breaking news
m vallet
-
వారెవ్వా.. వాలెట్
సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా..రోడ్డు భద్రత నిబంధనలను బేఖాతరు చేశారా...తస్మాత్ జాగ్రత్త. ఆర్టీఏ అధికారులు, ట్రాఫిక్ పోలీసులే కాదు. మీ మొబైల్ ఫోన్ కూడా మిమ్మల్ని హెచ్చరిస్తుంది. మీకు తెలియకుండానే ఉల్లంఘించే నిబంధనలపైన పోలీసులు నమోదు చేసే కేసులు ఎప్పటికప్పుడు మీ మొబైల్కు చేరిపోతాయి. డ్రంకన్ డ్రైవ్, ఇతర ఉల్లంఘనల్లో మీ వాహనంపైన రవాణాశాఖ నమోదు చేసే ‘పెనాలిటీ పాయింట్స్’ ఎప్పటికప్పుడు మీ స్మార్ట్ఫోన్లోనే చేసుకోవచ్చు. రోడ్డు నిబంధనలపై పదే పదే తప్పులు చేయకుండా వాహనదారులను నిరంతరం అప్రమత్తం చేసేందుకు రూపొందించిన ‘ఆర్టీఏ –ఎం వాలెట్’ మొబైల్ యాప్ను రవాణాశాఖ మరింత ఆధునీకరించింది. అన్ని రకాల పౌరసేవలను ఒక్క యాప్తో పొందే సదుపాయాన్ని కల్పించింది. రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఈ అప్లికేషన్కు వాహనదారుల నుంచి అనూహ్య ఆదరణ లభిస్తోంది. 20.38 లక్షల మంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో ఏడాది క్రితం ట్రాఫిక్ ఈ చలానాలను ఆర్టీఏ – ఎం వాలెట్ నుంచి పొందడంతో పాటు ఆన్లైన్లో చలానాలు చెల్లించే సదుపాయాన్ని ప్రవేశపెట్టిన అధికారులు తాజాగా ‘పెనాల్టీ పాయింట్స్’ కూడా తెలుసుకొనే అవకాశం కల్పించారు. వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సు మనుగడలో ఉన్నదీ లేనిదీ కూడా చెప్పేస్తుంది. పోలీసులు, ఆర్టీఏ అధికారులు నమోదు చేసే కేసులను తప్పించుకునే అవకాశం లేకుండా ‘ఆర్టీఏ –ఎం వాలెట్’ ఒక హెచ్చరికలా పని చేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఒక్కసారి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు మీ బండి జాతకం మొత్తం తెలిసిపోతుంది. మీకు బండి నడిపే అర్హత మీకు ఉందో లేదో చెప్పేస్తుంది. అరచేతిలో సమస్తం ♦ మొదట్లో డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ డేటాను వినియోగదారులు తమ మొబైల్ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకొనే సదుపాయాన్ని కల్పిస్తూ రవాణాశాఖ 2016 మార్చి 30న ‘ఆర్టీఏ–ఎం వాలెట్’ యాప్ను ప్రవేశపెట్టింది. కొద్ది రోజులకే లక్షలాది మంది వాహనదారులు ఈ యాప్ను ద్వారా తమ డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రస్తుతం 20, 38000 మంది ఆర్టీఏ ఎం వాలెట్ సేవలను వినియోగించకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ యాప్ను మరింత సేవలకు విస్తరించేందుకు రవాణాశాఖ చర్యలు చేపట్టింది. ♦ ట్రాఫిక్ చలానాల నమోదు వివరాలతో పాటు ఆన్లైన్ చెల్లింపులకు అవకాశం కల్పించారు. ♦ ‘వాహనం ఇన్సూరెన్స్’ స్టేటస్ను కూడా తెలుసుకోవచ్చు. ♦ ట్రాఫిక్ ఉల్లంఘనలపై నమోదయ్యే పెనాల్టీ పాయింట్స్ ఆప్షన్ను కూడా ప్రవేశపెట్టారు. ♦ లెర్నింగ్ లెసెన్సులు, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల కొత్త రిజిస్ట్రేషన్ల కోసం, డ్రైవింగ్ లైసెన్సు రెన్యువల్ కోసం ఆర్టీఏ ఎం వాలెట్ నుంచి నేరుగా స్లాట్ నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లించవచ్చు. ♦ వరుసగా 12 పాయింట్లు నమోదైనప్పుడు, లేదా ఇతర కారణాల వల్ల ఆర్టీఏ అధికారులు డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేసినా ఆ వివరాలు ఈ యాప్లో కనిపిస్తాయి. డ్రైవింగ్ లైసెన్సు స్టేటస్ తెలిసిపోతుంది. ♦ టీ యాప్ ఫొలియోతో అనుసంధానం ♦ ప్రస్తుతం ప్రభుత్వం అన్ని రకాల పౌరసేవలను ఒకే యాప్ ద్వారా అందజేసేందుకు ప్రవేశపెట్టిన ‘ టి యాప్ ఫొలియో (ఎఫ్ఓఎల్ఏఓ) తో ఆర్టీఏ ఎం వాలెట్ను అనుసంధానం చేశారు. ఈ యాప్ ద్వారా కూడా ఆర్టీఏ సేవలను పొందవచ్చు. -
