ముగ్గురు విద్యార్థులను బలిగొన్న రోడ్డు ప్రమాదం
మృతులు బీహార్, జార్ఖండ్వాసులు
జేఎన్యూలో విషాదం
సాక్షి, న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ) క్యాంపస్లో జరిగిన రోడ్డు దుర్ఘటనలో ముగ్గురు విద్యార్థులు మరణించారు. వీళ్లు ప్రయాణిస్తున్న మోటారు సైకిల్ డివైడర్ను ఢీకొని చెట్టుకు బలంగా తగిలిందని పోలీసులు చెప్పారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలకు జరిగింది. మరణించిన విద్యార్థులందరూ 20 ఏళ్లకు పైబడినవారే.
వారిని రవిసింగ్ చౌదరి, రవిశంకర్ గుప్తా, సంతోష్ కుమార్గా గుర్తించారు. సంతోష్ జార్ఖండ్ రాంచీకి చెందినవాడు కాగా, మిగతా ఇద్దరి స్వస్థలం బీహార్లోని గయ అని తెలిసింది. ఈ ముగ్గురు విద్యార్థులు జేఎన్యూలో ఎంఏ (కొరియన్ భాష) చదువుతున్నారు.
ముగ్గురు విద్యార్థులు వేర్వేరు హాస్టళ్లలో ఉంటారని పోలీసులు తెలిపారు. గుప్తా తపతి హాస్టల్లో, రవి చందన్ధారలో, సంతోష్ కావేరీ హాస్టల్లో ఉంటారని జేఎన్యూ అధికారులు చెప్పారు. ప్రమాదం ఈస్ట్ గేట్ ఎదుట ఉన్న వైస్చాన్స్లర్ లాంజ్ దగ్గర జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ముగ్గురు విద్యార్థులు బైకుపై వెళ్తుండగా, అది ఈస్ట్ గేట్ ఎదుట అదుపుతప్పి మొదట డివైడర్ను ఢీకొట్టింది.
ఆ తరువాత చెట్టును బలంగా ఢీకొంది పోలీసులు చెప్పారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిలో ఒకరిని ఎయిమ్స్ ట్రామా సెంటర్కు, మిగతా ఇద్దరిని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారని పోలీసులు తెలిపారు. ముగ్గురిలో ఒకరు దుర్ఘటన స్థలంలోనే మరణించారని, మిగతా ఇద్దరు కూడా గాయాల తీవ్రత కారణంగా ప్రాణాలు కోల్పోయారని వైద్యులు చెప్పారు. వసంత్కుంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
జేఎన్యూలో విషాదం..
విద్యార్థుల మరణంతో జేఎన్యూలో విషాద వాతావరణం నెలకొంది. యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు రాత్రి వేళల్లో చదువుతూ టీ, కాఫీల కోసం బయటకు రావడం మామూలే. దీనివల్ల క్యాంపస్లలో అర్థరాత్రి వేళల్లోనూ సందడిగానే ఉంటుంది. జేఎన్యూ క్యాంపస్ సమీపలోని గంగాదాభా రాత్రి 3.30 గంటల వరకు తెరచే ఉంటుంది.
ప్రస్తుతం రాత్రిపూట వాతావరణం కూడా ఆహ్లాదంగా ఉంటోంది. అందువల్ల విద్యార్థులు రాత్రి పూట ఎక్కువ సేపు బయటే గడుపుతున్నారని జేఎన్యూ విద్యార్థి ఒకరు చెప్పారు. మోటారుసైకిల్ దుర్ఘటన జరిగినప్పుడు పెద్ద చప్పుడు వినిపించిందని చెప్పారు. మితిమీరిన వేగం, ముగ్గురు ఒకే మోటారు సైకిల్పై ప్రయాణించడం వల్ల వాహనం అదుపుతప్పి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.