breaking news
Kashi travel
-
కాశీ యాత్రకు ‘రైలు’ కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్లిరావాలని చాలా మంది పెద్దల కోరిక. అంతదూరం ప్రయాణించాల్సి రావడంతో.. కాశీకి వెళితే కాటికి వెళ్లినట్టే అన్న సామెత కూడా పుట్టింది. ఇప్పుడు ఇంతగా ప్రయాణ సౌకర్యాలు పెరిగినా మన రాష్ట్రవాసులకు మాత్రం కాశీ యాత్ర కష్టాలు మాత్రం తప్పడం లేదు. అంత దూరం ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించలేక, విమాన ప్రయాణ ఖర్చులు భరించలేక.. రైళ్లను ఆశ్రయించే భక్తులు తిప్పలు పడుతున్నారు. రెండు నెలల ముందు రిజర్వేషన్ కోసం బుక్ చేసుకున్నా వెయిటింగ్ లిస్టే ఉంటూ.. సగం మందికి కూడా సీట్లు మాత్రం కన్ఫర్మ్ కావడం లేదు. హైదరాబాద్ నుంచి రోజూ ఒక్క రైలు మాత్రమే ఉండటం దీనికి కారణం. అంతేకాదు కాశీ వెళ్లే భక్తులతోపాటు ఉత్తరాదికి వెళ్లే ఇతర ప్రయాణికులూ ఈ రైళ్లలో టికెట్లు బుక్ చేసుకుంటుండటంతో డిమాండ్ మరింతగా పెరిగిపోయింది. దీనితో భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకుని మళ్లీ టికెట్లు బుక్ చేసుకోవాల్సి వస్తోంది. డిమాండ్ ఉన్నా రైలు లేదు కాశీ విశ్వనాధుడిని దర్శించుకునేందుకు వెళ్లే దక్షిణ భారత యాత్రికుల్లో తెలుగు వారే ఎక్కువ. నిత్యం రెండు వేల మంది వరకు కాశీకి వెళతారని ఒక అంచనా అందులో రైలు ద్వారా వెళ్లేవారు వెయ్యి మందికిపైగా ఉండగా.. మిగతా వారు రోడ్డు మార్గంలో, అతికొద్ది మంది విమానాల్లో ప్రయాణిస్తున్నట్టు చెబుతున్నారు. రైల్లో కాశీకి వెళ్లేవారికి దానాపూర్ ఎక్స్ ప్రెస్ ఒక్కటే ఆధారం. బిహార్ నుంచి వచ్చి, తిరిగి వెళ్లే కూలీలకూ ఈ రైలే దిక్కు. అయితే ప్రయాణికుల డిమాండ్, వెయిటింగ్ లిస్టు ఎక్కువగా ఉన్నప్పుడు రైల్వే ఆయా మార్గాల్లో క్లోన్ రైళ్లను నడిపేది. అంటే అదే మార్గంలో అరగంట తేడాతో మరో రైలును అదనంగా నడిపేది. దానితో కొంత వరకు వెయిటింగ్ లిస్టు ప్రయాణికులకు అవకాశం దక్కేది. ఇలా సికింద్రాబాద్–దానాపూర్ మధ్య ఓ క్లోన్ రైలును నడిపేవారు. కానీ కరోనా ఆంక్షల సమయంలో నిలిపివేసిన ఆ రైలును మళ్లీ పునరుద్ధరించలేదు. దీనిపై దక్షిణ మధ్య రైల్వే జీఎం స్వయంగా రైల్వే బోర్డును కోరినా స్పందన రాలేదు. రైల్వే స్పందించి అదనపు రైలు వేయాలని, లేదా క్లోన్ రైలు నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదీ చదవండి: వందే భారత్ రైలు.. హైదరాబాద్ ట్రాక్లపై నడిచేనా! -
ఖేడ్ వాసుల సహసయాత్ర
