nature cure hospital
-
అభివృద్ధి చర్యలు కావాలి, పేర్ల మార్పిడితో ఒరిగేదేమిటి?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు, అలాగే 55 సంవత్స రాల నుంచి ఉన్న బల్కంపేట ‘గాంధీ ప్రకృతి వైద్యశాల’కు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పేరు పెట్టడానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. వైశ్యులకు ప్రాధాన్యం తగ్గకుండా కొత్తగా చర్లపల్లిలో నిర్మించిన రైల్వే టెర్మినల్కు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘అమరజీవి పొట్టి శ్రీరాములు టెర్మినల్’గా నామకరణం చేయాలని ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నట్టు ప్రకటించారు.అమరజీవి పొట్టి శ్రీరాములు వైశ్యుల ప్రతినిధి కాదు. ఆయనను కులం గాటికి కట్టకూడదు. ఆయన విశ్వమానవుడు. ప్రకృతి వైద్యం అంటే గాంధీ అనీ, గాంధీ అంటే ప్రకృతి వైద్యం అనే భావన చాలామంది మదిలో ఉంది. అటువంటి జాతిపిత పేరు తీసి రోశయ్య పేరు పెట్టడం సముచితం కాదు. 55 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన గాంధీ నేచర్ క్యూర్ హాస్పిటల్, కళాశాల ఏమాత్రం పురోగతి లేకుండా ఉంది. అప్పుడు మొదలుపెట్టిన బిఎన్వైఎస్ కోర్సు తప్ప కొత్తగా పెట్టిన డిప్లొమా, పీజీ కోర్సులు ఏవీ లేవు. ఈ ఆస్పత్రి ఎప్పుడూ పేషంట్స్ తాకిడితో రద్దీగా ఉంటుంది. అయితే తొంభై శాతం డాక్టర్లు, సహాయ సిబ్బంది పదవీ విరమణ చేయడంతో ఔట్ సోర్సింగ్ స్టాఫ్తో ఆస్పత్రి నడుస్తోంది. సిబ్బంది నియామకం, పరిశోధనను పోత్సహించడం, పీజీ కోర్సును ఏర్పాటు చేయడం వంటి అభివృద్ధికరమైన చర్యలు తీసుకోవాల్సింది పోయి... పేర్ల మార్పు వ్యవహారాన్ని తెర మీదకు తీసుకు రావడం సరైనదేనా అనేది ప్రభుత్వం ఆలోచించాలి. చదవండి: సునీతా త్వరలో ఇండియాకు వస్తారు.. సమోసా పార్టీ కూడా!గాంధీ నేచర్ క్యూర్ ఆస్పత్రికి తోడు జిల్లా స్థాయి ప్రకృతి వైద్యశాలలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం ఈ యాంత్రిక ప్రపంచంలో ప్రజలకు సహజ (ప్రకృతి) వైద్యాన్ని అందుబాటులోకి తెస్తుందని ఆశించడం అత్యాశ కాబోదు. ప్రస్తుతం పేర్ల మార్పిడి తతంగాన్ని అలా వదిలేసి కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకూ, సంస్థలకూ ఇప్పుడు నామకరణం చేయాలనుకున్న పేర్లను పెట్టవచ్చు. – డా.యం. అఖిల మిత్ర, ప్రకృతి వైద్యులు -
ప్రకృతి వైద్యానికి కేరాఫ్గా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: ప్రకృతి వైద్యానికి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్గా మారాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఇందుకు గాంధీ నేచర్ క్యూర్ ఆస్పత్రిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు కల్పించేందుకు రూ.6 కోట్లు మంజూరు చేస్తున్నామని, వెంటనే టెండర్ ప్రక్రియ చేపట్టి పనులు మొదలు పెట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. హరీశ్రావు ఆదేశాలతో ఇప్పటికే విజయవాడలోని మంతెన సత్యనారాయణ ప్రకృతి వైద్యశాలను అధికార బృందం అధ్యయనం చేసి వచ్చింది. ఈ నివేదికపై అరణ్య భవన్లో శనివారం ఆయుష్ డైరెక్టర్ ప్రశాంతి, హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రెటరీ రిజ్వీ, డీఎంఈ రమేశ్రెడ్డి, నేచర్ క్యూర్ హాస్పిటల్ డాక్టర్లు, ఆఫీసర్లు మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ తెలంగాణ, హైదరాబాద్ అన్ని రంగాల్లో ముందుందని తెలిపారు. అయితే ప్రకృతి వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా హైదరాబాద్కే వచ్చేలా గాంధీ నేచర్ క్యూర్ హాస్పిటల్ను తీర్చిదిద్దాలని ఆదేశించారు. నేచర్ క్యూర్ ఆస్పత్రిలో నాచురోపతి ఓపీ, ఐపీ సేవలకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రకృతి వైద్యానికి తగిన విధంగా వాతావరణం ఉండేలా పచ్చదనాన్ని పెంచాలన్నారు -
హైదరాబాద్లో యోగా కేంద్రం
కేంద్ర ప్రభుత్వం సుముఖత ఆయుష్ మంత్రి శ్రీపద్ను కలసిన వేణుగోపాలాచారి శంషాబాద్ వద్ద స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడి నేచర్ క్యూర్ ఆసుపత్రి ఆధునీకరణకు ఆర్థికసాయం అందించాలని విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్లో యోగా అధ్యయన, అభ్యాస కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్.వేణుగోపాలాచారి శనివారం కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపద్ నాయక్ను కలసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా యోగాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తున్నారని, అందులో భాగంగా హైదరాబాద్లో యోగా అధ్యయన, అభ్యాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వేణుగోపాలాచారి మంత్రిని కోరారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఈ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఎయిర్పోర్ట్ వద్ద ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే పక్కరాష్ట్రాల వారికి కూడా సౌకర్యంగా ఉంటుందన్నారు.పలు దశాబ్దాలుగా తెలంగాణలో యూనానీ మందుల వాడకం విరివిగా ఉందని మంత్రికి వివరించారు. అలాగే హైదరాబాద్లోని బేగంపేట వద్ద ఉన్న నేచర్ క్యూర్ ఆసుపత్రి ఆధునీకరణ పనులకు కేంద్రం ఆర్థికసాయం అందించాలని కోరారు. యోగా అధ్యయన, అభ్యాస కేంద్రం ఏర్పాటు చేయడానికి తగిన ప్రతిపాదనలు పంపితే వెంటనే అనుమతులను మంజూరు చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.