖికంగా ఫిర్యాదు చేసినట్టు ప్రచారం సాగుతోంది.
అయితే సాక్షాత్తు స్వామి అలంకరణ విషయంలో ఇలాంటి నిందారోపణలు రావటం దురదృష్టకరమని ఆలయ ప్రధాన అర్చకుడు డాక్టర్ ఏవీ రమణ దీక్షితులు అన్నారు. 50 ఏళ్లుగా స్వామి కైంకర్యాల్లో కంకణ బద్దులైన తన పేరు ప్రఖ్యాతుల్ని మలినం చేసేందుకు కొందరు ఉద్దేశపూర్వంగా కుట్ర చేస్తున్నారన్నారు. ఆలయంలో జరుగుతున్న పొరపాట్లు, అవినీతిపై మాట్లాడుతుండటం వల్లే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
పావనం.. శ్రీవారి నామం
వైష్ణవుల్లో వడగలై, తెంగలై వర్గాలు ఉన్నాయి. వడగలై వారు ఆంగ్లంలోని ‘యు’ ఆకారం, తెంగలైవారు ‘వై’ ఆకారంలో ఊర్ధ్వపుండ్రాలు (తిరునామం) ధరిస్తారు. అయితే ఈ రెండు నామాలకు భిన్నంగా తిరుమలేశుడి నుదుటన ఉండే తిరునామం తమిళ అక్షరం ‘ప’ను పోలి ఉంటుంది.