కాలినడకన కాశీ 1200 కి.మీ... 31రోజులు దిగ్విజయంగా పూర్తి చేసిన యువకులు సర్వత్రా హర్షం సాక్షి’తో పంచుకున్న మధురానుభూతులు మనూరు:పూర్వం కాశీ యాత్ర అంటే.. అదో సహస యాత్రగా భావించేవారు. కాశీకి వెళ్లి వచ్చారంటే ఆ ప్రాంతంలో అదో పెద్ద చరిత్ర. నేటి కాలంలో.. టెక్నాలాజీ, ప్రయాణ సాధనాలున్నాయి. ఆకాశ మార్గాన వెళితే ఒక్క రోజులోనే చేరుకుని విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవచ్చు. మరో రోజులో స్వగ్రామంలో ఉండవచ్చు. కాదంటే రోడ్డు మార్గానా.. ఇతర ప్రయాణ సాధనాల ద్వారా వెళ్లవచ్చు. వారం రోజులో తమ యాత్రను ముగించుకోవచ్చు. కాని నేటి తరానికి విరుద్ధంగా దాదాపు 1200 కిలోమీటర్ల మేర కాశీ యాత్రకు కాలినడకన ఖేడ్ వాసులు శ్రీకారం చుట్టడమేకాక, యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని ఇటీవలే వారు స్వగ్రామాలకు చేరుకున్నారు. దీంతో సంబంధిత యువకులను ‘సాక్షి’ పలకరించింది. యాత్ర విశేషాలను అడిగి తెలుసుకుంది. నారాయణఖేడ్, మనూరు మండలాలకు చెందిన 11మంది యాత్రికులు వారి మనోగతాన్ని సాక్షితో పంచుకున్నారు. ఇందులో ఆరుగురు మనూరు మండలంలోని బాదల్గాం, అతిమ్యాల్ గ్రామానికి చెందిన వారున్నారు. మిగతా వారు నారాయణఖేడ్, జి.హుక్రానాకు చెందిన వారు ఉన్నారు. యాత్రకు నామకరణం కాశీ మహాపాదయాత్రకు ప్రత్యేక నామకరణం చేశారు. దీనికి తెలంగాణ ప్రజాకల్యాణ్ కాశీ మహా పాదయాత్రగా పేరు పెట్టారు. ఈ యాత్రను వీరు ఏప్రిల్ 29న నారాయణఖేడ్ రామ మందిరంనుంచి ప్రారంభించారు. యాత్రను స్థానిక ఆధ్యాత్మిక గురువు కరణ్గజేంద్ర మాహారాజ్ జెండా ఊపీ యాత్రను ప్రారంభించారు. యాత్ర కొనసాగింది ఇలా.. ఖేడ్ నుంచి ప్రారంభమైన యాత్ర తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది రోజులు కొనసాగింది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించింది. మహారాష్ట్రలో ఆరు రోజులపాటు కొనసాగి నాగ్పూర్ మీదుగా మధ్యప్రదేశ్లోకి చేరింది. మధ్యప్రదేశ్లో శివుని జిల్లా, ప్రెంచ్టైగర్హిల్స్ రిజర్వ్పార్కు గుండా శివనిడి, జబల్పూర్ నుంచి 20 రోజుల అనంతరం మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర ప్రదేశ్లోని త్రివేణి సంఘమం,ప్రయాగానుండి 18శక్తి పీఠాలలోని ఒకటైన మాధవేశ్వరి శక్తిపీఠంను దర్శించుకుని అక్కడినుంచి 120 కిమీటర్లు పాదయాత్రతో కాశీకి చేరుకున్నట్టు వారు తెలిపారు. కాశీ విశ్వేశ్వరుని దర్శనం.. కాశీ విశ్వేశ్వరుని దర్శనం మరువలేనిది. పాదయాత్ర కు సహకరించిన దాతలకు, భక్తులకు కృతజ్ఞతలు. తమ యాత్ర ఫలాలు తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా మెదక్ జిల్లా వాసులకు అందాలని సమృద్ధిగా వర్షాలు కురవాలని, కరువు ఛాయలు పోవాలని ఆ భగవంతునితో కోరుకున్నాం. – డి. వెంకటరమణరెడ్డి, జి.