ఆన్లైన్ వ్యవస్థ బలోపేతం
ఎం వాలెట్ యాప్ ప్రతి ఒక్కరూడౌన్లోడ్ చేసుకోవాలి కార్యాలయాల్లో దళారీ వ్యవస్థ లేకుండా చేస్తాం రోడ్డు ప్రమాదాలు, ఓవర్లోడ్పై ప్రత్యేక దృష్టి ‘సాక్షి’తో డీటీసీ మమత ప్రసాద్ మహబూబ్నగర్ క్రైం: రాబోయే రోజుల్లో బ్యాంకుల మాదిరి డీటీసీ కార్యాలయాల్లో టోకన్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఒకరి తర్వాత ఒకరు పనులు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఓ బ్యాంకుకు ఖాతాదారుడు నేరుగా వెళ్లి నగదు డ్రా చేయడం.. లేదా నగదును బ్యాంకులో వేయడం ఎలా చేస్తాడో అదే పద్ధతిలో డీటీసీ కార్యాలయాలకు వాహనదారుడు నేరుగా వచ్చి వారి పనులు చేసుకునే విధంగా చైతన్యం తీసుకువస్తాం. కార్యాలయాల్లో పూర్తిగా దళారీ వ్యవస్థ అనే పదం లేకుండా చేయడానికి కృషి చేస్తాం. రోజు రోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరగుతున్నాయి. సర్వేల్లో మానవ తప్పిదం, నిర్లక్ష్యం ప్రధాన కారణాలని తేలింది. గత ఏడాది కేవలం ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ లేనికారణంగా 30శాతం మృతిచెందారు. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపటం, ఓవర్టెక్ చేయడం, హెల్మెట్లు లేకపోవడమే ప్రధాన కారణం’’ అని అన్నారు జిల్లా డిప్యూటీ ట్రాన్స్ఫోర్ట్ కమిషనర్(డీటీసీ) మమత ప్రసాద్. డీటీసీగా బాధ్యతలు స్వీకరించిన ఆమె సాక్షికి ప్రత్యేకంగా ఇంటర్వూ్య ఇచ్చారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ఆన్ లైన్ వ్యవస్థపై అవగాహన కార్యక్రమాలు ఆన్లైన్ వ్యవస్థపై జిల్లాలో ఇప్పటికే కొంతవరకు అవగాహన వచ్చింది. దీనిని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రోడ్లపై, గ్రామాల్లో వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. మొదట్లో 15రకాల సేవలు మాత్రమే ఆన్లైన్లో అందుబాటులో ఉండేవి. మిగిలిన 42రకాల సేవలకు కార్యాలయానికి వచ్చి డబ్బులు చెల్లించి రశీదు పొందాల్సి ఉండేది. కానీ ప్రస్తుతం 57రకాల సేవలను ఆన్లైన్ చేశాం. ఆన్లైన్తోపాటు ప్రతి వాహనదారుడు ఎం వ్యాలెట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ఉంటే తనిఖీలు చేసిన సమయంలో వాహనదారుని వెంట పత్రాలు లేకపోయిన యాప్లో ఉన్న వాటిని చూపిస్తే సరిపోతుంది. వాహనదారుడు కేవలం సంతకం, ఫొటో, తంబ్ఇంప్రెషన్ చేయడానికి మాత్రమే కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. ఇతర వ్యక్తులకు ఏమాత్రం కార్యాలయానికి రావాడానికి అవకాశం లేదు. దళారీ వ్యవస్థ ఉండదు ప్రస్తుతం కార్యాలయాల్లో ఆన్లైన్ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి రావడం వల్ల దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలన చేస్తాం. వాహనదారుడు నేరుగా కార్యాలయానికి వచ్చి అతని పని పూర్తిచేసుకున్న తర్వాత వారికి సంబంధించిన లైసెన్స్లను స్పీడ్ పోస్టుద్వారా ఇళ్లకు పంపిస్తాం. కార్యాలయంలో పూర్తిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. కొత్త వ్యక్తులు రావడానికి అవకాశం లేదు..