breaking news
Integration Aadhaar
-
అంతా ‘ఆధార్’ మయం
* పోలీస్శాఖకూ ఆధార్ అనుసంధానం * అరెస్టు ముందు నిందితుని సంఖ్య నమోదు * భవిష్యత్లో ఫింగర్ ప్రింట్స్కూ అనుసంధానం * ఇక నేరగాళ్ల చరిత్ర పోలీసుస్టేషన్లలో క్షణాల్లో ప్రత్యక్షం మార్కాపురం : ఆధార్ సంఖ్య నమోదు విధానాన్ని పోలీస్శాఖలోనూ అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రేషన్కార్డులు, విద్యార్థుల ఉపకారవేతనాలు, విద్యుత్ మీటర్లు, పాస్పుస్తకాలు, పింఛన్లు, సంక్షేమ పథకాలకు అమలు చేస్తున్న ఆధార్ నమోదును ఇక నుంచి పోలీస్శాఖ కూడా అమలు చేయనున్నారు. నిందితుల అరె స్టు సమయంలో ఆధార్ సంఖ్యను నమోదు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలో అమలు చేస్తున్నారు. ఆధార్ సంఖ్యను నమోదు చేయటం వల్ల పోలీసుల దర్యాప్తు వేగంగా ముందుకు సాగనుంది. ఇప్పటి వరకూ వివిధ కేసుల్లో ఉన్న నిందితులను విడిపించేందుకు జామిన్దారులు నకిలీ సర్టిఫికెట్లు జత చేసి వారికి బెయిల్ ఇప్పిస్తున్నారు. దీంతో నిందితుడు బయటకు వచ్చిన తర్వాత మళ్లీ నేరాలకు పాల్పడుతున్నాడు. దీంతో కోర్టు నాన్బెయిలాబుల్ వారెంట్ జారీ చేసినప్పుడు పోలీసులు జామిన్దారుల అడ్రస్కు వెళ్తే అక్కడ వారి జాడ ఉండటం లేదు. ఇలాంటి మోసాలను ఆధార్ నమోదు వలన అరికట్టవచ్చు. ఆధార్కార్డు తీసే సమయంలో వ్యక్తి వేలిముద్రలు, కనుపాపలు కూడా రికార్డు చేస్తారు. పోలీస్శాఖలో కేవలం వేలిముద్రలు రికార్డు చేసే సౌకర్యం మాత్రమే ఉంది. పోలీస్శాఖలో ఫింగర్ ప్రింట్స్ విభాగాన్ని పోలీస్ నెట్వర్క్ పరిధిలోకి వచ్చే అన్ని స్టేషన్లకు అనుసంధానం చేయనున్నారు. నేరం చేసిన వ్యక్తి ఆధార్ నంబర్ నమోదు చేస్తే అతడి గత నేరాలు క్షణాల్లో తెలిసిపోతాయి. దొంగతనాలు జరిగినప్పుడు క్రైమ్ బ్రాంచి సిబ్బంది, క్లూస్ టీమ్ సిబ్బంది సంఘటన స్థలాల్లో వేలిముద్రలు సేకరించి పాత నేరగాళ్ల వేలిముద్రలతో పోల్చుకుంటుంటారు. ప్రస్తుతం ఈ విధానం వల్ల ఉపయోగం అంతంత మాత్రమే. దీని వలన నేరస్తులు త్వరగా తప్పించుకుంటున్నారు. ఆధార్ సంఖ్య నమోదు చేస్తే సదరు వ్యక్తి వేలిముద్రలతో పాటు గత చరిత్ర కూడా పోలీసుల కళ్లముందుంటుంది. ఈ సమాచారాన్ని రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్లలో తెలుసుకోవచ్చు. మార్కాపురం సబ్ డివిజన్లోని 13 పోలీస్స్టేషన్లలో నిందితుల అరె స్టు సమయంలో కచ్చితంగా ఆధార్ సంఖ్యను ఎస్హెచ్ఓలు నమోదు చేస్తున్నారు. -
‘తెలంగాణ’కే మాఫీ
ఖమ్మం జడ్పీసెంటర్ : జిల్లాలో పంటరుణాల మాఫీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు ఐదు దశల్లో అర్హుల జాబితాను తుది రూపునకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న జిల్లా యంత్రాంగం కొత్త అంశాలపై కూడా దృష్టి సారించాలని నిర్ణయించింది. రైతు రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున పకడ్బందీగా అమలు చేయాలని, ఇందుకు సంబంధించిన తుది అర్హుల జాబితాను రెండు రోజుల్లో తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్. కె. ఇలంబరితి