హుక్రానా సైకత శివలింగానికిSపూజలు కాశీలోని గంగా యమున నది ఒడ్డున సైకత శివలింగం చేసి ప్రత్యేకపూజలు చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. అది ఒక అనుభూతిగా మిగిలింది. అక్కడ ఎంతోమంది భక్తులు సైకత లింగం చేసి ప్రత్యేక పూజాలు నిర్వహించడం, నదిలో దీపాలు వదలడం కన్పించింది. –రమేశ్రెడ్డి, నారాయణఖేడ్ రోజూ రాగి జావా పాదయాత్రకు వెళ్లె ముందు భోజన ఏర్పాట్లు, రాత్రి బసకు సంబంధించి ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ముగ్గురు ఆడవారు పాదయాత్రీకులకు ముందుగా భోజనం వండి సిద్ధంగా ఉంచేవారు. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య ఉప్మా, గ్లాసు రాగిజావా, సుశీలాను అల్పహారంగా తీసుకునేవారు. మధ్యాహ్నం సమయంలో జొన్నరొట్టెలు, అన్నం, కూరగాయలు, సాంబారు. మూడు గంటలకు చాయి వంటివి తీసుకునేవారం. –సంజీవ్కుమార్, నారాయణఖేడ్ దేవాలయాల్లో బస: రోజూ రాత్రి ఆయా గ్రామాలలోని పాఠశాలలు, దేవాలయాలలో నిద్రించేవారం. ఉదయం తెల్లవారుజామునే పాదయాత్ర ప్రారంభించే వాళ్లం. రోజూ ఉదయం 20కి.మీ., సాయంత్రం 20 కి.మీ. మేర పాదయాత్ర చేసేవాళ్లం. –నాందేవ్రెడ్డి అందరూ అభిమానించారు.. రోజూ పాదయాత్ర వెళుతున్న క్రమంలో దారివెంట ఎంతో మధురానుభూతి కలిగించింది. ఎక్కడ కూడా తమను అవమానించడం, అమర్యాదగా మాట్లాడటం వంటివి కన్పించలేదు. అక్కడక్కడా లారీ డ్రైవర్లు తమను పలుకరించి కాశీయాత్రనా? అని కొంత మేర డబ్బులు సైతం ఇచ్చి యాత్రను విజయవంతం కావాలని కోరడం కన్పించింది. ఆ అనుభూతి మరువలేనిది. –ఆర్. కృష్ణారెడ్డి పది నదుల్లో స్నానాలు చేశాం దారి వెంట ఉన్న ప్రతి నదిలో తాము స్నానాలు చేశాం. నది వద్ద ప్రత్యేక హారతి కార్యక్రమం చేపట్టాం. ప్రాణహిత, పెన్గంగా, వార్ద, పంచ్ధారా, నర్మద, కట్ని, రీవా, తమస్ నదులతోపాటు చివరగా కాశీలోని గంగా–యమునా నదులను దర్శించుకున్నాం. –హెచ్.సుభాష్ జంగం వాడి మఠంలో ఉన్నాంః కాశీలో దాదాపుగా అందరు తెలుగు భాషా మాట్లాడేవారే అధికంగా అగుపించారు. తాము కాశీలో ప్రసిద్ధి చెందిన జంగంవాడి మఠంలో మూడు రోజులపాటు బసచేశాం. –విఠల్ అన్నపూర్ణ దేవి సత్రంలో భోజనం చేయాల్సిందే.. కాశీలోని అన్నపూర్ణ దేవి సత్రంలో చేసిన భోజనం మరువలేనిది. ఎవరైనా కాశీకి వెళ్లితే తప్పకుండా అన్నపూర్ణదేవి సత్రంలో భోజనం చెయ్యాలని చెబుతా –అంజుగొండ గో సంపద ఎక్కువ దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశంలో గో సంపద ఎక్కువగా కన్పించిది. అక్కడ ప్రతి ఇంటికి పదుల సంఖ్యలో ఆవులు ఉండటం చూశాం. –నర్సింలు గంగా హారతిలో పాల్గొన్నాం కాశీలో సాయంత్రం నిర్వహించే గంగా హారతీలో తాము పాల్గొన్నాం. ఇది తమకెంతో అనుభూతి, భక్తి భావం కలిగింది. హారతి చేస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరూ చూడాల్సిందే. –లక్ష్మమ్మ