కేవలం స్థానిక సిబ్బంది తప్ప, ఇతర వ్యక్తులు లోపలికి రావడానికి అనుమతి లేదు. వాహనదారులతో అధికారులు, ఏజెంట్లు కానీ డబ్బులు వసూళ్లు చేసినట్లు అయితే అలాంటి వారిపై శాఖపరమైన చర్యలు ఉంటాయి. చెక్పోస్టుపై ప్రతిపాదనలు పంపిస్తాం జిల్లాల విభజన తర్వాత ఒక చెక్పోస్టు గద్వాలకు, మరో చెక్పోస్టు నాగర్కర్నూల్ జిల్లాకు వెళ్లాయి. ప్రస్తుతం మహబూబ్నగర్లో కొత్త చెక్ పోస్టులు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రస్తుతం 16మంది సిబ్బంది మహబూబ్నగర్ డీటీసీ కార్యాలయం పని చేస్తుంది. ఖాళీలపై ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు పంపిస్తాం. జిల్లాలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గించడానికి వారంలో ఒకరోజు ప్రత్యేకంగా జాతీయ రహదారిపై సీటుబెల్టు, సెల్ఫోన్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, హెల్మెట్ ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తాం. నిత్యం రహదారిపై అక్కడక్కడ తనిఖీలు చేయడంపై ప్రత్యేక దృష్టి పెడుతాం. ఓవర్లోడ్పై కఠిన చర్యలు జిల్లాకు అంతరాష్ట్ర సరిహద్దులు ఉన్నాయి. ఈ క్రమంలో రాత్రిసమయంలో ఓవర్లోడ్తో వెళ్తున్న వాహనాలు కోసం ఎన్ఫోర్స్మెంట్తో ప్రత్యేక తనిఖీలు చేసి ని బంధనలకు వ్యతిరేకంగా ఉంటే సీజ్ చే స్తాం. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ బస్సు లు కచ్చితంగా ఫిట్నెస్ పత్రాలు ఉండాలి. లేకపోతే వాటిపై కూడా చర్యలు తప్పవు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇచ్చిన తేదీ ప్రకారం రావాలి ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకున్న వాహనదారులకు వెంటనే సమయం ఇస్తారు. ఆ ప్రకారం హాజరు కావాలి. ఉదయం 10.30 గంటల నుంచి 11.30వరకు, మళ్లీ 11.30నుంచి మధ్యాహ్నం 12గంటల వ రకు, మధ్యాహ్నం 12.30నుంచి 1.30వరకు ఇచ్చిన తేదీ ప్రకారం ఆర్టీఏ కార్యాలయానికి హాజరుకావాలి. ఆలస్యంగా వచ్చిన వారికి మధ్యాహ్నం 1.30 నుంచి 2గంటల వరకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. మిగిలిన సమయంలో అనుమతి లేదు. ఆన్లైన్ చేసుకున్నవారు కార్యాలయంలో సంతకం, ఫొటో, వేలిముద్రలు, వాహనం నడపడం మాత్రమే ఉంటుంది. డబ్బులు మొత్తం ఆన్లైన్లోనే చెల్లిం చాల్సి ఉంటుంది. ఎవరికీ నయాపైసా చెల్లించొదు్దు.హ్యాండ్లింగ్చార్జీల వసూళ్లను మేము అడ్డుకోవడం కాదు. వాహనం కొనుగోలుదారు అడ్డుకోవాలి. కొత్త వాహనం కొనుగోలు చేసిన వ్యక్తి షోరూంలో అదనపుచార్జీలు వసూళ్లు చేస్తున్నట్లు తెలిస్తే నేరుగా ఆర్టీఓకు పిర్యాదు చేయాలి. రవాణాశాఖ ప్రత్యేక వెబ్సైట్ ఆన్లైన్ సేవలకు రవాణశాఖ ప్రత్యేక వెబ్సైట్ ఉంది. 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తెలంగాణ.ట్రాన్స్పోర్ట్.జీఓవి.ఇన్' ఈ వెబ్సైట్ ద్వారా అన్ని సేవలు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. వాహనదారులు దీంట్లో వారివారి పనుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రతి చిన్న పనికి ఇకనుంచి కార్యాలయానికి రానవసరం లేదు. ఈ ఆన్లైన్ సేవలు కేవలం వాహనాదారులకు పనులు సులభతరం చేయడానికి రూపొందించింది. భవిష్యత్లో మరిన్ని సేవలు వాహనదారులకు అందుబాటులోకి వస్తాయి.