బ్యాంకర్లను ఆదే శించారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రుణమాఫీ, ఆధార్ అనుసంధానంపై జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన అర్హుల జాబితా రూపకల్పనలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన రైతులకు మాత్రమే జిల్లాలో రుణమాఫీ వర్తింపజేయాలని, అది కూడా తెలంగాణ రికార్డుల్లో నమోదై ఉన్న భూమి అయి ఉండాలని చెప్పారు. రుణమాఫీ పొందే రైతుల భూ వివరాలతో ఆధార్కు అనుసంధానాన్ని పది రోజుల్లోగా పూర్తిచేయాలని సూచించారు. పంట రుణాల మాఫీ వర్తించే జాబితాపై గ్రామాల్లో సామాజిక తనిఖీని వేగవంతం చేసి రెండు రోజుల్లో ముందస్తు జాబితాను సిద్ధం చేసి పంపాలని , మిగిలిన రైతుల నుంచి ఆధార్ నంబర్లు స్వీకరించి బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేయాలని ఆదేశించారు. అన్ని వివరాలను సరిచూసుకుని రైతుల చివరి జాబితాను సిద్ధం చేయాలన్నారు. రుణమాఫీ పట్టికలో రైతుల పేర్లకు ఎదురుగా భూమికి సంబంధించిన వివరాలు, పాస్ పుస్తకం నంబర్, ఖాతా నంబర్, సర్వే నంబర్, విస్తీర్ణం, రెవెన్యూ గ్రామం తప్పనిసరిగా పొందుపరచాలని సూచించారు. సత్తుపల్లి, తల్లాడ, ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో రుణాలు పొందినట్లు ఆరోపణలు వచ్చాయని, ఈ కుంభకోణంపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మండలాల్లో రైతుల జాబితా తయారీలో బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. పంట రుణమాఫీ పొందాలంటే ఆ రైతు తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తుండాలని, భూములు కూడా తెలంగాణలోనే ఉండాలని స్పష్టం చేశారు. రీ షెడ్యూల్ చేసిన రైతులకు రుణమాఫీ వర్తించదని ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉందని, అయితే ఈ విషయంపై ఏం చేయాలన్నది ప్రభుత్వానికి లేఖ రాస్తామని వెల్లడించారు. ఒకరైతు ఒకటి కంటే ఎక్కువ మొత్తంలో రుణం పొంది ఉంటే... ఎక్కువ మొత్తం రుణంగా పొంది ఉన్న బ్యాంకులో రుణమాఫీకి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. రెండో ప్రాధాన్యతగా మొదటిసారి రుణం పొందిన బ్యాంకుకు ఇవ్వాలన్నారు. నగరాల్లో బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు పొందిన అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఇక బంగారం విషయానికి వస్తే ఆ రుణాలు పంటల కోసమే తీసుకున్నట్టుగా రైతుల నుంచి ధ్రువీకరణ తీసుకున్న తర్వాతే అర్హుల జాబితాలో చేర్చాలని సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రాబ్యాంకు డీజీఎం ధనుంజయ్, స్టేట్బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏజీఎం శ్రీనివాసరెడ్డి, ఏపీజీవీబీ జీఎం నారాయణ, డీసీసీబీ సీఈవో నాగచెన్నారావు, వ్యవసాయ శాఖ జేడీ భాస్కర్రావు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసనాయక్, ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ ఆర్డీవోలు సంజీవరెడ్డి, అంజయ్య, అమయ్కుమార్, వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.